
- లక్షలాదిమంది గిరిజనులను నిర్వాసితులను చేసే పోలవరం ప్రాజెక్టుది ఆదినుంచి వివాదాల చరిత్రే!
- పెద్దఎత్తున వ్యక్తమవుతున్న వ్యతిరేకతను ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను చేపట్టింది.
- ఖమ్మం జిల్లాలో పెద్దఎత్తున ఉద్యమించిన గిరిజనులపై ప్రభుత్వం దమన నీతిని ప్రయోగించింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 230కి పైగా గిరిజన గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలున్నప్పటికీ అడవిబిడ్డలను ముంపునకు గురిచేసే ప్రస్తుత డిజైన్వైపే ప్రభుత్వం మొగ్గుచూపడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
- కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున లబ్ధిచేకూర్చడానికే ప్రభుత్వం ఈ డిజైన్వైపు మొగ్గు చూపుతోందన్నది ఈ విమర్శల సారాంశం. మరోవైపు ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఒడిషా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
- ఆ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలపై సుప్రీం ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు. ఈ లోగానే పోలవరం ప్రాజెక్టు మరో వివాదంలో చిక్కుకుంది.
- పోలవరం స్పిల్వే, రాక్ఫిల్డ్యాం, జలవిద్యుత్కేంద్రం పునాది పనులకు సంబంధించిన టెండర్ల ఆర్థికబిడ్లను నీటిపారుదల శాఖ అధికారులు ఖరారు చేసిన మరుక్షణమే తాజా వివాదం రగులుకుంది.
- పోలవరం టెండర్ల చుట్టూ అలుముకున్న వివాదంలో టిఆర్ఎస్ చిక్కుకుంది.
- పోలవరం టెండర్లు దక్కించుకున్న కన్సార్టియంలో కీలకభాగస్వామి అయిన స్యూ (ఎస్ఇడబ్ల్యు) కంపెనీలో నమస్తేతెలంగాణా పత్రిక సిఎండి వాటాదారు సిఎల్రాజంకు వాటా ఉందని ఆరోపణలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని ఒకవైపు చెబుతూనే మరోవైపు పనులు ఎలా చేపడతారని తెలుగుదేశం పార్టీ విమర్శించింది.
- 40 రోజులకు పైగా సాగిన సకల జనుల సమ్మె నేపధ్యంలో ఆత్మరక్షణ ధోరణిలో ఉన్న టిడిపికి ఈ టెండర్ల వ్యవహారం వరంగా లభించింది. టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ను, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ నేతలు విమర్శల వర్షం కురిపించారు.
- 'సమ్మె ముగిసింది ... పోలవరం కదిలింది' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అక్రమాలు, అవకతవకల కారణంగానే పోలవరం టెండర్లు స్యూ కన్సార్టియంకు దక్కాయని ఈ ప్రక్రియలో కెసిఆర్తో పాటు ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్రెడ్డి ప్రత్యక్ష ప్రమేయం ఉందని దేశం ఆరోపించింది. అక్రమాలకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని, బహిరంగ చర్చకు రావాలని టిఆర్ఎస్కు సవాల్చేసింది.
- అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో టిఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అయింది. పోలవరం టెండర్లను రద్దు చేయాలంటూ ఆ పార్టీ అధినేత కెసిఆర్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
- ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం సైతం పోలవరం టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని హడావిడిగా ప్రకటించారు. అయితే, ఇది పాక్షిక సత్యమే! నిజానికి పోలవరం టెండర్ల ఖరారు ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి.
- నిబంధనలను అధికారులు బాహాటంగానే ఉల్లంఘించారు. ఒక దశలో పక్కన పెట్టాలని భావించిన కన్సార్టియంకే చివరికి పనులు దక్కడం వెనుక ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.
- భారీ కంపెనీలు టెండర్ల జోలికి రాకుండానే ఒక వ్యూహం ప్రకారం అడ్డుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి.
ఇవీ ఆరోపణలు ...

ఏం జరిగింది ...?
ఈ నేపథ్యంలో స్యూ కన్సార్టియంకే పోలవరం టెండర్లు ఖరారు కావడం పెద్ద దుమారాన్నే రేపింది. స్యూ కంపెనీలో భాగస్వామే నమస్తే తెలంగాణా పత్రిక సిఎండి కావడం దీనికి ఆజ్యం పోసింది. టిఆర్ఎస్ దీనిని ఎలా సమర్ధించుకుంటుందంటూ టిడిపి విమర్శల వర్షం కురిపించింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర లక్ష్యంగా జరుగుతున్న సకలజనుల సమ్మెను దశల వారీగా విరమిస్తున్న సమయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనను టిడిపి ఆయుధంగా మలచుకుంది. ముఖ్యమంత్రికి, కెసిఆర్కు మధ్య కుదిరిన లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే టెండర్లను ఆయన బినామీకి అప్పగించారని టిడిపి ఆరోపించింది. టెండర్ల ఖరారుకు కొద్దిరోజుల ముందు నమస్తే తెలంగాణా సిఎండి, స్యూ కన్సార్టియంలో వాటాదారు అయిన ఎల్.రాజం ముఖ్యమంత్రిని కలిశారని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. స్యూ కంపెనీ నుండి పరోక్ష పద్ధ్దతుల్లో నమస్తే తెలంగాణా పత్రికకు నిధులు అందుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. టిడిపి విమర్శలకు టిఆర్ఎస్ నేతలు సైతం తమదైన శైలిలో జవాబు చెప్పారు. పోలవరంపై టిడిపి వైఖరి చెప్పాలని వారు నిలదీశారు. ఈ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం ఇబ్బంది పెట్టాయి.
పోలవరం టెండర్ల ఖరారు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్రెడ్డి ప్రకటించారు. ఢిల్లీ పర్యటనను ఈ ప్రకటనకు ఆయన వేదికగా చేసుకున్నారు. ఆర్థిక బిడ్ల ఖరారు తరువాత మంత్రి నేతృత్వంలోని కమిటీ దీనికి అంగీకారం తెలపాల్సి ఉంది. చివరగా ముఖ్యమంత్రి ఆమోదముద్ర పడిన తరువాత ఎల్1గా నిలిచిన కన్సార్టియంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఆర్థికబిడ్ల ఖరారు తరువాత మిగిలిన తతంగమంతా లాంఛనమేనని అధికారులు చెబుతున్నారు. కేంద్రం కొత్తగా రూపొందించిన భూసేకరణ ముసాయిదా ఇంకా ఒక కొలిక్కి రాకుండానే ఇంత హడావిడిగా టెండర్లు ఆమోదించాల్సిన అవసరం ఏమిటో ఏలికలే సెలవివ్వాలి.
ప్రత్యామ్నాయాలే మేలు ...
ఈ వివాదం సంగతి ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించడమే అన్ని విధాల శ్రేయస్కరం. ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఇవి చేరి ఉన్నాయి. అవి కూడా నీటిపారుదల రంగంలో నిష్ణాతులైన నిపుణులు తయారుచేసినవే! సిపిఎం కూడా ఒక ప్రత్యామ్నాయ డిజైన్ను సూచించింది. దాన్ని పాటించినా ప్రభుత్వం చెబుతున్న లక్ష్యాలకు ఏమాత్రం విఘాతం కలగకుండానే అటవీ ప్రాంతాల ముంపును చాలావరకు నివారించవచ్చు. దీనివల్ల విశాఖకు తాగు, సాగునీరు కూడా అందించవచ్చు. లక్షలాదిమంది గిరిజనులను అడవి తల్లినుండి దూరం చేయాల్సిన ఇబ్బందీ తప్పుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దిశలో ఆలోచిస్తుందని ఆశిద్ధాం.
No comments:
Post a Comment