తెలంగాణా పేరిట నాటి నిజాం రాజు నిరంకుశత్వాన్ని ఈనాటి కార్పొరేట్ రాజకీయాన్ని కూడా సమర్థించడం ద్వారా టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు గతాన్ని వర్తమానాన్ని కూడా గందరగోళ పరచేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నాడు ఆయన పోలవరం టెండర్లపై పత్రికాగోష్టిలో చేసిన వ్యాఖ్యలు, అదే రోజు సాయింత్రం ఒక పుస్తకావిష్కరణ సభలో వెలిబుచ్చిన భావాలు ఆ దిశలోనే వున్నాయి.
తెలంగాణా సంసృతి, చరిత్రల గురించి పదే పదే ప్రస్తావించే కెసిఆర్ వంటి వారు ఆ చరిత్రను ఆజరామరం చేసిన వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని గౌరవించేవారైతే ఇలా జరిగేది కాదు. విగ్రహాల విషయం వచ్చినప్పుడు అయిలమ్మ, కొమరయ్యల పేర్లు స్మరించేవారు నిజంగా వారు ఎవరిపై ఎందుకు పోరాడారో తెలియనట్టు నిజాంను కీర్తిస్తున్నారని అనుకోలేము.
ఓ నిజాం పిశాచమా! కానరాడు
నిన్ను పోలిన రాేజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణా కోటి రతనాల వీణ అని దాశరథి నిజాం జైలు గోడలపై బొగ్గుతో రాశాడు! మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని నిప్పులు కక్కాడు.
చుట్టుపట్ట సూర్యాపేట
నట్టనడుమ నల్లగొండ
ఆవాల హైద్రాబాదు
తర్వాత గోలకొండ
గోలకొండ ఖిల్లా కింద -
నీ గోరి కొడతాం కొడకో
నైజాం సర్కరోడా!
ఆనాడు తెలంగాణా పోరాట యోధుడైన ప్రజాకవి యాదగిరి రాసిన గీతం ఆయన తుపాకి గుళ్లకు నేలకొరిగినా ఇప్పటికీ జనాన్ని వుర్రూతలూగిస్తుంది.
నీ గోరికాడకొచ్చి
నేను మొక్త కొడకో అని పాడుకోవలసిన పరిస్థితి కెసిఆర్కు ఎందుకు కలిగింది? నాలుగేళ్ల కిందట ఆయన నిజాం వర్ధంతికి హాజరై ప్రశంసలు కురిపించినపుడు నిజమూ నిజామూ పేరిట రాసిన వ్యాసంలో నేను అడిగిన ప్రశ్న
ఇది. దీన్నే తర్వాత ఆయనతో టీవీ చర్చలో పాల్గొన్నప్పుడూ లేవనెత్తాను. దీనిపై కెసిఆర్ ఎవరైనా పిలిచినప్పుడు వెళ్లడం, నాలుగు మంచి మాటలు చెప్పడం మర్యాద అన్నారు. వ్యక్తిగతంగా వెళ్లి మాట్లాడితే ఫర్వాలేదుగాని ఒక ే పార్టీ నాయకుడుగా నిజాం ఘనతను కీర్తించడం చరిత్రను తలకిందులు చేయడమేనని అంటే కాటన్ దొర ప్రసక్తి తీసుకొచ్చారు. ధవళేశ్వరం కట్టిన కాటన్ను విదేశీయుడైనా పూజిస్తుంటే నిజాం సాగర్ కట్టించిన నిజాంను ఎందుకు కీర్తించకూడదని ఎదురు ప్రశ్న వేశారు. దాన్నే శుక్రవారం సభలో ప్రస్తావించినట్టు మీడియాలో చూశాను.కాటన్ విదేశీ పాలకుల దగ్గర ఉద్యోగిగా వున్న సాంకేతిక నిపుణుడే తప్ప పాలకుడు కాదు.పైగా ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ ఆనకట్ట కోసం వొప్పించేందుకు అనేక అవస్థలు పడ్డాడు. దీనివల్ల కరువు తగ్గి జన నష్టం ఆగిపోతుందని, పన్నులు పనుల రూపంలో బ్రిటిష్ ఖజానాకు బోలెడు ఆదాయం వస్తుందని నచ్చచెప్పాడు. పంటలకు నీళ్లు అందించిన కాటన్ దొరను రైతులు అభిమానంగా కొలుచుకుంటారు తప్ప బ్రిటిష్ రాణిని పూజించరని చెప్పాను.
నిజాం వ్యవహారం ఇందుకు పూర్తి భిన్నం. సర్పెఖాస్ పేరిట ఆయన లెక్కలేనంత స్వంత భూమిని కలిగివుండటమే గాక రైతులను అనేక విధాల పీడించి వెట్టి చేయించాడు, దేశ్ముఖుల పెత్తనానికి ప్రజలను బలిచేసి మధ్యయుగాల నాటి బానిసత్వంలో మగ్గిపోవడానికి కారకుడైనాడు. బ్రిటిష్ వారికి తొత్తుగా మారి తెలుగు నేలను అంచలంచెలుగా ధారదత్తం చేస్తూ ప్రజలను విడదీశాడు. ఆఖరి వరకూ తన ఏలుబడిలోనే వున్న హైదరాబాద్ సంస్థాన భాగంలో ప్రజాస్వామ్య పవనాలు ఏ మాత్రం చొరనీకుండా అన్ని విధాల నిరంకుశత్వం సాగించాడు.భాషా పరమైన మతపరమైన ఆధిపత్యంతో పాటు గ్రంథాలయాల ఏర్పాటు, పత్రికా నిర్వహణ వగైరాలపై కూడా ఆంక్షలు పెట్టి వేధించాడు. కమ్యూనిస్టుల నాయకత్వంలో తిరుగుబాటు చేసిన ప్రజలపై రజాకార్లను పురికొల్పి మారణహౌమం సాగించాడు. సైన్యాలను ఎగదోలాడు. స్వాతంత్రానంతరం కూడా దేశంలో కలవకపోగా స్వతంత్రం నిలబెట్టుకోవడానికి విదేశాలతో కలసి కుట్రలు పన్నాడు. పాకిస్తాన్కు దూతలను పంపించాడు.ఐక్యరాజ్యసమితిలోనూ ఫిర్యాదు చేశాడు. ఇవన్నీ సాగక నెహ్రూ ప్రభుత్వంతో చేతులు కలిపి కమ్యూనిస్టులపై నరమేధం సాగించేందుకు సహకరించాడు.ఇదంతా చరిత్ర. ఈ చరిత్రను మార్చింది వీర తెలంగాణా ప్రజానీకమైతే వారికి నాయకత్వం వహించి నడిపింది కమ్యూనిస్టులు, ఆంధ్ర మహాసభ.ప్రపంచ చరిత్రలోనే అదొక మహౌజ్వల పోరాటం.
నిజాం హైదరాబాదులో భవనాలు కట్టించాడని గొప్పగా చెప్పడంలో అర్థం లేదు. అందులో కొన్ని మాత్రమే ప్రజల కోసం కట్టించినవి. అత్యధిక భాగం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాక వినియోగిస్తున్నవి. ఈ వాదన ప్రకారమైతే పార్లమెంటు భవనం, రాష్ట్రపతి భవనం కట్టించినందుకు బ్రిటిష్ వారికి మోకరిల్లాల్సి వుంటుంది! నిజాం ప్రాజెక్టులు కట్టించింది చాలా నామమాత్రం. ఆయన అనుభవించిన దాచి వుంచిన సంపదతో పోలిస్తే అది సముద్రంలో నీటిబొట్టు మాత్రమే. ప్రజల నుంచి కొల్లగొట్టిందానికి లెక్క లేదు. వారి రక్తమాంసాలు పీల్చిన వెట్టిచాకిరికి అసలే విలువ లేదు.ఆఖరుకు నాటి తెలంగాణా తల్లుల మాన ప్రాణాలకు కూడా విలువ లేని రాక్షస రాజ్యమది. సంసృతి పేరిట బతకమ్మ పండుగలు చేసే వారు బతుకులనే చిదిమేసిన రాక్షస రాజ్యానికి భజన కీర్తనలు పాడుతున్నారంటే అది కరుడుకట్టిన భూస్వామ్య భావజాలాన్ని ప్రతిబింబిస్తుంది తప్ప తెలంగాణా పోరాట స్పూర్తిని కాదు. కెసిఆర్ ప్రస్తావించిన నాటి చర్చను చెప్పాలంటే నాతోపాటు పాల్గొన్న నాగేశ్వర్ జోక్యం చేసుకున్న మీదట కెసిఆర్ నిజాంలో ప్లస్ల కన్నా మైనస్లే ఎక్కువన్న ఒప్పుకోలుతో ముగించారు.
నిజాంను కూల్చివేసిన తర్వాత ఆయన హయాంలో ముక్కచెక్కలైన తెలుగు కన్నడ మరాఠీ ప్రజలు భాషా ప్రాతిపదికన కలసిపోవడం సహజంగా జరిగిపోయింది. పునర్విభజనపై ఏర్పడిన ఫజలాలీ కమిషన్ కూడా 1962 వరకూ చూసి తర్వాత సమైక్య రాష్ట్రం ఏర్పరచవచ్చునని చెప్పిందే తప్ప వ్యతిరేకించలేదు. పైగా ఈ విషయమై తెలంగాణా ప్రాంతంలో స్పష్టత లేదని కూడా వ్యాఖ్యానించింది తప్ప వ్యతిరేకత వుందని చెప్పలేదు. ఐచ్చికంగా చట్టసభల చర్చల ద్వారా జరిగిన ఈ పరిణామం వెనక తెలంగాణా యోధుల బలీయమైన మద్దతువుంది. నిజామాంధ్ర మహాసభల చిరకాల స్వప్నం వుంది. మామ కెవిరంగారెడ్డి, అల్లుడు మర్రి చెన్నారెడ్డి వంటి కొద్ది మందిని మినహాయిస్తే నాటి హైదరాబాదు శాసనసభ చర్చలో ఎక్కువ మంది విశాలాంధ్ర ఏర్పాటును స్వాగతించారు. పైగా అప్పుడు తెలంగాణా ప్రాంతం నుంచి కమ్యూనిస్టులే అధికంగా ఎన్నికై వున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా వుండాలన్న కాంక్ష భూస్వామ్య శక్తుల కోర్కె అని సభలో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కూడా వ్యాఖ్యానించారు. కనక చట్టసభ చర్చ ద్వారా జరిగిన ఈ నిర్ణయాన్ని విద్రోహం కాజాలదు.
తర్వాత కూడా కాంగ్రెస్ నాయకత్వంలో రెండు సార్లు రెండు ప్రాంతాల్లో విభజన ఉద్యమాలు వచ్చి విఫలమైనాయి. వాటి నాయకులంతా పదవుల్లో కుదురుకోగా ప్రజలే నష్టపోయారు.ఇప్పుడు కూడా ప్రధాన పార్టీల నాయకులు దశలవారీగా గొంతులు మారుస్తున్న తీరు చూస్తూనే వున్నాం.ఏదైనా ద్రోహం అంటూ జరిగితే ఇలాటి స్వార్థ రాజకీయాల వల్ల తప్ప నవంబరు 1న రాష్ట్ర ఏర్పాటును ద్రోహం అనడం అర్థరహితం. రేపు కేంద్రం ఏ నిర్ణయం ప్రకటించినా (అసలంటూ ప్రకటిస్తే) అది లెక్కల్లో వెనకటికి వర్తింపు(రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్)లాగా 1956 నవంబరు 1 ని ద్రోహంగా మార్చేస్తుందా?
పోలవరం టెండర్ల విషయానికి వస్తే టిఆర్ఎస్ అధినేతకు సన్నిహితుడైన, నమస్తే తెలంగాణా పత్రికలో కీలకమైన వ్యక్తికి అందులో భాగం వున్న మాట కాదనడం లేదు. ఎంత వాటా అన్న దానిపైనే అభ్యంతరాలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే నివారణీయ నష్టాలను గురించి సిపిఎం మొదటి నుంచి చెబుతున్నది. వివిధ కోణాల నుంచి టిఆర్ఎస్ ఇతర సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. తాము వ్యతిరేకించే ప్రాజెక్టు టెండర్లలో తమకు సన్నిహితమైన వ్యక్తి వుండటాన్ని ఎంత సమర్థించుకున్నా అది సమర్థనగానే వుంటుంది. అలాగే తాము రాజకీయ లక్ష్యంగా చేసుకున్న తెలుగుదేశం వారికి ఇందులో 97 శాతం వాటాలున్నాయని చెప్పడం కూడా రాజకీయంగా పొసిగేది కాదు. దీన్ని ప్రాంతంపై ఉద్యమంపై దాడిగా చిత్రించడం అసలే అసంగతం. ఎవరు ఏ ప్రాంతం ఏ పార్టీ పక్కన పెడితే అన్ని చోట్లా కార్పొరేట్ శక్తులే చక్రం తిప్పుతున్నాయని ఈ ఉదంతం మరో సారి నిరూపిస్తోంది.జరగాల్సింది తక్షణమే ఆ టెండర్లు రద్దు చేయడం. పోలవరంపై అందరితో చర్చించి నష్ట రహితమైన నమూనాను రూపకల్పన చేయడం. ఆ దిశలో ఆలోచించే బదులు పరస్పర దూషణలతో కాలం గడపడం కాంగ్రెస్ ప్రభుత్వానికే మేలు చేస్తుంది.
మొత్తంపైన తెలంగాణా లేదా మరే ప్రాంతం పేరు చెప్పినా దానికదే విప్లవాత్మక విధానమై పోదు.ఆ పేరిట గతాన్ని తప్పుగా చూపించడం, వర్తమానాన్ని వక్రంగా వ్యాఖ్యానించడం హక్కుగా సంక్రమించదు. నిజాం రాజు కాలపు ఫ్యూడల్ దోపిడీ అయినా కార్పొరేట్ యుగపు కాంట్రాక్టు దోపిడీ అయినా రకరకాల విద్రోహాలు వెన్నాడుతుంటాయి. అందువల్ల ప్రజలెప్పుడూ అప్రమత్తంగా వుండాల్సిందే.
No comments:
Post a Comment