Sep 18, 2011

దొంగలముఠా ప్రేక్షకులు...ఠా !

  • చిత్ర సమీక్ష
తలుపు చాటు నుండి 'భూ..!' అంటూ చిన్న పిల్లలు ఆడే ఆట మనకు తెలుసు. అలా భయపెట్టడం తనకెంతో యిష్టమని'నా ఇష్టం'లో దర్శకుడు రాంగోపాల్‌వర్మ రాసుకున్నాడు. ఆ చిన్నప్పటి చేష్టలు ఇంకా కొనసాగుతున్నాయనటానికి 'దొంగలముఠా' ఓ చక్కని ఉదాహరణ. కిడ్నాప్‌ స్టోరీకి సస్పెన్స్‌ జోడించి, భయాన్ని పులిమి రూపుదిద్దుకున్న పక్కా సి-గ్రేడ్‌ సినిమా 'దొంగలముఠా'. రన్నింగ్‌ అండ్‌ ఛేజింగ్‌ అనేక సినిమాల్లో చూపించినా, వర్మ ఇంకా దాన్నే పట్టుకు వేలాడుతున్నాడు. 5-డి కెనాన్‌ హ్యాండీ కెమెరా అయినా, స్టిల్‌ కెమెరా అయినా, సెల్‌ కామ్‌ అయినా...తీసే దాంట్లో విషయం ఉండాలి. అదేదీ లేకుండా ఓ దాగుడుమూతల ఆటను చూపించాడు. ఎంచుకున్న కిడ్నాప్‌ స్టోరీ తెలుగు ప్రేక్షకుడికి కొత్తేమీ కాదు. చెప్పిన డైలాగే చెప్పి, నటీనటుల్ని అటూ ఇటూ తిప్పి, నడిపిస్తూ, పరిగెత్తిస్తూ గంటన్నర సినిమా తీశాడు. దీన్ని చూడటానికే వచ్చామా అని తలపట్టుకోవటం ప్రేక్షకుడి వంతవుతుంది. తక్కువ బడ్జెట్‌లో, తక్కువ సమయంలో సినిమా తీయడమనేది ఓ టెక్నికల్‌ ఎచీవ్‌మెంట్‌ మాత్రమే. కానీ ఇక్కడ సామాన్య ప్రేక్షకుడు లాస్‌ అయ్యాడు.
ఇదీ కథ : సుధీర్‌ (రవితేజ), రాణి (చార్మి) ఇద్దరూ భార్యాభర్తలు. ఓ రోజు కారులో ఫంక్షన్‌కు బయలుదేరుతారు. దారిమధ్యలో కారు చెడిపోతుంది. దగ్గర్లో ఓ రిసార్ట్‌ కనబడితే మెకానిక్‌ దొరుకుతాడేమోనని అక్కడికి వెళ్తారు. ఆ రిసార్ట్‌లో ఓ రూమ్‌ బుక్‌ చేసుకుంటారు. హోటల్‌లో ఎవరో ఒకరిది కారు తీసుకొని మెకానిక్‌ను తీసుకురావలన్నది సుధీర్‌ ఆలోచన. కానీ ఆ రిసార్ట్‌లో సుధీర్‌, రాణి చిక్కుకుంటారు. అసలు ఆ రిసార్ట్‌లో ఎవరూ ఉండటం లేదని, అది పాడుపడ్డ ఓ బంగ్లా అని తర్వాత తెలుసుకుంటారు. ఆ రిసార్ట్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదకరమైన వాళ్లని అర్థమవుతుంది. కానీ ఇంతలోనే సుధీర్‌, రాణీని ఆ ముగ్గురూ బంధిస్తారు. మరి వీరు ఎలా బయటపడ్డారు ? వీరిని బంధించిన ముగ్గురు ఎవరు ? అనేది మిగతా కథాంశం.
'ఆరు లక్షలతో తీసినా, ఆరు కోట్లతో తీసినా సినిమా అనే మాధ్యమంలో చూపించా ల్సింది సృజనాత్మకత. అది లేకుంటే ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం ఉండదు' అని 'దొంగలముఠా' సినిమా ప్రారంభించే ముందు వర్మ చెప్పుకొచ్చాడు. దానికి పూర్తి భిన్నంగా తీశాడు.
దర్శకనిర్మాతలు ఆరు లక్షలతో తీసినా, 60 కోట్లతో తీసినా ప్రేక్షకుడు రూ.50 లేదా రూ.40 లేదా రూ.30 టికెట్‌ ధరలతో సినిమా చూడాల్సిందే. టెకెట్‌ కొని, సమయాన్ని కేటాయిస్తాడు. ప్రేక్షకుడు పెట్టిన డబ్బుకు న్యాయం చేకూరేలా వినోదమే, విజ్ఞానమో ఉండాలి. అదేదీ లేకుండా 'నా ఇష్టం'అనేదానికి 'దొంగల ముఠా' పరాకాష్ట.
ఇన్ని రోజుల్లో, ఇంతమందితో, ఇన్ని లక్షలతో తీశామన్నది పాయింట్‌ కాదు. అంతిమంగా థియేటర్‌లో ప్రేక్షకుడ్ని అలరించామా ! లేదా ! అన్నదే పాయింట్‌. మరి ఆ పాయింట్‌ లేకుండా తలాతోకలేని దాగుడుమూతల ఆటను గంటన్నరపాటు సాగదీసి చూపించటంతో తలబాదుకోవటం ప్రేక్షకుడి వంతవుతుంది. ఇది నిజంగానే ప్రేక్షకుల జేబులు కొల్లగొట్టింది. నీలేష్‌ గిర్‌కర్‌ అందించిన ఈ కిడ్నాప్‌ స్టోరీలో పెద్దగా విశేషమేమీ లేదు. సాదాసీదా దాగుడుమూతల ఆట. నటుల విషయానికొస్తే...హీరోయిజానికి దూరంగా రవితేజ చేసింది బాగుంది. సుప్రీత్‌, సుబ్బరాజు, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, చార్మి...తమ పరధి మేరకు నటించారు. 5 రోజుల్లో ఎనిమిది మంది (నలుగురు దొంగలు, చార్మి, రవితేజ, మంచు లక్ష్మీ ప్రసన్న, సునిల్‌) తారాగణంతో, కేవలం ఆరున్నరలక్షల రూపాయల ఖర్చుతో వర్మ తీసిన సినిమా ఎలా ఉంటుంది ? అన్న ఆసక్తితో ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. వచ్చాక కానీ తెలియదు. ఇదో టైం వేస్ట్‌ వ్యవహారమని. ఎంటర్‌టైన్‌మెంట్‌, కామెడీ, యాక్షన్‌, సాంగ్స్‌...అంటూ ఏవీ లేకుండా, తక్కువ బడ్జెట్‌లో కథ చూపిస్తానని వర్మ చేసిన ప్రయోగం అఘోరించినట్టే ఉంది.

No comments: