
తెలుగువారి జీవన విధానాన్ని, అందులోని మాధుర్యాన్ని, చక్కలిగింతలు పెట్టే విమర్శనాత్మక శైలిని చూపిన అరుదైన రచయిత ముళ్లపూడి వెంకటరమణ. సినిమారంగంలోనూ కథా రచయితగా తనదైన ముద్రను పాదుకొల్పారు. వివిధ ప్రక్రియల్లో కథావిష్కరణ చేశారు. వ్యంగ్య రచనల్లో చేయి తిరిగిన వాడు. ప్రాణ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు బాపుతో కలిసి ఎన్నో కథనాలకు దృశ్యరూపం ఇచ్చారు. అనేక సినిమాలూ తెరకెక్కాయి. తెలుగు తెరపై హీరోకు ఉన్న ఇమేజ్ను వీరు సంపాదించారంటే అతిశయోక్తి కాదు. ఈయన రాసిన 'బుడుగు- చిచ్చరపిడుగు' అశేష తెలుగు పాఠకలోకాన్ని అలరించింది.
ముళ్లపూడి వెంకటరమణ 1931, జూన్ 28న ధవళేశ్వరంలో జన్మించారు. ఆయన అసలు పేరు ముళ్లపూడి వెంకట్రావ్. తల్లిదండ్రులు సింహాచలం, ఆదిలక్ష్మి. వీరి పూర్వీకులు బరంపురంకు చెందినవారు. వెంకటరమణ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. పేదరికం వల్ల ఎన్నో కష్టనష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. అనంతరం వీరి కుటుంబం మద్రాసు చేరుకుంది. అక్కాబావల వద్ద రాజమండ్రి వీరేశలింగం హైస్కూల్లో ప్రాథమిక విద్య చదువుకున్నారు. అనంతరం, యస్.యస్.సి, ఆనర్స్ మద్రాస్ కేసరి హైస్కూల్లోనూ చదివారు. ఇక్కడే బాపు పరిచయమయ్యాడు. చిన్నతనం నుంచీ చదువులో ప్రతిభ గల విద్యార్థిగా గుర్తింపు పొందాడు. పద్యాలు అల్లటం, నాటకాలు రాయటం చేసేవాడు. ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆగిపోవటంతో చిన్న చిన్న ఉద్యోగాలెన్నే చేశారు. ఆంధ్రపత్రికలో సబ్ఎడిటర్గా పనిచేశారు. అప్పుడు ఆయన రాసిన 'బుడుగు' విశేష ప్రాచుర్యాన్ని పొందింది.
1945లో 'బాల' అనే పత్రికలో 'అమ్మ మాట వినకపోతే' అనే మొదటి కథ అచ్చయింది. 'ఉదయభాను' అనే పత్రిక మొదలుపెట్టి దానికి ఎడిటర్ అయ్యాడు. రమణరాసిన వ్యాసాలకు, కథలకు బాపు చిత్రకారుడు. బాపు దర్శకత్వంలో, బాలకృష్ణ హీరోగా వస్తున్న 'శ్రీరామరాజ్యం' చిత్రానికి ఆయన కథారచయిత. ఇదే ఆయన చివరి చిత్రం.
1962లో 'రక్తసంబంధం' ద్వారా సినిమా వైపు అడుగేసిన వెంకటరమణ, 1967లో 'సాక్షి' అనే సినిమాను నిర్మించారు. అందాలరాముడు, ముత్యాలముగ్గు, మిస్టర్ పెళ్లాం సినిమాలకు ఉత్తమ సంభాషణల రచయితగా రాష్ట్రప్రభుత్వం నుంచీ నంది అవార్డునందుకున్నారు. 1987లో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. 1992లో తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆయన్ని డాక్టరేట్తో గౌరవించింది. ఆయన రాసిన 'సీతాకళ్యాణం' సినిమాను లండన్ ఫిలిం ఇనిస్టిట్యూట్లో పాఠ్యగ్రంథంగా తీసుకున్నారు. నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడి పిల్లల కోసం బాపు-రమణలతో వీడియో పాఠాలు రూపొందించారు. 'కొతి-కొమ్మొచ్చి' అనే పేరుతో తన ఆత్మకథ పుస్తకరూపంలో, వీడియో రూపంలో ఇటీవల విడుదల చేశారు.

సాహితీరంగంలో ఆయన రచనలు సీరియల్గా ప్రచురితమయ్యాయి. ఆంధ్రపత్రికలో సీరియల్గా ప్రచురితమైన 'బుడుగు-చిచ్చర పిడుగు' అందరినీ ఆకట్టుకుంది. సినీరంగానికి సంబంధించి లోటుపాట్లను తెలియచెప్పే సినీరమణీయం-1 ,సినీరమణీయం-2 (ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరావును ముచ్చట గొలిపే ఆడపిల్లగా చూడాలనుకుంటే ఈ పుస్తకాన్ని చదవాల్సిందే) ఎన్నో విషయాలను విశ్లేషించింది. 41 కథలతో కూర్చిన రమణీయం-1, 45 కథలతో రమణీయం-2 విశేష ఆదరణ పొందాయి. చక్కిలిగింతలు పెట్టే ఆహ్లాదమైన హాస్యానికి చిరునామా బాపు-రమణలు.
వారి జీవితం పూలపాన్పుకాదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎదురొడ్డి నిలిచారు. 'కోతి కొమ్మచ్చి-మొదటిభాగం, కోతికొమ్మచ్చి- రెండవభాగం' అనే పేరుతో తన ఆత్మకథను అత్యంత రసవత్తరంగా చూపారు. 1873లో జ్యూస్వెర్న్ రచనను తెలుగులో '80 రోజుల్లో భూప్రదక్షణం'గా అనువదించారు. రెండవ ప్రపంచ యుధ్దానికి సంబంధించిన యధార్దగాధతో రచించిన 'పిటి 109' కథలను తెలుగులో తీసుకొచ్చారు. ఈయన రాసిన 'మేలుకొలుపులు' అపూర్వమైనదిగా సాహితీ విమర్శకులు భావిస్తారు. ముళ్లపూడి రచలన్నింటికీ బాపు తనదైన శైలిలో బొమ్మలు గీశారు.
సలహాదారుణ్ని కోల్పోయా : అక్కినేని
గొప్ప స్నేహితుడ్ని, సలహాదారుడ్ని కోల్పోయాను. ఆంధ్రపత్రికలో జర్నలిస్టుగా ఉన్నప్పుడు నాపై రమణగారు విమర్శనాత్మక వ్యాసం రాశారు. దాన్ని చదివాను. కరెక్టే అనిపించింది. ఆ విమర్శే ఆ తర్వాత మంచికి దోహదపడింది. ఆరోగ్యకరమైన విమర్శకుడు. ఆ తర్వాత ఆయనతో పరిచయం 'అందాలరాముడు' నుంచి ఎన్నో సినిమాలతో ప్రయాణం సాగింది.
ఎన్ని కమర్షియల్ చిత్రాలకు పనిచేశామని కాకుండా, ఎంత నీతి ఇవ్వగలిగామనేది ఆయన పనితనంలో కన్పిస్తుంది. 'శ్రీరామరాజ్యం'లో వాల్మీకి పాత్ర సృష్టించారు. దానికోసం కథ చెప్పడానికి వచ్చారు. అప్పుడు ఆయన్ని చూస్తే బాధేసింది. నడవలేని పరిస్థితిల్లో కూడా పట్టుదలగా నా దగ్గరికి వచ్చారు. కానీ ఆరోగ్యం ఇంత విషమంగా ఉందని తెలీదు. నాకు వచ్చిన అవార్డులు ఏవైనా సరై బదిలీచేయడానికి అవకాశముంటే ఆయకు ఇస్తాను. ఎన్నో పురస్కారాలు రావాల్సింది.
కుటుంబ సభ్యుడు : మాడా వెంకటేశ్వరరావు
'సుడిగుండాలు' నా మొదటి సినిమా. ఆయన రచించిన 'అందాలరాముడు'తో పునర్ జన్మనిచ్చారు. 'ముత్యాలముగ్గు'లో రావుగోపాలరావు పాత్రను తీర్చిన విధానం అద్భుతం. ఆ రోజుల్లో రమణగారు రాసిన సంభాషణలే క్యాసెట్ రూపంలో, రావుగోపాలరావు గొంతు తోడై రికార్డ్ సృష్టించాయి. రచయితగానే కాకుండా కుటుంబ సభ్యుడిగా మాతో ఉండేవారు. నటుడిగా ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి నన్ను తీర్చిదిద్దారు. ఆయన లేరన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాను.
తెలుగుబాషకు మరువలేని సేవ: పరుచూరి గోపాలకృష్ణ
ముళ్ళపూడివారి మహాభినిష్క్రమణం హాస్యానికి వీడ్కోలు పలికింది. సినీ చరిత్రలో బాపు-రమణ గొప్ప ద్వయం. ఇన్నాళ్ళు వారు కలిసి ఉండటం అంతకన్నా గొప్ప విషయం. తెలుగుబాషకు ఎంతో సేవ చేశారు. వాటిని మర్చిపోలేం. వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను.
రచయితలకు స్ఫూర్తి 9: తనికెళ్ళ భరణి
రచయిత కావాలనుకునే నాలాంటి వారికి స్ఫూర్తి. హాస్యాన్ని విమర్శనాత్మకంగా, వ్యంగ్యంగా చెప్పడంలో అందవేసిన చేయి. విశిష్టశైలి. పరోక్షంగా వారి నుంచి స్ఫూర్తి పొందాను. 'కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్'లో నా వంతు కామెడీ రావడానికి ఆయనే స్ఫూర్తి. ఆయన సంభాషణలో కామెడీ బాగుంటుంది. ఆయన రచనాశైలి ఎవ్వరికీ రాదు. ఆయనలేని లోటు తీర్చలేనిది.
బాధాకరం : ఎస్.జానకి
ఇటీవలే చెన్నైలో కలిశాను. ఆయనతో మాట్లాడాను. అంతలోనే ఇలా జరగడం చాలా బాధ కల్గించింది. తెలుగు సినిమాకు, తెలుగు రచనకు ఎనలేని సేవ చేశారు. వారి భార్య, పిల్లలకు సానుభూతిని తెలియజేస్తున్నాను.
స్నేహానికి నిర్వచనం: మోహన్బాబు
స్నేహానికి నిజమైన నిర్వచనం బాపు, రమణలు. స్నేహం అంటే ఏమిటో పుస్తకాల్లో మాత్రమే మనం చదువుకునేవాళ్ళం. కానీ ఈ భూమ్మీద వారిద్దరూ స్నేహానికి నిలువెత్తు ఉదాహరణ. వారిలో ఒకరైన రమణగారు మనమధ్య లేకపోవడం తీరని లోటు. వారి స్వంత బ్యానర్లో 'గోరంతదీపం'లో నటించాను. ఆరు నెలల క్రితం కూడా ఓ కథ గురించి నాకు చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను.
ఆయనతో నాకు 50 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయనతో కలిసి పనిచేసిన రోజులు మరువలేనివి. చాలా కాలం తరువాత 'శ్రీరామరాజ్యం' కోసం మళ్ళీ పనిచేస్తుండటం చాలా సంతోషాన్నిచ్చింది. అయితే అదే చివరి చిత్రమవుతుందని ఊహించలేదు. మంచి మాటల రచయితను కోల్పోయాం. తెలుగు సినిమాకు ఆయన లేని లోటు పూడ్చలేనిది
No comments:
Post a Comment