
- లాకర్లలో 14 కిలోల బంగారం
- సాయంకాలం దాకా లెక్కించినా తరగని నగదు
- ఓఎంసి అక్రమాలపై సిబిఐ విచారణ ముమ్మరం
- బళ్లారిలోని బ్యాంకు ఖాతాలను పరిశీలించిన సిబిఐ
- అనంతలో రాజగోపాల్ సమీప బంధువుల ఇళ్లలో సోదాలు
ఓబుళాపురం మైనింగు కార్పొరేషన్ మేనేజింగు డైరెక్టరు ఎంవి.శ్రీనివాసరెడ్డి బ్యాంకు లాకర్ల నిండా కోట్లకొలదీ డబ్బు, కేజీల కొద్దీ బంగారం బయటపడుతోంది. సొంత పేర్లతోనూ, బినామీ పేర్లతోనూ వున్న బ్యాంకు ఖాతాలు, లాకర్లలో వెలుగుచూస్తున్న సంపద సిబిఐ అధికారులనే విస్మయానికి గురిచేస్తోంది. ఇనుప గనుల అక్రమాలపై విచారణ చేపట్టిన సిబిఐ సెప్టెంబరు ఐదున గాలి జనార్థన్రెడ్డి మేనల్లుడు, ఓఎంసి మేనేజింగు డైరెక్టరు శ్రీనివాసరెడ్డిని కూడా అరెస్టు చేసిన విషయం తెలుసు. సిబిఐ శనివారం ఆయన్ను హైదరాబాదు నుంచి బళ్లారికి తీసుకొచ్చింది. ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టింది. బళ్లారి పట్టణంలోని వివిధ బ్యాంకుల్లో శ్రీనివాసరెడ్డికున్న ఖాతాలు, లాకర్ల గురించి ఆరా తీసింది. యాక్సిస్ బ్యాంకులో ఎక్కువ ఖాతాలున్నట్టు తెలియడంతో శ్రీనివాసరెడ్డిని వెంటతీసుకొని మరీ పోలీసు అధికారులు బ్యాంకు ఖాతాలనూ, లాకర్లనూ పరిశీలించారు. ఎనిమిది లాకర్లను గుర్తించారు. వాటిని తెరిచి సంపదను లెక్కించే పనిలోపడ్డారు. ఉదయం పది గంటల నుండీ రాత్రి పొద్దుపోయే దాకా విరామం లేకుండా లెక్కిస్తూనే ఉన్నారు. ఇప్పటికి నాలుగు లాకర్లను మాత్రమే తనిఖీ చేయగలిగారు. కొన్ని లాకర్లు తెరచుకోకపోవడంతో నిపుణుల చేత తెరిపించాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో కొన్ని విలువైన పత్రాలూ లభించినట్టు సమాచారం. బినామీ పేర్లతో ఖాతాలను తెరిచేందుకు బ్యాంకు మేనేజర్ సహాయంతో వ్యవహారం నడిపినట్లు తెలిసింది.
సదరు మేనేజరు ప్రస్తుతం బెంగళూర్లో విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. అక్రమ మైనింగ్ ద్వారా వచ్చిన నగదు లావాదేవీలకు ఈ ఖాతాలను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి వరకు అందిన సమాచారం మేరకు బళ్లారి బ్యాంకు లాకర్లలో 14 కిలోల బంగారం, 2.5 కోట్ల నగదు ఉన్నట్లు తెలిసింది.
ఇతర ప్రాంతాల్లోనూ సిబిఐ విచారణ
సిబిఐ బృందం ఆంధ్ర, కర్నాటక సరిహద్దుల్లో ఇనుప గనులకు ఆనుకునివున్న గ్రామాల్లో శనివారం పర్యటించింది. తుమ్మిటీ మైనింగు, హెఎం మైనింగు, ఎంబిటి మైనింగుల్లో సిబిఐ బృందం తనిఖీలు నిర్వహించింది. అదే విధంగా వీటికి ఆనుకుని చుట్టుపక్కలనున్న గ్రామాలు తుమ్మిటి, బసాపురం గ్రామాల్లోని ట్రాన్సుపోర్టు లారీడ్రైవర్లు, మిషన్ ఆపరేటర్లను, గనుల్లో పనిచేసిన వారిని గుర్తించి విచారించింది. ఇనుప ఖనిజాన్ని ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి తీసుకొచ్చే వారని ప్రశ్నించింది. మైనింగు జరిగిన ప్రాంతాన్ని, అంతరగంగమ్మ కొండ మైనింగులోని డంపింగు యార్డునూ పరిశీలించింది.
గాలి నిందితుడేగాని దోషికాదు : మాజీ మంత్రి శ్రీరాములు
జైల్లో ఉన్న గాలి జనార్థన్రెడ్డి ఇప్పటికీ నిందితుడేగాని, దోషి కాదని ఆయన సన్నిహితుడు, మాజీ మంత్రి శ్రీరాములు అన్నారు. శనివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు తనకు సిబిఐ నుండి ఎటువంటి నోటీసులు అందలేదన్నారు. సిబిఐ విచారణకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. రాజీనామా డ్రామా కాదని, తాను రాజీనామాకు కట్టుబడే ఉన్నానని చెప్పారు.
'అనంత'లో రాజగోపాల్ సమీప బంధువుల ఇళ్లలో సోదాలు
కీలక పత్రాలు స్వాధీనం
భూగర్భ గనుల శాఖ మాజీ ఎండి రాజగోపాల్ సమీప బంధువుల ఇళ్లలో అనంతపురంలో శనివారం సోదాలు జరిగాయి. నీరుగంటి వీధిలోని కృష్ణమూర్తి నివాసంలో మొదట సిబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నాలుగు లక్షల నగదు, రెండు కేజీల వెండి వస్తువులున్న సూట్కేసు లభించింది. ఇది ఎవరిదన్న దానిపై పోలీసులు విచారణ జరుపగా రాంనగర్లోని సాయిదత్త అపార్టుమెంటులో ఉంటున్న సూర్యప్రసాద్ అనే వ్యక్తివిగా తెలిసింది. రాజగోపాల్ బావమరిది రాజశేఖర్కు సూర్యప్రసాద్ స్వయాన సోదరుడు కావడం గమనార్హం. దీంతో పోలీసులు అక్కడికెళ్లి ఆయన నివాసంలోనూ తనిఖీలు నిర్వహించారు. ఇదే అపార్టుమెంటులోని పెంట్హౌసులో బావమరిది ఒకప్పటి ఓఎంసి డైరెక్టర్ రాజశేఖర్ డ్రైవరు షకీల్ బాషా ఉంటున్నారు. ఈ ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేశారు. అక్కడ 2005 ప్రాంతంలో అటవీభూములు మైనింగు లీజుకు సంబంధించిన జిరాక్స్ పత్రాలు, మరికొన్ని విలువైన డాక్యుమెంట్లు లభించినట్టు సమాచారం. శనివారం మధ్యాహ్నం నుంచి సిబిఐ అధికారులు అనంతపురం జిల్లాలోని డీ.హీరేహళ్ మండలంలోని ఎస్బిఐ బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. అయితే ఇందులో శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఖాతాలో పెద్దగా లావాదేవీలు లేనట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలో బ్యాంకు ప్రారంభోత్సవ సమయంలో మాత్రం లక్ష రూపాయల వరకు డిపాజిట్ ఉండింది. అదే ఇప్పటికీ ఉన్నట్టు సమాచారం. సూర్యప్రసాద్, షకీల్బాషా, కృష్ణమూర్తి భార్య పోలీసుల అదుపులో ఉన్నారు.
డబ్బుతో పట్టుబడిన నిందితులు పోలీసు కస్టడీ
లారీలో డబ్బు తరలిస్తూ గురువారం పట్టుబడిన వెంకటరెడ్డి, ఈశ్వర్రెడ్డిని రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించారు. బళ్లారి నుంచి 4.95 కోట్ల నగదు తరలిస్తూ గుంతకల్లు వద్ద పోలీసులకు పట్టుబడిన ఇద్దరు నిందితులను శుక్రవారం ఉరవకొండ కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలోనే వీరిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు విడివిడిగా పిటిషన్ దాఖలు చేసియున్నారు. కాని కోర్టు మొదట పోలీసులకు రెండు రోజులు కస్టడీలో విచారించే అవకాశాన్ని కల్పించింది.
No comments:
Post a Comment