
మూడురోజులుగా ఒక్కటే వర్షం. వాగులు, వంకలు పొంగాయి. మట్టిరోడ్డుమీద నడుస్తున్నాను. ఓ కవర్లో బ్రాందీసీసా, మిరపకాయబజ్జీలు, వాటర్ప్యాకెట్లు కూడా తీసుకెళ్తున్నాను. జీవితం గురించి ఆలోచిస్తుంటే నవ్వొస్తోంది. చేరుకోవాల్సిన కొండలు అల్లంతదూరాన కన్పిస్తున్నాయి. ఇంకెంతసేపు... ఓ పావుగంటలో చేరతాను.
అంటే- ముప్పరు ఏళ్లపాటు పెంచిపోషించిన శరీరాన్ని చాలించడానికి మహా అయితే ఓ గంట సమయముంది. ఈసారి ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోవాలి. లోగడ రెండుసార్లు అనుకుని చేసుకోలేకపోయాను. ఆ పరిస్థితి ఇప్పుడు రాదు. రాకూడదని కోరుకుంటున్నాను.
కొండలు సమీపిస్తున్నాయి. ఆ మట్టిరోడ్డులో ఎవరూ నడవడం లేదు. అప్పుడప్పుడు ఆటోలు కన్పిస్తున్నాయి. చాలా నిశ్శబ్దంగా ఉందా ప్రదేశం. చల్లనిగాలులు వీస్తున్నాయి. కొండల పక్కనే రైలుపట్టాలు కన్పించాయి.
అబ్బ! నా చివరి మజిలీ ఈ రైలు పట్టాలమధ్య సాగుతోంది. వాటి అంచు వెండిలా మెరుస్తోంది. దానిమీద నా నెత్తురు రంగేస్తాను. అయితే దాన్ని చూసే అవకాశం నాకుండదు. ఇలా అనుకుంటుంటే నాకే నవ్వొస్తుంది.
'చచ్చిపోతామని ముందే తెలిస్తే చెమటలు పట్టిపోతాడు మనిషి. గుండె వేగం పెరుగుతుంది. మరి నాకలాంటివి లేవెందుకు? బతకాలనుకున్నవాడు చావంటే భయపడతాడు కానీ తనకేంటనుకుని, ఏటవాలు కొండచాటున గడ్డిలో కూర్చుని ఇష్టమైన వాటిని ముందు పెట్టుకుని తృప్తిగా చూశాను.
ప్లాస్టిక్గ్లాసులోకి బ్రాందీ వంపుకుని వాటర్ని కలిపి 'అయిపోయిందమ్మా వ్యసనమమ్మా! నేను తాగుబోతును కాను. నాకు రావాల్సిన ఉద్యోగం జస్ట్ మిస్సయింది. లేకుంటే తాగేవాడిని, కొన్ని వందల సీసాలు తాగేవాడిని. అటు తయారీదార్లకు, ఇటు సర్కారుకి, అధిక ధరకు పాడుకుని అమ్మినోడికి... అందరికీ నావల్ల లాభాలు వచ్చేవి' అనుకుంటూ ఓ గ్లాసు తాగాను.
రెండు ఉల్లిపాయముక్కలు నోట్లో వేసుకుని కసావిసా నమిలితే చాలా బాగుంది. ఏదేమైనా మందుకి, ఉల్లికి మంచి కాంబినేషన్ అని వాచీ చూశాను. టైం పన్నెండయింది.
ఊళ్లో ఏ మంచిపనికైనా బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టే శాస్త్రిగారు గుర్తొచ్చారు.
'ఆత్మహత్య చేసుకుంటాను మంచి ముహూర్తంపెట్టమంటే ఎవరూ పెట్టరుగా. అందుకే ఒక పని చేయబోతున్నాను. మంచి ఘడియలు చెప్పమంటే మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకగంట వరకు శుభఘడియలు. అప్పుడు ఏ పనిచేసినా విజయమే అని చెప్పి యాబైనోటు తీసుకున్నాడు. పాపం పంతులయ్యకు నే చచ్చాక తెలుస్తుంది ఎందుకు ముహూర్తం పెట్టించానో' అనుకుని పకపకా నవ్వాను.
సీసాలో మిగిలింది గ్లాసులోకి వంపుకుని నీళ్లు కలిపి ఈ సారి మిరపకాయబజ్జీలతో లాగించేశా. కళ్లు ఎర్రగా అయ్యాయి.
అక్కడ ఎండిన చెట్టుమీద కాకి ఇటువైపే చూస్తుంటే 'నేను నీకేమీ మిగల్చకుండా తినిపోను. ఇదిగో ఎంగిలి చేయని బజ్జీ' అని దానివైపుకు ఒక బజ్జీ విసిరాను. అది గాల్లోనే తన్నుకుని మరోచెట్టువైపుకు ఎగిరిపోయింది.
స్వార్ధం. ప్రతిజీవిలోనూ స్వార్ధం. దిక్కుమాలిన కాకి బజ్జీముక్క కోసం చూసింది. ఈ ముసురులో ఆహారం కోసం ఎక్కడని వెతుకుందని బజ్జీ ఇస్తే తన్నుకుపోయింది. చెట్టంత మనిషివి. ఎందుకురా చావడానికి సిద్ధపడ్డావని అడగలేదు. కాకులూ మనుషుల్లా తయారయ్యాయి. అయినా ఈసారి ఆత్మహత్య చేసుకోవాలి. ఈ పక్షులతో, మనుషులతో పడలేక ఛస్తున్నాను.
ఉద్యోగం రావడం గ్యారెంటీ. ఊరి ఎమ్మెల్యే సిఫార్సు ఉంటే మరింత వేగంగా ఆర్డర్సు రెడీ అవుతాయని ఎవరో చెబితే, తండ్రితో వెళ్లి చెప్పుకున్నందుకు, ఆ ఉద్యోగం రాజకీయాల మాటున దక్కలేదు. వేరెవరో తన్నుకుపోయారు. భవిష్యత్ డీలా పడిపోయింది. పర్వతమంత ఎత్తుకు ఆ రాజకీయాలు ఎదిగిపోయాయి. నాకు ఉద్యోగం రాకుండా చేసిన రాజకీయాలను మట్టుబెట్టలేను. ఎంతని చిన్నచిన్న పనులు, ఉద్యోగాలు చేయడం. అందుకే చచ్చిపోవాలనుకున్నాను. తొలి ప్రయత్నంలో ఆత్మహత్య చేసుకున్నా చావలేకపోయాను.
పురుగుల మందు తాగాను. నా ఖర్మ బతకాలని రాసుంది. ఆ పురుగులమందు కాస్తా ఎక్స్పైర్డు. నాలుగు వాంతులు, రెండ్రోజులు ఆసుపత్రిలో సెలైన్లతో గుండ్రాయిలా లేచి కూర్చున్నాను.
నచ్చిన అమ్మాయి. మనస్సునిండా ఆమే. అంతగా ప్రేమించాను. ఆమె కూడా నన్ను ఇష్టపడింది. ఇద్దరం పెళ్లి వరకు వెళ్లాం. నిరుద్యోగితో జీవితాంతం నరకమేనని చెప్పి, ఆమె తండ్రి ఎక్కువ కట్నంపోసి రైర్వేలో ఉద్యోగం చేసేవాడికి ముడెట్టేసాడు. ఆమె కూడా మెడ వంచి తాళి కట్టించుకుంది.
ఫోన్లోనే ఆమెను నాలుగు దులిపాను.
'నిన్నెలా నమ్మను. ఉద్యోగం రానందున పురుగులమందు తాగావు. నీమీద నీకే నమ్మకం లేదు. నాకు తెలియక నీ ప్రేమలో పడ్డాను. నీ చావుతో నువ్వే ఆడుకుంటావని తర్వాత తెలిసింది. మరెలా నిన్ను నమ్మను. ఒకవేళ నీతో నేను వచ్చేస్తే ఇద్దరం రోడ్డుపాలయ్యేవాళ్లం. ఈ బాధలు పడలేమని నువ్వు ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే నాగతేం కాను. ముందు నిన్ను నువ్వు నమ్ము. అప్పుడు నువ్వేదైనా సాధిస్తావని' ఎంత పరుషంగా బదులిచ్చింది.
ఇలాంటిదాన్నా ప్రేమించాననుకుని రెండోసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. విరాగిలా అయిపోయి తెల్లవారుజామున ఊరవతల కోనేట్లో దూకేశాను.
ఈత రానందున నీళ్లలో మునిగిపోయా. గంగాళంలా నోరు తెరుచుకుని అందినకాడికి నీళ్లు తాగేసి గుడ్లు తేలేశాను. చచ్చాననుకుని బిర్రబిగిసిపోయాను.
ఎవరు కోనేట్లో పడతారా. నీళ్లలోంచి బయటికి తీసేద్దామా అన్నట్టు అక్కడే ఒకడున్నట్టున్నాడు. వెంటనే దూకి నన్ను ఒడ్డున పడేశాడు. అప్పుడు మళ్లీ రెరడ్రోజులు ఆసుపత్రిలో చికిత్స. అవకాశం దొరికింది కదా అని తల్లి, చిన్నమ్మలు అందరూ కలిసి 'నీకు అందమైన అమ్మాయితో పెళ్లిచేస్తాం. ప్రేమలు వద్దురా, ఈకాలం ప్రేమలు మంచివి కావురా' అని చెవుల తుప్పొదిలేలా నూరిపోశారు.
రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవడం, తృటిలో తప్పిపోవడంతో ఊరంతా బతికున్న శవంలా చూస్తున్నారు. ఎవరూ మాట్లాడరు. ఏ ప్రయివేటు కంపెనీ ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా లేదు.
తన పుట్టింటివారు ఇచ్చిన రెండెకరాలు నాచేతిలో పెట్టి 'సేద్యం చేసుకోరా! నాన్న జీతం తోడవుతుంది. నీకు చావాల్సిన ఖర్మ ఏంటని' నిత్యం ధైర్యం చెబుతోంది అమ్మ.
సరేనని చెమటోడ్చి వ్యవసాయం చేశా. పంట చేతికంది వస్తుందనుకుంటే, వర్షాలకు ఏటొడ్డు భూమి కాస్తా ముంపుకు గురైంది. అక్షరాలా లక్ష రూపాయలు నష్టపోయాను. అందుకే మూడోసారి ఈ దురదృష్టపు బతుకును అంతం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చా. ఎట్టిపరిస్థితిల్లోనూ ఈసారి వాయిదా పడకూడదని నిర్జన ప్రదేశంలో, అన్ని ఏర్పాట్లూ పక్కాగా చేసుకుని వచ్చాను.
నా చావుకు మంచి మూహూర్తం పెట్టిన పంతులయ్యకు రుణపడతాను.
నాలాంటి చేతకాని, చేవలేని వాడికి జన్మనిచ్చి, పెంచి పోషించిన తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. ఏమీ చేయలేక, చావును వెతుక్కుంటూ పోతున్నందుకు వాళ్లని మన్నించమని మనసారా కోరుతున్నాను.
తనమీద తనకి నమ్మకం లేని మనిషి బతికున్న శవంతో సమానమని, కొద్దిపాటి పరిచయంతోనే కనిపెట్టిన నా మాజీప్రేయసిని మరోజన్మలోనైనా నమ్మిస్తాను. నా ఉద్యోగం మరొకడి చేతిలో పెట్టిన రాజకీయాన్ని సర్వనాశనం కావాలని శపిస్తున్నాను.
ఇక ఈభూమ్మిద నేనెవరికీ జవాబుదారిని కాదు. ఎంతోహాయిగా, మనసు తేలిక చేసుకుని జీవితాన్ని చాలించేందుకు సిద్ధపడుతున్నాను.
వాచీ చూసుకున్నా.
చావు ముహూర్తానికి కేవలం ఐదే నిముషాలు టైముంది.
లేచి నిలబడ్డాను. నేలమీదున్న ఖాళీ బ్రాందీసీసాను చేతిలోకి తీసుకుని 'సారీరా! అందరికి అన్నీ చెప్పి నీకేమీ చెప్పలేదు. ఇప్పుడు చచ్చినా మరో ఇరవై ఏళ్లలో నిన్ను వెతుక్కుంటూ నీవైన్ షాపుకు వస్తాను. గుడ్బై! అని ముద్దు పెట్టుకుని కదిలా.
పట్టాలను సమీపించాను. అక్కడి పరిసరాలు నిర్జనంగా వున్నాయి.
నాచావుకు ఎవరూ అడ్డంకి కాలేరు.
'ఓ మృత్యువా! ఈసారి నన్ను చూసి పారిపోకుండా అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాను. వచ్చి కబళించేరు' అని పట్టాలమీద తలపెట్టి పడుకుని నింగిలోకి చూశా.
ముసురు పట్టిన ఆకాశంలోంచి వర్షపు తుంపరలు పడుతున్నాయి. గురి చూసికొట్టినట్టు కళ్లలో గుచ్చుకునేసరికి పక్కకు ఒరిగాను. ట్రైన్ వస్తున్న శబ్దం వినాలని చెవులు రిక్కించాను.
కానీ ట్రైన్ ఎంతకీ రాదే. భారంగా ఓ గంట గడిచింది.
ఎందుకలా? ఈవైపు ప్రతి పావుగంటకో ట్రైనో, గూడ్సో దూసుకుపోతుంది. మరి గంటయినా రాకపోవడమేంటి? వాటే హెల్?! ట్రైన్ జీవితకాలం లేటు అవడానికి నేనేమీ ప్రయాణీకుడ్ని కాదే!? విధివంచితుడను. 'నాచావు నేను ఛస్తానంటే చావనీయకుండా రైలు రావడానికి ఇంతలేటా! ఇండియన్ రైల్వేస్ ఎంత వరస్టు నేచర్తో ఉన్నాయి' అని పట్టాల మీద అలా పడుకునే కోపంతో ఊగిపోయాను.
మరో గంట గడిచింది. ఒక్క రైలూ రాలేదు.
పంతులు పెట్టిన ముహూర్తం గోవిందా. అయ్యయ్యో! ఈ భూమ్మీద ఎందుకూ పనికిరాని వాడిని నేనేనా? అందరూ మోసం చేస్త్తున్నారని చద్దామనుకుంటే... దానికీ ది గ్రేట్ రైల్వేస్ అడ్డంకిగా తయారయ్యాయా? అని చిర్రెత్తి లేచి కూర్చున్నాను.
సాయంత్రం వరకు ఒక్క ట్రైనూ రాలేదు. ఈలోగా మళ్లీ మేఘాలు కమ్ముకుని వర్షం మొదలయింది.
'మూడోసారీ ఫెయిల్. పక్కాప్లాన్తో వచ్చినా చావలేక పోయా. ఎక్కడా చిన్న పొరపాటు కూడా చేయలేదు. మరెందుకు ఫెయిల్ అయ్యాను? అసలు రైళ్లెందుకు తిరగడం లేదో తెలుసుకోవాలి' అని లేచేసరికి అల్లంత దూరాన పట్టాలు చెక్చేసుకుంటూ సాగుతున్న గ్యాంగ్మేన్ కనిపించాడు. అతన్ని కలుసుకుని రైళ్లు ఎందుకు రావడంలేదని అడిగా. ''వరదలొస్తే రైళ్లెక్కడొస్తాయి. వారం రోజులవరకు అంతే'' చెప్పి ముందుకు సాగాడు.
బతకడానికి ఎవరెవరో అడ్డుపడుతున్నారు. అలాగే చావడానికి అలాంటి అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఏం చేద్దాం?! మాజీ ప్రేమికురాలు చెప్పినట్టు నన్ను నేను నమ్మితేనే బతకగలను. నిజమే... బతకాలి. చావు దానంతట అది వచ్చేదాక చావకూడదు. దృఢచిత్తంతో ఇంటికి వెళ్లా. ఇంటిముందు రెవెన్యూ గుంపు ఉంది
''నీ రెండెకరాలకి సర్కారు నష్టపరిహారం ఇస్తోంది'' అన్నారెవరో.
బతకాలనుకున్నానో లేదో చల్లని కబురు అందిందనుకుని గట్టిగా తల విదిలించాను.
- యర్నాగుల సుధాకరరావు
No comments:
Post a Comment