
- లగడపాటి రాకతో ఆర్టీఎ వద్ద ఉద్రిక్తత పలువురి అరెస్టు
- విద్యుత్ కార్యాలయం వద్ద లాఠీఛార్జి
- సచివాలయ ఉద్యోగుల బస్సులపై రాళ్లు
- బస్భవన్ వద్ద కార్మికుల అరెస్ట్
హైదరాబాద్లో సకల జనుల సమ్మె మరింతగా వేడెక్కింది. బుధవారం
పలు చోట్ల ధర్నాలు, అరెస్టులు, నిరసనలతో ఉద్రిక్తతకు దారి తీసింది.
లాఠీఛార్జిలతో రవాణా శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్పై సోమవారం
ఆందోళనకారులు చేయి చేసున్న ఉదంతంతో ఆందోళనకర పరిస్థితి నెలకొని ఉండగా
కాంగ్రెస్కు చెందిన విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ రంగ ప్రవేశంతో మరింత
ఉద్రిక్తత ఏర్పడింది. మంగళవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో సోమాజిగూడలోని
ఆర్టీఎ కార్యాలయంలో ఉన్న శ్రీనివాస్ను లగడపాటి పరామర్శించారు. శాంతి
భద్రతల సమస్య తలెత్తుతుందని భావించి పోలీసులు లగడపాటిని అరెస్టు చేసి
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీఎ,
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు టిఆర్ఎస్, టి కాంగ్రెస్
ఎమ్మెల్యేలు, ఎంపిలతోపాటు, ఉద్యోగ సంఘాల నేతలు చేరారు. వీరిని కూడా
పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే సమ్మె చేస్తున్న ఆర్టీసి కార్మికులు
సుందరయ్య పార్క్ నుండి బస్భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్భవన్
వద్దకు చేరిన కార్మికులను అరెస్ట్ చేశారు. సచివాలయం సమీపంలోని మింట్
కాంపౌండ్లోని విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే
హరీష్రావును పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి
పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. వనస్థలిపురం నుండి సచివాలయ ఉద్యోగులతో బయలు
దేరిన ఐదారు బస్సులపై ఆందోళనకారులు రాళ్లదాడి చేశారు.
నిరసన
కారులను అదుపు చేసేందుకు పోలీసులు అక్కడ లాఠీ ఛార్జి చేశారు. ప్రభుత్వ
డ్రైవర్ల సమ్మె వల్ల సచివాలయంలో అధికారులు ఇబ్బందులు పడ్డారు. కొంత మంది
స్వంతంగా కార్లు డ్రైవ్ చేసుకొని రాగా మరికొంత మంది నడిచి వచ్చారు. మంత్రి
ఆనం రామనారాయణరెడ్డి కారును ఆందోళనకారులు అడ్డుకోవడంతో కొద్దిసేపు
ఉద్రిక్తత ఏర్పడింది.
ఆర్టీఎ కార్యాలయం వద్ద
మంగళవారం
ఉదయం 11 గంటలప్రాంతంలో లగడపాటి రాజగోపాల్ ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి సోమవారం
తెలంగాణ వాదుల దాడికి గురైన అదనపు కమిషనర్ శ్రీనివాస్ను పరామర్శించారు.
ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంపి
దగ్గరకు చేరుకొని ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. ఒక ఉద్యోగిని
పరామర్శించినందుకు ఎందుకు అరెస్ట్ చేస్తారని ఆయన పోలీసులను ప్రశ్నించారు.
తమకు పైనుండి ఆదేశాలు ఉన్నాయని అందుకే అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు
తెలిపారు. పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ
విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్రావు, కొప్పుల ఈశ్వర్,
కాంగ్రెస్ ఎమ్మెల్యే విష్ణువర్దన్రెడ్డి, ఎంపి మధుయాష్కీ ఆర్టీఏ ఆఫీసుకు
వద్దకు వచ్చారు. వీరితోపాటు తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్
కోదండరామ్, ఉద్యోగ సంఘాల జెఏసి చైర్మన్ స్వామిగౌడ్, టఎన్జివో
అధ్యక్షులు శ్రీనివాస్గౌడ్ కూడా అక్కడికి చేరుకున్నారు. వీరు ఆఫీసులోనికి
వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు
తెలంగాణ వాదులకు మధ్య తోపులాట చోటు చేసుకొంది. లోనికి ఏవరూ వెళ్లవద్దని
పోలీసులు వారించారు. లోనికి ఏవరూ వెళ్లకూడదన్నపుడు లగడపాటి ఎలా వెళ్లారని
ప్రశ్నించారు. పోలీసులను తోసుకొని తెలంగాణవాదులు లోనికి వెళ్లడానికి
ప్రయత్నించగా హరీష్రావు, విష్టువర్దన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్ లను
అరెస్ట్ చేశారు. వీరితోపాటు ఉద్యోగ సంఘాల నేతలను, కోదండరామ్ను కూడా
అరెస్ట్ చేశారు. కాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న లగడపాటిని
బయటికి రావాలంటూ తెలంగాణ లాయర్లు కొద్దిసేపు ఆందోళన చేశారు. లగడపాటి కూడా
ఇంటికి వెళ్లనని కొద్దిసేపు భీష్మించడంతో ట్రాఫిక్ను క్లియర్ చేసే
క్రేన్ సాయంతో లగడపాటిని, ఆయన కారులోనే పోలీసులు అక్కడి నుండి తరలించారు.
బస్ భవన్ వద్ద
ఆర్టీసి
కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ
సుందరయ్య పార్క్ నుండి బస్భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా
వచ్చిన కార్మికులు ఆఫీసులోనికి వెళ్తారేమోనని పోలీసులు అరెస్ట్ చేశారు.
జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ సమ్మెను విచ్చిన్నం
చేయడానికి ప్రభుత్వం కార్మికులకు తాయిలాలు ప్రకటించిందని విమర్శించారు.
కార్మికులు తాయిలాలకు లొంగకుండా సమ్మెను కొనసాగించాలని కోరారు.
మింట్ కాంపౌండ్ వద్ద
తెలంగాణలోని
రైతులకు 7 గంటల విద్యుత్ ఇవ్వాలని, కరెంటు కోతలకు సమ్మెను బూచిగా
చూపించడం సిఎంకు సరైంది కాదని విద్యుత్ ఉద్యోగులు మింట్ కాంపౌండ్లోని
విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్
ఎమ్మెల్యే హరీష్రావు పాల్గొన్నారు. ఉద్యోగులు ఆఫీసులోనికి వెళ్లడానికి
ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ఉద్యోగులకు మద్య వాగ్వాదం,
తోపులాట చోటు చేసుకున్నాయి. ఉద్యోగులను నియంత్రించేందుకు లాఠీఛార్జ్
చేశారు. ఎమ్మెల్యే హరీష్రావును పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఆయన
తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి. చొక్కా
చినిగింది. ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం
ఉద్యమాన్ని అణచడానికి తీవ్రంగా కుట్రలు చేస్తోందన్నారు. డిసిపి స్టీఫెన్
రవీంద్ర తన అంతు చూస్తానని బెదిరిస్తున్నారన్నారు.
ఉద్యోగుల బస్సులపై రాళ్లు
మంగళవారం
ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వనస్థలిపురం నుండి సచివాలయానికి ఉద్యోగులతో
బయలుదేరిన 10 బస్సులను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. తెలంగాణలో సకల జనుల
సమ్మె జరుగుతుంటే మీరు ఉద్యోగాలు ఏలా చేస్తారని వారిని అక్కడి నుండి
వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో తెలంగాణ
వాదులు జైతెలంగాణ నినాదాలు చేశారు. బస్సులను వెళ్లనివ్వాలని పోలీసులు కోరగా
వెళ్లనిచ్చేది లేదన్నారు. ఇరుపక్షాల మద్య వాగ్వాదం చోటుచేసుకొంది. ఆగ్రహం
చెందిన ఆందోళనకారులు కొన్ని బస్సుల అద్దాలు పగుల గొట్టారు. దీంతో పోలీసులు
లాఠీఛార్జ్ చేశారు. సుమారు 50 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు
తరలించారు.
స్వామిగౌడ్కు అస్వస్థత
ఆర్టీఏ
ఆఫీసు వద్ద మంగళవారం నిరసన తెలపడానికి టిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలతోపాటు
ఉద్యోగ సంఘాల జెఏసి చైర్మన్ స్వామిగౌడ్ కూడా వచ్చారు. నాయకులను అరెస్ట్
చేసే క్రమంలో పోలీసులతో జరిగిన తోపులాటలో ఆయన గాయపడ్డారు. అస్వస్థుడైన
ఆయన్ని కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో ఉన్న ఆయన్ని టిఆర్ఎస్
అధ్యక్షులు కె చంద్రశేఖరరావు పరామర్శించారు. మరో 24 గంటలపాటు స్వామిగౌడ్ను
అబ్జర్వేషన్లో ఉంచాలని డాక్టర్లు చెప్పినట్టు కెసిఆర్ తెలిపారు. ఆయన
త్వరగా కోలుకొనేలాగా డాక్టర్లు వైద్యం అందించాలని ఆయన సూచించారు.
స్వామిగౌడ్కు తగిలిన గాయాలను చూస్తుంటే ఆయనపై ఉద్దేశ పూర్వకంగా పోలీసులు
దాడి చేసినట్లు కనబడుతోందని ఆరోపించారు.
No comments:
Post a Comment