Sep 28, 2011

హోం, ఎకై ్సజ్‌ మంత్రులపై సిబిఐ దర్యాప్తు...

  • హైకోర్టు అభిప్రాయం
  • మంత్రి శంకర్రావు ఆరోపణలు విచారణకు స్వీకరణ
రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణపై రాష్ట్ర చేనేత శాఖ మంత్రి డాక్టర్‌ శంకర్రావు చేసిన ఆరోపణల మీద సిబిఐ దర్యాప్తు జరపాల్సిన అవసరముందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి ప్రకటించారు. పోలీసు నియామకాల్లోనూ, బదిలీల్లోనూ హోం మంత్రి, ఆమె కుమారుడు, మంత్రి మోపిదేవి వెంకటరమణ డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ మంత్రి శంకర్రావు చెప్పినట్లు వచ్చిన వార్తా కథనాలను సుమోటో రిట్‌గా స్వీకరించిన న్యాయమూర్తి ఈ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు. మంత్రులపై కథనాలను రిట్‌గా స్వీకరిస్తూ సిబిఐ, శంకర్రావు, సబిత, మోపిదేవి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా చేసి నోటీసుల జారీకి న్యాయమూర్తి ఆదేశించారు. ఈ రిట్‌ను తదుపరి విచారణ నిమిత్తం ధర్మాసనం ముందు పెట్టాలని జస్టిస్‌ నరసింహారెడ్డి ఆదేశించారు. ఒక మంత్రి మరో మంత్రిపై ఆరోపణలు చేస్తే ప్రజాస్వామ్యంలో వాటిని విస్మరించజాలమని, వాటిపై దర్యాప్తు జరగాల్సిందేనని పేర్కొన్నారు. ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది కాబట్టి ఈ ఆరోపణలను కోర్టు రిట్‌గా స్వీకరించినట్లు నరసింహారెడ్డి ప్రకటించారు. ఒక కేబినెట్‌ మంత్రి తన సహచర మంత్రులపై అవినీతి ఆరోపణలు చేసి అవి నిరూపించలేకపోతే తాను శిక్షకు సిద్ధమని ప్రకటించారని, ఈ అవినీతి ఆరోపణల్లో ఏమాత్రం నిజమున్నా దీనిపై చాలా పెద్ద చర్య తీసుకోవాల్సిన అవసరముంటుందని న్యాయమూర్తి ప్రకటించారు. ఈ రిట్‌ను వెంటనే బెంచ్‌ ముందు ఉంచాలని ఆయన రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.
మంత్రి శంకర్రావు తన సహచర మంత్రులైన హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సయిజ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నిబంధనలను పాతరేసి సిఐ, ఎసిబిల పోస్టుల బదిలీల్లో హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు, తమ్ముడు కలిసి అవినీతికి పాల్పడుతున్నారని, ఒక్కో పోస్టుకు 15 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రెవెన్యూ శాఖలోనూ అవినీతి పెచ్చుమీరి పోయిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పాలనపై పట్టులేదంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఇకనైనా అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోకుంటే అక్టోబర్‌ రెండో తేదీన తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. హోంమంత్రి అక్రమ ఆస్తులపై గతంలోనే సిబిఐకి లేఖ రాశానని, మరోసారి రాయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్ళినా ఆయన పట్టించుకోవడం లేదన్నారు.

No comments: