Sep 28, 2011

లంచమడిగితే ఒక్క ఫోన్‌ చేయండి...

  • సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి
  • కర్నూలులో కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి విగ్రహావిష్కరణ
రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచం అడిగితే అదే ఆఫీసు నుంచి టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఒక్క ఫోన్‌ చేస్తే వెంటనే వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా మంగళవారం కర్నూలు నగరంలో కోట్ల సర్కిల్‌ను, అనంతరం అదే సర్కిల్‌లో కోట్ల విగ్రహాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. అదే విధంగా కోట్ల జీవిత చరిత్రపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచారన్నారు. విజయభాస్కర్‌రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే వన్నె తెచ్చారని తెలిపారు. రాజీవ్‌ గాంధీ లాంటి వాళ్లు కోట్ల నిజాయితీని సగర్వంగా చెప్పేవారన్నారు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా తనను నమ్ముకున్న వారికి అండగా ఉండేవారని చెప్పారు. అదే వారసత్వంతో రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకు ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ''ప్రతి కార్యాలయంలో అవినీతి జరుగుతుంది.. ..జరుగుతుందా?'' అని సిఎం ప్రశ్నించగా, ''అవును జరుగుతుంది'' అని ప్రజల నుంచి సమాధానం వచ్చింది. నవరబర్‌ ఒకటి నుండి ప్రజలకు సర్టిఫికెట్లు ఇచ్చే నిబంధనలను సరళీకృతం చేస్తున్నామని తెలిపారు. లంచం లేకుండా సర్టిఫికెట్లు ఇచ్చేలా ఈ ప్రాజెక్టును రూపొందించామన్నారు.
ఎక్కడైనా పది నిమిషాలకు మించి ఆలస్యం జరిగినా, లంచం అడిగినా అదే కార్యాలయం నుంచి టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రానున్న మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ప్రతిపక్షాలు అవహేళన చేస్తున్నాయన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఇందిర జల ప్రభ కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా దళిత, గిరిజన భూముల్లో సాగు నీరు అందించేలా మైక్రో ఇరిగేషన్‌ మెగా ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ఏడాదికి ఐదు లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు.

No comments: