Sep 19, 2011

సమ్మె కొనసాగిస్తే రైతులకు కోతే! సాగుకు విద్యుత్ సరఫరాపై సీఎం కిరణ్

సాగుకు విద్యుత్ సరఫరాపై సీఎం కిరణ్

సింగరేణి సమ్మెతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ్యాఖ్య
కరెంట్ కోత విధిస్తామని హెచ్చరిక!
సీఎం తీరుపై మండిపడ్డ నేతలు..
రైతులకు గంట కోత విధించినా సహించేది లేదని స్పష్టీకరణ
సమ్మె పరిష్కారానికి ప్రయత్నం
చేయకుండా బెదిరింపులకు
దిగడమేమిటని నిలదీత
రేపు సింగరేణి ప్రాంతంలో బస్సు యాత్ర చేపడతామని వెల్లడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర సర్కారును సమస్యలపై సమస్యలు చుట్టుముడుతున్న తరుణంలో వాటి పరిష్కారానికి మార్గాలు వెతకాల్సిన సీఎం కిరణ్ పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నట్లున్నారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగితే మరో రెండ్రోజుల్లో రైతులకు కరెంటు సరఫరా నిలిపేయాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిసింది. ఇప్పటికే విత్తనాల్లేక, ఎరువులు దొరక్క, కరెంటు కోతలతో అన్నదాత సతమతమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి... తాజాగా సమ్మెకు రైతుల కరెంటుకు ముడిపెట్టి రైతుల పట్ల తన ‘చిత్తశుద్ధి’ చాటుకున్నారు! బొగ్గు గనుల్లో సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసుల వేధింపులను ఆపాలని కోరేందుకు వెళ్లిన తెలంగాణ ప్రజాప్రతినిధులు, నేతలతో సీఎం ఈ బెదిరింపు చేయడంతో వారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రైతులకు ఒక్క గంట కరెంటు కోత విధించినా సహించేది లేదని సీఎంకు తేల్చిచెప్పారు. ఆదివారం తెలంగాణకు చెందిన వివిధ పార్టీల నేతలు, సంఘాల ప్రతినిధులు క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. గనుల్లో సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసుల వేధింపులు ఆపాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సింగరేణిలో సమ్మె వల్ల ఇప్పటికే విద్యుత్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, పక్క రాష్ట్రాల నుంచి బొగ్గు కొనుగోలు చేసే అవకాశం లేకపోతే మరిన్ని ఇబ్బంది ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి రెండు ప్రాంతాల నేతలతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే పరిష్కారం వస్తుందని తెలిపారు. సమ్మె ఇలాగే కొనసాగితే రైతులకు కరెంటు నిలిపేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ఇందుకు తెలంగాణ నేతలు తీవ్రంగా ప్రతిస్పందించినట్లు తెలిసింది. అవసరమైతే పరిశ్రమలకు, ప్రభుత్వ కార్యాలయాలకు కోత పెట్టుకోవాలని, అంతేతప్ప రైతులకు కరెంటు ఆపడమేమిటని వారు నిలదీశారు. సమ్మెకు పరిష్కారంగా తెలంగాణ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయకుండా ఇలా బెదిరింపులకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సమ్మె పరిష్కారానికి ప్రయత్నించకుండా రైతులకు విద్యుత్‌ను సరఫరా చేయలేమని చెప్పడం సరికాదు. రైతులకు ఒక గంట తగ్గినా అంగీకరించం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతల్లో ఉన్న మీరు ఏ చర్యలు తీసుకుంటారో మీ ఇష్టం. రైతులకు కరెంటును తగ్గిస్తే మాత్రం సహించేది లేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే సమ్మె ఆగిపోతుంది. ఆ దిశలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా.. రైతులకు కరెంటును నిలిపేస్తామని ఎలా బెదిరిస్తారు’’ అని వారు సీఎంను ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్ (తెలంగాణ ప్రజా ఫ్రంట్), జి.వివేక్ (కాంగ్రెస్ ఎంపీ), ఎర్రబెల్లి దయాకరరావు (టీడీపీ ఎమ్మెల్యే), నాగం జనార్దన్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలచారి, బోడ జనార్ధన్ (తెలంగాణ నగారా సమితి), నాయిని నర్సింహారెడ్డి (టీఆర్‌ఎస్), బద్దం బాల్‌రెడ్డి, కె.లక్ష్మణ్ (బీజేపీ), అల్లం నారాయణ (టీజేఎఫ్), రాజేందర్‌రెడ్డి (న్యాయవాదుల జేఏసీ), రాజిరెడ్డి (ఆర్టీసీ జేఏసీ), నరసయ్య (డాక్టర్ల జేఏసీ) తదితరులు ఉన్నారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులపై పోలీసుల వేధింపుల విషయాన్ని నేతలు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించగా.. సింగరేణి జనరల్ మేనేజర్‌గా ఉన్న వ్యక్తి తెలంగాణ వ్యక్తే కదా అని ముఖ్యమంత్రి బదులిచ్చినట్టు సమాచారం. కాగా ముఖ్యమంత్రిని కలిసి బయటకు వచ్చిన నేతలు.. మంగళవారం అన్ని రాజకీయ పార్టీల, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలు సింగరేణి ప్రాంతాలలో బస్సుయాత్ర చేపడతామని తెలిపారు.


కార్మికులకు అండగా ఉంటాం..

ముఖ్యమంత్రితో భేటీకి ముందు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలు సమావేశమయ్యారు. సింగరేణి బొగ్గు గనుల్లో సమ్మెకు సహకరిస్తున్న కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో బెదిరింపులకు దిగడాన్ని ఖండించారు. సింగరేణిలో సమ్మె శాంతియుతంగా జరుగుతున్నప్పుడు, కార్మికులను అణవేయాలని ప్రయత్నించడం సరికాదని ఎంపీ వివేక్ అన్నారు. ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, సింగరేణి ప్రాంతంలో మోహరించిన పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని నాయిని డిమాండ్ చేశారు. సమ్మెలో ఉన్న కార్మికులకు ధైర్యం చెప్పేందుకు సింగరేణి ప్రాంతంలో పర్యటిస్తామని నాగం చెప్పారు. సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు నష్టం కలిగేలా ఏ సంఘటన జరిగినా తమ పార్టీకి చెందిన 33 మంది ఎమ్మెల్యేలు అక్కడకు చేరుకొని వారికి అండగా ఉంటారని ఎర్రబెల్లి దయాకరరావు ప్రకటించారు. సమ్మె విజయవంతం కావడం సహించలేక ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతుందని కె.లక్ష్మణ్ విమర్శించారు. సింగరేణి కార్మికుల స్ఫూర్తితోనే సోమవారం నుంచి తాము సమ్మెకు దిగుతున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ రాజిరెడ్డి ప్రకటించారు.

No comments: