Sep 19, 2011

బస్సుకు బ్రేక్ తెలంగాణలో స్తంభించనున్న ప్రజా జీవనం

కీలక దశకు చేరిన సకల జనుల సమ్మె
నేడు జాతీయ రహదారుల దిగ్బంధం
సీమాంధ్ర సర్వీసులనూ అడ్డుకుంటాం: జేఏసీ
రోడ్లన్నీ పోలీసుమయం... భారీ బందోబస్తు
ఆలంపూర్, జహీరాబాద్, కోదాడ, సాగర్లలో పికెట్లు... బస్ డిపోల వద్ద భద్రత
రంగంలోకి ఏపీఎస్పీ, పారా మిలటరీ
అవసరమైతే ముందస్తు అరెస్టులు?
{పత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం
నేటి నుంచి సమ్మెలోకి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు
విద్యుత్ ఉద్యోగులు కూడా.. నేటి నుంచి బిల్లుల వసూళ్లు నిలిపివేత
కేజీ నుంచి పీజీ దాకా చదువులన్నీ బంద్
{పైవేటు స్కూళ్ల బంద్ 24 దాకా పొడిగింపు
అన్ని స్కూళ్లలోనూ త్రైమాసిక పరీక్షలు వాయిదా
24కు వాయిదా పడ్డ ఆటోల బంద్
నెలాఖరుకల్లా జేఏసీపై ఒత్తిడి.. ప్రభుత్వ అంచనా
అదే అదనుగా సమ్మెను విరమింపజేసే యోచన

సకల జనుల సమ్మె ఉగ్ర రూపు దాల్చింది. వారం రోజులుగా ఆందోళన బాట పట్టిన ఉద్యోగులకు మిగతా వర్గాలూ తోడవడంతో సమ్మె కీలక దశలోకి ప్రవేశించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెకు దిగడంతో రవాణా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతోంది. సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపు మేరకు జరగనున్న జాతీయ రహదారుల దిగ్బంధం దీనికి తోడైంది. దాంతో తెలంగాణలో పౌరజీవనం పూర్తిగా స్తంభించనుంది. మరోవైపు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులతో పాటు విద్యుత్ ఉద్యోగులూ సోమవారం నుంచి సమ్మె బాట పట్టనున్నారు! దాంతో కరెంటు బిల్లుల వసూళ్లు కూడా నిలిచిపోనున్నాయి.

హైదరాబాద్, న్యూస్‌లైన్: సకల జనుల సమ్మె తారస్థాయిని చేరుతోంది. ఆర్టీసీ సమ్మెతో మరింతగా అగ్గి రాజుకోనుంది. తెలంగాణవ్యాప్తంగా 89 డిపోల్లో 58 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దాంతో 10 వేల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీనికి తోడు సీమాంధ్ర నుంచి జంటనగరాలకు వచ్చే 2,500 సర్వీసులను కూడా అడ్డుకోవడానికి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతుండటంతో ఘర్షణ వాతావరణం తలెత్తే పరిస్థితి నెలకొంది. ఎందరు పోలీసులను మోహరించినా ఆర్టీసీ బస్సులతో పాటు సీమాంధ్ర నుంచి రాకపోకలు సాగించే ప్రైవేటు సర్వీసులనూ అడ్డుకుంటామని ఎన్‌ఎంయూ తెలంగాణ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, రంగారెడ్డి జిల్లా సలహాదారు పి.ఆర్.కె. రెడ్డి ప్రకటించారు. ఎంజీబీఎస్ నుంచి ఒక్క బస్సును కూడా కదలనిచ్చేది లేదన్నారు. దాంతో ఎంబీబీఎస్ నుంచి తెలంగాణ జిల్లాలకు వెళ్లే 1,600 సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇతర సర్వీసుల విషయంలోనూ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దాంతో రాష్ట్రమంతటా ప్రజా రవాణాపై సమ్మె ప్రభావం పడేలా కన్పిస్తోంది. ఎంజీబీఎస్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను ఎన్‌ఎంయూ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆదివారం అర్ధరాత్రి అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దానికి తోడు బెంగళూరు వెళ్లాల్సిన 20 బస్సులతో మొత్తం 80 సర్వీసులను ఆర్టీసీ నిలిపేసింది. దాంతో ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన వందలాది మంది ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు.

మరోవైపు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు కూడా సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. దాంతో ఇప్పటిదాకా ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగిన నామమాత్ర సేవలూ పూర్తిస్థాయిలో నిలిచిపోనున్నాయి. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ (టీజాక్) కూడా ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి కరెంటు బిల్లుల వసూలు నిలిపేస్తున్నట్లు కన్వీనర్ కె.రఘు తదితరులు ప్రకటించారు. మంగళవారం నాటి బహిరంగ సభలో ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ‘‘తెలంగాణలోని 25 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారు. విద్యుత్ సరఫరా మినహా ఎలాంటి సేవలూ అందించబోం’’ అన్నారు. ఇప్పటికే కిందా మీదా పడుతున్న డిస్కంలకు ఈ నిర్ణయం అశనిపాతంగా మారింది. ఇక అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి దాపురించనుంది. ఇక టీచర్ల సమ్మెతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు మూతపడగా, 16 నుంచీ జరుగుతున్న ప్రైవేటు స్కూళ్ల బంద్‌ను 24 దాకా పొడిగించాలని తెలంగాణ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ (టెప్సా) ఆదివారం నిర్ణయించింది. ప్రభుత్వ స్కూళ్లను తెరిచేదాకా బంద్ కొనసాగిస్తామని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రెస్మా) ప్రకటించింది. వృత్తి విద్యా కాలేజీలు కూడా సోమవారం నుంచి రెండు రోజుల పాటు సమ్మెలో పాల్గొననున్నాయి. దాంతో ప్రాథమిక స్థాయి నుంచి కాలేజీల దాకా అన్ని స్థాయిల్లోనూ బోధన బంద్ కానుంది! అన్ని స్కూళ్లలోనూ సోమవారం నుంచి జరగాల్సిన త్రైమాసిక పరీక్షలు వాయిదా పడ్డాయి. పరిస్థితిని బట్టి వాటిని ఇప్పుడో, తర్వాతో నిర్వహించాల్సిందిగా డీఈఓలకు మౌఖిక ఆదేశాలందాయి. ఆటోల బంద్ 24వ తేదీకి వాయిదా పడటం ప్రస్తుతానికి కాస్త ఊరట! 23 అర్ధరాత్రి నుంచి 48 గంటల పాటు బంద్ పాటిస్తామని ఆటో కార్మికులు ప్రకటించారు. ‘‘రాజీనామా చేయని ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను 24న దహనం చేస్తాం. 25న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ధర్నా, ర్యాలీ, భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం’’ అన్నారు.

బెదిరేదే లేదు: రాజకీయ జేఏసీ

మరోవైపు సర్కారు అణచివేత చర్యలకు బెదిరేది లేదని జేఏసీ తెగేసి చెబుతోంది. ఎస్మా పరిధిలోకి మరిన్ని శాఖలను తెస్తూ జీవోలిస్తున్నా ఖాతరు చేయబోమంటోంది. శాఖాధిపతుల కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు నిలిచిపోవడం తెలంగాణేతర ప్రాంతాల్లోనూ సర్కారు సేవలకు ఇబ్బంది కలిగిస్తోంది. సింగరేణి సమ్మె సుదీర్ఘంగా కొనసాగితే విద్యుదుత్పత్తిపై పెను ప్రభావం పడుతుంది. సమ్మె రెండో వారంలోకి చేరుతున్న నేపథ్యంలో, ఈ పరిస్థితులు మరింతకాలం ఇలాగే కొనసాగితే సర్కారీ సేవల ఉనికే ప్రశ్నార్థకమయ్యేలా ఉంది. కానీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంపై కావడంతో వారిపై తీవ్రస్థాయి చర్యలకు దిగితే భారీ వ్యతిరేకత తప్పదని సర్కారు జంకుతోంది. ఉద్యోగులకు అదే శ్రీరామరక్ష అని జేఏసీ నేతలంటున్నారు. సర్కారు తొందరపడి క్రమశిక్షణ చర్యలకు దిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం... నెలాఖరు సమీపించే కొద్దీ జీతాల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తారని, కాబట్టి సమ్మె విరమణ దిశగా ఉద్యోగ సంఘాల నేతలపై ఒత్తిడి పెరుగుతుందని అంచనా వేస్తోంది. వారిని చర్చలకు రప్పించేందుకు అదే సరైన సమయమన్న భావనలో ఉన్నట్టు సమాచారం.

రోడ్లన్నీ పోలీసుమయం...!
ఆర్టీసీ సమ్మె, జాతీయ రహదారుల దిగ్భంధం నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. తెలంగాణవ్యాప్తంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉండొచ్చన్న నిఘా నివేదికల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అదనపు బలగాలతో పాటు తెలంగాణ జిల్లాల్లోని దాదాపు 40 కంపెనీల పారా మిలిటరీ బలగాలను, ఏపీఎస్పీ బెటాలియన్లను కూడా వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించారు. జాతీయ రహదారుల దిగ్బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం చేస్తామని విద్యార్థి జేఏసీ తదితర సంఘాలన్నీ ఇప్పటికే ప్రకటించాయి. అలంపూర్, ఎర్రవెల్లి (మహబూబ్‌నగర్), కామారెడ్డి, డిచ్‌పల్లి (నిజామాబాద్), సిద్దిపేట (మెదక్), వాంకిడి, నిర్మల్ (ఆదిలాబాద్), సూర్యాపేట, నకిరేకల్, వాడపల్లి (నల్గొండ)ల్లో రాకపోకల్ని పూర్తిగా అడ్డుకుంటామని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు ఎం.వేదకుమార్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో ధూంధాంకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంతో ప్రధానంగా ఆలంపూర్, జహీరాబాద్ (మెదక్), కోదాడ, నాగార్జునసాగర్ (నల్లగొండ) మార్గాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే బలగాలను మోహరిస్తున్నారు. ఆలంపూర్లో ఇప్పటికే 500 మంది పోలీసులుండగా, మరో కంపెనీ పారా మిలిటరీ బలగాలనూ పంపిస్తున్నారు. ముందు జాగ్రత్తగా అంబులెన్సులు, అగ్నిమాపక విభాగాలనూ అప్రమత్తం చేశారు. అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బందోబస్తును తెలంగాణ రీజియన్ ఐజీ అంజనీ కుమార్; మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో హైదరాబాద్ రీజియన్ ఐజీ రాజీవ్ రతన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ వి.దినేశ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ జిల్లాల ఎస్పీలు, రేంజ్ డీఐజీలతో ఆదివారం వారు సమీక్ష నిర్వహించారు. ఆర్టీసి డిపోల వద్ద సాయుధ పికెట్లు ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి ముందస్తు అరెస్టులు చేయాలని యోచిస్తున్నారు. అయితే... ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అపప్రథా ఎదురవని రీతిలో సంయమనంతో వ్యవహరించాల్సిందిగా అధికారులు, సిబ్బందిని డీజీపీ గట్టిగా ఆదేశించారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం
తెలంగాణలో ఆర్టీసీ బంద్ నేపథ్యంలో ప్రజా రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం రోడ్డు, రైలు మార్గాలను సమర్థంగా వినియోగించుకోవాల్సిందిగా ఆర్టీసీకి, దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సూచించింది. రద్దీని బట్టి దూరప్రాంత ఎక్స్‌ప్రెస్‌లకు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రోజూ 1.5 లక్షల మంది ప్రయాణిస్తారు. ఆర్టీసీ బంద్ నేపథ్యంలో అది 2 లక్షలు దాటవచ్చని అంచనా. ఆదివారం సాయంత్రం నుంచే స్టేష న్‌లో రద్దీ పెరిగింది. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్ల సం ఖ్యను పెంచాలని నిర్ణయించింది. ప్రైవేటు, అద్దె వాహనాలను వీలైనంతగా నడిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమవారం సమ్మె తీవ్రతను బట్టి మరిన్ని చర్యలు తీసుకోనున్నారు.

ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లివే...
ఆర్టీసీ పరిధిలోని 1,600 అద్దెబస్సులను వీలైనంతగా నడుపుతారు
{sాక్టర్లు, లారీల్లో భద్రతా ప్రమాణాలకు లోబడి ప్రయాణికులకు అనుమతి
రంగారెడ్డి, హైదరాబాద్‌ల్లో సెవెన్ సీటర్లకూ అనుమతి
టూరిస్టు బస్సులు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా తిరగొచ్చు
తిరిగే ప్రతి బస్సులోనూ పోలీసు భద్రత
రోజుకు రూ.500 చెల్లించి కాంట్రాక్టు డ్రైవర్ల సేవలు

No comments: