హాట్స్పాట్పై బీసీసీఐ అసంతృప్తి
ఏజీఎంలో కీలక నిర్ణయాలు
ఐసీసీపై తమ ఆధిపత్యం నిలబెట్టుకునే దిశగా శ్రీనివాసన్ తొలిరోజే ముందడుగు వేశారు. బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మరోసారి ‘రివ్యూ’ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. అంతేకాదు. ఇటీవల లండన్లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో తప్పు ఐసీసీదేనన్నారు. సోమవారం ముంబైలో జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐపీఎల్లో కొచ్చి ఫ్రాంచైజీని రద్దు చేశారు.
ముంబై: అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (యూడీఆర్ఎస్)పై బీసీసీఐ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమలవుతున్న తీరు ఆమోదయోగ్యంగా లేదని.. ఈ అంశాన్ని ఐసీసీ సమావేశాల్లో లేవనెత్తుతామని ప్రకటించింది. ఇంగ్లండ్ పర్యటనలో సవరించిన డీఆర్ఎస్ కూడా రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ విషయంలో వివాదాస్పదమైంది. కొత్తగా చేర్చిన హాట్స్పాట్ కూడా తప్పుడు ఫలితం ఇవ్వడంతో భారత జట్టు ఈ పద్ధతిని వ్యతిరేకిస్తోంది. ‘గతంలో బాల్ ట్రాకింగ్ సాంకేతికతపై వ్యతిరేకత వ్యక్తం చేశాం.
అలాగని బోర్డుకు టెక్నాలజీపై నమ్మకం లేదని కాదు. గత ఐసీసీ సమావేశంలో మేం హాట్స్పాట్తో కూడిన డీఆర్ఎస్ అమలుకు అంగీకరించాం. అది నమ్మదగ్గదని భావించాం. కానీ ఇంగ్లండ్లో జరిగింది అందరూ చూశారు. అందుకే వచ్చే ఐసీసీ మీటింగ్లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం. మరోసారి ఈ పద్ధతిని సమీక్షించాలని కోరతాం’ అని శ్రీనివాసన్ తెలిపారు.
టెక్నికల్ కమిటీ చైర్మన్గా గంగూలీ!
బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్గా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న గవాస్కర్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పదవిలో ఆయన ఏడేళ్లుగా ఉంటున్నారు. అయితే కొత్త పదవి విషయమై గంగూలీ అభిప్రాయాన్ని ఇంకా తెలుసుకోలేదని శ్రీనివాసన్ తెలిపారు. అలాగే సోమవారం జరిగిన ఏజీఎంలో నార్త్ జోన్ నుంచి సెలక్టర్గా మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్నాథ్ను నియమించారు.
టీమిండియాకు ఆహ్వానం పంపలేదు
ఐసీసీ వార్షిక అవార్డుల కార్యక్రమానికి భారత జట్టు గైర్హాజరవడంపై ఎన్.శ్రీనివాసన్ వివరణ ఇచ్చారు. ‘ఆ సమయంలో అధ్యక్షుడిగా ఉన్న శశాంక్, కార్యదర్శిగా ఉన్న నాకు మాత్రమే వారు ఆహ్వానం పంపారు. మేం బిజీగా ఉండడంతో ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. కానీ జట్టు కోసం ప్రత్యేకంగా వారు ఎలాంటి ఆహ్వానం పంపలేదు. కార్యక్రమానికి ముందు రోజు మాత్రమే ఐసీసీ... భారత్ ఆటగాళ్లను పిలిచింది. అయితే అప్పటికే వారు ఇతర కార్యక్రమాలను ప్లాన్ చేసుకున్నారు’ అని శ్రీనివాసన్ వివరించారు.
కొచ్చి కథ కంచికి..
ఐపీఎల్లో కేరళ కొచ్చి టస్కర్స్ ప్రస్థానం ముగిసింది. నాలుగో సీజన్లో (2011) బరిలోకి దిగిన ఈ ఫ్రాంచైజీ బ్యాంక్ గ్యారెంటీ సొమ్మును చెల్లించకపోవడంతో బీసీసీఐ వేటు వేసింది. సోమవారం జరిగిన బోర్డు ఏజీఎంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రూ.1550 కోట్లకు కొచ్చి ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన యాజమాన్యం ప్రతీ ఏడాది బ్యాంకు గ్యారెంటీ నగదు కింద రూ. 156 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈయితే ఈ హామీని వారు నెరవేర్చకపోవడంతో బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో ఆది నుంచీ అనేక వివాదాల మధ్య కొనసాగిన కొచ్చి ఏడాదిలోనే కనుమరుగైనట్టయింది. మరోమారు ఆ జట్టును లీగ్లోకి అనుమతించే ప్రసక్తే లేదని బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తేల్చి చెప్పారు. ఈ సీజన్లో పదిజట్లతో జరిగిన ఐపీఎల్ టోర్నీ ఇప్పుడు తొమ్మిదికి కుదించినట్టయ్యింది. అయితే కొచ్చి స్థానంలో నూతన ఫ్రాంచైజీ కోసం వేలంపై కొత్త చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలోని ఐపీఎల్ పాలకమండలి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
కోర్టుకెళతాం: కొచ్చి
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి తమను తొలగించడంపై కొచ్చి టస్కర్స్ కేరళ యాజమాన్యం బీసీసీఐపై మండిపడుతోంది. వారిపై న్యాయపరంగా ముందుకెళతామని హెచ్చరించింది. తమపై బోర్డు వినిపిస్తున్న వాదనలో నిజం లేదని కొచ్చి టస్కర్స్ చైర్మన్ ముకేశ్ పటేల్ అన్నారు. ‘బీసీసీఐ నోటీస్ తప్పు. మేం వారికి ఎప్పుడూ బకాయిపడలేదు. వాస్తవానికి బీసీసీఐనే వచ్చే నెలలో సెంట్రల్ రెవిన్యూ కింద మాకు రూ. 12 నుంచి 15 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో మా న్యాయ సలహాదారులు ఈ కేసును పరిశీలించాక వారిపై లీగల్గా వెళ్లదలుచుకున్నాం. కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉంది’ అని పటేల్ అన్నారు. మ్యాచ్ల సంఖ్య 94 నుంచి 74కు కుదించినప్పటికీ బోర్డు తమ ఫ్రాంచైజీ ఫీజు మాత్రం తగ్గించలేదని ఆయన ఆరోపించారు. |
|
No comments:
Post a Comment