Sep 20, 2011

రాస్తా బంద్

సీమాంధ్ర నుంచి రాకపోకలకు బ్రేక్
*తెలంగాణ నలుమూలలా రహదారుల దిగ్బంధం*ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలూ నిలిపివేత*రోడ్లపై గోడలు కట్టేందుకు తెలంగాణవాదుల ప్రయత్నం *పలుచోట్ల లాఠీచార్జీలు, అరెస్టులు.. ఆత్మాహుతి యత్నాలు *రోడ్లపై కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయిన వాహనాలు *ఆర్‌టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణలో రోడ్డెక్కని బస్సులు *హైదరాబాద్‌లోనూ నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ *ప్రత్యామ్నాయాల్లో సర్కారు విఫలం.. ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు *వరుసగా ఏడో రోజూ తెలంగాణలో స్తంభించిన పాలన *ఓయూలో పోలీసులతో విద్యార్థుల ఘర్షణ, ఉద్రిక్తత *‘సమ్మె’కు మద్దతుగా ఇంజనీరింగ్ సహా వృత్తి విద్యా కాలేజీల బంద్ *తెలంగాణ ప్రకటించే వరకూ పాఠశాలలు నిరవధిక బంద్: జేఏసీ *ఆర్‌టీసీ సమ్మె రెండు రోజులే.. గాబరా అవసరంలేదు: సీఎం *జీతాలు ఆపేస్తే.. సర్కారును కూల్చేస్తాం: స్వామిగౌడ్
ఆర్‌టీసీ కార్మికుల సమ్మె, రహదారుల దిగ్బంధంతో.. తెలంగాణలో సకల జనుల సమ్మె ఉగ్రరూపం దాల్చింది. సోమవారం తెలంగాణ అంతటా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచే కాదు.. పొరుగు రాష్ట్రాల నుంచీ తెలంగాణకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ నలుమూలలా ప్రధాన రహదారులను వేలాది మంది ఉద్యమకారులు రోజంతా దిగ్బంధించారు. ప్రైవేటు వాహనాలను కూడా అడ్డుకున్నారు. పలుచోట్ల రోడ్లపై గోడలు కూడా కట్టారు. కొన్నిచోట్ల పోలీసుల అరెస్టులు, లాఠీచార్జీలు, పలువురు ఆందోళనకారుల ఆత్మాహుతి యత్నాలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఆర్‌టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణ వ్యాప్తంగా బస్సులు రోడ్డెక్కలేదు. కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం, ఆర్‌టీసీ యాజమాన్యం చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. మెజారిటీ కార్మికులు విధులకు దూరంగా ఉండటమేగాక.. డ్యూటీలకు వచ్చిన కాంట్రాక్టు కార్మికులను కూడా అడ్డుకోవటంతో డిపోలకు తాళాలు పడ్డాయి. మరోవైపు తెలంగాణ అంతటా సకల జనుల సమ్మె కొనసాగుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు కూడా సోమవారం నుంచి బంద్ పాటిస్తుండటంతో.. సమ్మె మరింత ఉధృతంగా మారింది.
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: సకల జనుల సమ్మె ఏడో రోజు తెలంగాణ యావత్తూ స్తంభించిపోయింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులకు తోడుగా.. ఆర్‌టీసీ కార్మికులు కూడా సోమవారం నుంచి సమ్మెకు దిగటం, ఉద్యమకారుల రహదారుల దిగ్బంధంతో తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. తెలంగాణను ఇతర ప్రాంతాలతో కలిపే అన్ని రహదారులూ మూసుకుపోయాయి. తెలంగాణ ప్రాంతంలోని 89 డిపోల పరిధిలో 9,637 బస్సులు రోడ్డెక్కలేదు. సీమాంధ్రకు వెళ్లే, అటు నుంచి తెలంగాణకు వచ్చే బస్సులను కూడా అడ్డుకుంటామని జేఏసీ నేతలు హెచ్చరించటంతో 3,500 సర్వీసులను ఆర్‌టీసీ రద్దు చేసింది.

హైదరాబాద్ నగరం పరిధిలో 24 డిపోల్లో సుమారు 3,750 బస్సులు నిలిచిపోయాయి. నగరంలో అతికష్టం మీద భారీ పోలీసు బందోబస్తు మధ్య 41 బస్సులను నడపగలిగారు. తెలంగాణ రాజకీయ జేఏసీ, ప్రజాసంఘాలు జాతీయ రహదారుల దిగ్బంధం చేపట్టటంతో.. ముంబై - హైదరాబాద్ - విజయవాడ, నాగ్‌పూర్ - బెంగళూరు జాతీయ రహదారులతో పాటు.. ప్రధాన రాష్ట్ర రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
సమ్మె కారణంగా సోమవారం ఒక్క రోజే ఆర్‌టీసీ సుమారు రూ. 7 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పటికే టూరిస్టు బస్సులు, సెవన్ సీటర్ల ఆటోలు, కాంట్రాక్టు క్యారేజీలకు సడలింపు ఇచ్చిన రవాణాశాఖ తాజాగా స్కూలు బస్సులను కూడా ప్రజా రవాణాకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. రోజువారీ పర్మిట్‌గా రూ. 100 చెల్లించి స్టేజీ క్యారేజ్‌లుగా తిప్పుకునేందుకు అనుమతి ఇస్తోంది. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు నిలిచిపోవటంతో నగర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రైవేటు వాహనాలు, సెవెన్ సీటర్ ఆటోలు, ఆటోరిక్షాలకు రెట్టింపు చార్జీలు సమర్పించుకోవలసి వచ్చింది. మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్లన్నీ జనంతో కిటకిటలాడాయి.

అన్ని దారులూ మూసివేత...

రహదారుల దిగ్బంధం చేపట్టి తెలంగాణలోకి ప్రవేశించే అన్ని రహదారులనూ ఆందోళనకారులు మూసివేశారు. కోస్తా జిల్లాలను తెలంగాణతో అనుసంధానించే ప్రధాన రహదారులను.. నల్లగొండ జిల్లా సరిహద్దుల్లోని కోదాడ మండలం నల్లబండగూడెం, దామరచర్ల మండలం వాడపల్లి, పెద్దవూర మండలం నాగార్జునసాగర్‌లలో తెలంగాణవాదులు దిగ్బంధించారు. నాగార్జునసాగర్‌లో రహదారి కొత్త వంతెన వద్ద తెలంగాణవాదులు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి గోడకట్టేందుకు ప్రయత్నం చేశారు. దీంతో కోస్తా జిల్లాల నుంచి ఒక్క వాహనమూ తెలంగాణలోకి ప్రవేశించలేదు. భూదాన్ పోచంపల్లి మండలం కొత్తగూడెం వద్ద కూడా వాహనాలను అడ్డుకున్నారు. ఇక్కడ ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేసి, వాహనాలను అనుమతించటంతో ఉద్యమకారులు తొమ్మిది ఆర్టీసీ బస్సుల అద్దాలు పగులగొట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. కుమార్ అనే యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
మరోవైపు పాలేరు వంతెన వద్ద రోడ్డు దిగ్బంధంలో మేళ్లచెరువు మండలానికి చెందిన లారీ డ్రైవర్ నర్సింహరావు పెట్రోల్‌పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేటలోని నందమూరినగర్ సమీపంలో ఖమ్మం- కృష్ణా జిల్లా సరిహద్దును దిగ్బంధించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డితో పాటు, టీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. వెంకటాపురంలోనూ ఖమ్మం- కృష్ణా సరిహద్దు రహదారిపై తెలంగాణవాదులు గోడ నిర్మిస్తుండగా పోలీసులు అడ్డుకుని, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో అలంపూర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్, టీఆర్ ఎస్‌లు వేర్వేలు వేదికలు ఏర్పాటు చేసి రహదారి దిగ్బంధంలో పాల్గొన్నాయి. కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన గద్దర్‌ను మానవపాడు పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. షాద్‌నగర్, జడ్చర్లల్లో బీజేపీ నాయకులు రహదారిని దిగ్బంధించారు. అలంపూర్ టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన దిగ్బంధ కార్యక్రమంలో భాగంగా జూపల్లి వర్గీయులు, సీపీఐ న్యూడెమోక్రసీ నేతలు రహదారిపై అడ్డుగా గోడ నిర్మాణం చేపట్టారు. డీఎస్పీ కలుగజేసుకొని నచ్చజెప్పినా వినకపోవటంతో ప్రత్యేక బలగాలను అక్కడ మోహరింపజేసి గోడ నిర్మాణం కోసం ఉంచిన రాళ్లను తొలగించారు.


ఆదిలాబాద్ జిల్లాలో 7వ నంబర్ జాతీయ రహదారిని భోరజ్ చెక్‌పోస్టు సమీపంలో దాదాపు 20 వేల మంది ఆందోళనకారులు దిగ్బంధించారు.ఢిల్లీ, నాగ్‌పూర్‌ల వైపు వెళ్లే జాతీయ రహదారి కావటంతో సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఐదు వేల వరకూ వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు వాంకిడి మండలం గణేశ్‌పూర్ చెక్‌పోస్టు వద్ద కూడా రహదారి నిర్బంధం చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణవాదులు బతుకమ్మ ఆటలు, గుస్సాడి కళాకారుల నృత్యాలతో ఆందోళన నిర్వహించారు.


నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద జాతీయ రహదారిపై ఆందోళనకారులు టెంట్ వేసి రాకపోకలు నిలిపివేశారు. జిల్లాలో 44 వ నంబర్ జాతీయ రహదారి పొడువునా రాస్తారోకో కార్యక్రమాలు జరిగాయి. మెదక్ జిల్లా జహీరాబాద్ శివారులోని పస్తాపూర్ చౌరస్తా వద్ద తొమ్మిదో నంబరు జాతీయ రహదారిని పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు దిగ్బంధించారు. ఈ సందర్భంగా తెలంగాణ కళాకారులు ఆటపాటలతో హోరెత్తించారు. సదాశివపేట, కోహిర్ చౌరస్తా, బీదర్ క్రాస్‌రోడ్డు వద్ద పికెట్లు ఏర్పాటు చేసి కర్ణాటక, మహారాష్ట్రలకు రాకపోకలు సాగించే వాహనాలను రంగారెడ్డి జిల్లా మీదుగా దారి మళ్లించారు.

రంగారెడ్డి జిల్లా పరిధిలో శంషాబాద్‌లో విమానాశ్రయ రహదారి మలుపువద్ద టీడీపీ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ ఎంపీ రమేష్‌రాథోడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం విడిచిపెట్టారు. ఇబ్రహీంపట్నంలో మహిళా ఉద్యోగులు సాగర్ రహదారిపై కోలాటమాడి నిరసన తెలిపారు. వరంగల్‌లో.. వరంగల్ - హైదరాబాద్, వరంగల్ - కరీంనగర్, వరంగల్ - ఖమ్మం, వరంగల్ - నల్లగొండ రహదారులను తెలంగాణవాదులు దిగ్బంధించారు. మడికొండలో పోలీసులు, ఉద్యమకారుల మధ్య జరిగిన తోపులాటలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ధర్మారావు చేయి విరిగింది. దీంతో జేఏసీ మంగళవారం వరంగల్ నగరబంద్‌కు పిలుపునిచ్చింది.


రహదారుల దిగ్బంధంతో లక్షలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలవడంతో పలువురు కిలోమీటర్ల కొద్ది నడిచి గమ్యస్థానాలకు వెళ్లారు. అత్యవసర చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో అనంతపురం నుంచి హైదరాబాద్ బయల్దేరిన నిండు గర్భిణి రోడ్ల దిగ్భందం వల్ల కర్నూలులో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆమె పరిస్థితి విషమమని తెలిసింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కె.వినయ్‌భాస్కర్, కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, జోగు రామన్న, సముద్రాల వేణుగోపాలచారి, గడ్డం అరవిందరెడ్డి, నల్లేల ఓదేలు, గుండా మల్లేశ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కళాకారులు దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్ తదితరులు ఆందోళనల్లో పాల్గొన్నారు.


ఏడో రోజూ స్తంభించిన సేవలు...

సమ్మెతో తెలంగాణ జిల్లాల్లో సర్కారు సేవలు ఏడో రోజూ పూర్తిగా స్తంభించాయి. విద్యాసంస్థల బంద్ పూర్తిస్థాయిలో సాగింది. తెలంగాణలో మొత్తం 9 లక్షల మంది ప్రొఫెషనల్ విద్యార్థులపై సమ్మె ప్రభావం పడింది. తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చేదాకా ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలు నిరవధికంగా మూతపడే ఉంటాయని తెలంగాణ టీచర్స్ జేఏసీ నేత ముత్యాల రవీందర్ స్పష్టం చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులూ సమ్మెకు దిగటం, ఆర్‌టీసీ సమ్మెతో ఉద్యోగులు కార్యాలయాలకు రాలేకపోవటంతో సమ్మె ప్రభావం హైదరాబాద్‌లో తీవ్రస్థాయికి చేరింది. సచివాలయంలో ఉద్యోగుల హాజరు 25 శాతానికి మించలేదని సమాచారం.

సమ్మెపై టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు...
ఏడు రోజుల సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు. సమ్మె విరమించాలని సీఎం మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రజా రవాణాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వాటి పర్యవేక్షణకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థల మధ్య సమన్వయానికి వేర్వేరు టాస్క్‌ఫోర్సులను ఏర్పాటు చేశారు.

587 మంది ముందస్తు అరెస్టు: డీజీపీ

తెలంగాణ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని డీజీపీ వి.దినేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా 587 మందిని అదుపులోకి తీసుకున్నామని, 29 కేసులు నమోదుచేశామని తెలిపారు. 202 చోట్ల రాస్తారోకోలు, 88 ధర్నాలు, 126 ర్యాలీలు, 21 చోట్ల దిష్టిబొమ్మల దహనం, 46 నిరాహార దీక్షలు జరిగాయన్నారు.

జీతాలు ఆపితే తుపానే: స్వామి గౌడ్

ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించినా, జీతాలు నిలిపేసినా తుపాను సృష్టించి ప్రభుత్వాన్ని గద్దె దించుతానని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ హెచ్చరించారు. ఉద్యోగులంతా ఏకతాటిపైకి రావాలని, జీతం అందకపోయినా సంపాదించుకున్నవి తెగనమ్ముకొనైనా ఉద్యమంలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రతి పైసా రాబట్టి ఇస్తామన్నారు.
సింగరేణిలో పాక్షికంగా బొగ్గు ఉత్పత్తి
సింగరేణి కాలరీస్‌లో సోమవారం కూడా బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి స్తంభించగా.. ఖమ్మం జిల్లాలో పాక్షికంగా బొగ్గు ఉత్పత్తి జరిగింది. కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లో 15,710 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. అయినప్పటికీ బొగ్గు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. సింగరేణి అధికారులు ఉత్పత్తి చేసిన బొగ్గును రాత్రి వేళల్లో రైలు మార్గం ద్వారా బొగ్గు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments: