Sep 20, 2011

100 సీసీ బైక్... రయ్!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద బైకుల జోరు కాస్త తగ్గింది. 150 సీసీ, 200 సీసీ బైకుల కొనుగోలుకు వినియోగదారులు వెనుకాడుతున్నారు. పలుమార్లు పెరిగిన పెట్రోలు, వడ్డీరేట్లే ఇందుకు కారణం. ఫైనాన్స్‌లో వాహనాలు కొనేవారిపై అధిక భారం పడుతోంది. దీంతో ఎక్కువ మైలేజీనిచ్చే చిన్న బైకులే మేలంటున్నారు కస్టమర్లు. అందుకే 100 సీసీ బైకుల కొనుగోలుకే జై అంటున్నారు. కార్ల అమ్మకాలపై పడిన ప్రభావం ఇటు మళ్లకుండా కంపెనీలు, డీలర్లు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. సబ్‌వెన్షన్ విధానంలో తక్కువ వడ్డీరేట్లను ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకొంటున్నారు. హీరో హోండా నుంచి ఎటువంటి ఆఫర్లు లేకున్నా.. బజాజ్ ఆటో 9.99 శాతం ఫైనాన్స్ అందిస్తుండగా, టీవీఎస్ 8 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. మార్కెట్లో ఫైనాన్స్ రేట్లు 13-14 శాతంగా ఉన్నాయి. ఢిల్లీలో హోండా ఎంపిక చేసిన మోడల్‌పై రూ.3,500 వరకు తగ్గింపునిస్తోంది. ఈ ట్రెండ్ ఇంకా మనవరకు రాకున్నా.. వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం.

100 సీసీనే ఎందుకు?

ఎందుకంటే మైలేజీ కోసమే. 100 సీసీ బైకులు కంపెనీని బట్టి లీటర్ పెట్రోలుకు 60-70 కి.మీ. మైలేజీనిస్తాయి. కొన్ని కంపెనీలు లీటర్‌కు 100 కి.మీ. అని కూడా ప్రచారం చేయడం తెలిసిందే. 150 సీసీ బైకులు లీటర్‌కు 40 కి.మీ- 45 కి.మీ మైలేజీనిస్తే.. 200 సీసీ బైకులు 40 కి.మీ. లోపు మాత్రమే. 125 సీసీ కొంత నయం. ఇది 50 కి.మీ. వరకు మైలేజీనిస్తుంది. 200 సీసీ కంటే అధిక సామర్థ్యం గల బండ్లు మరింత అధికంగా పెట్రోలును తాగేస్తాయి. సగటు వినియోగదారుడు నగరంలో అయితే రోజుకు 50 కి.మీ. తిరుగుతాడు. పల్లెల్లో 30-40 కి.మీ. వరకు తిరిగే అవకాశాలున్నాయి.

మెయింటెనెన్స్ పరంగా చూస్తే 100 సీసీ బైకు వాడితే నెలకు సుమారు రూ.1,900 నుంచి రూ.2,200 వరకు ఖర్చవుతుంది. 150 సీసీ బైకైతే రూ.2,800 నుంచి రూ.3,200 వరకు ఖర్చుపెట్టాలి. 200 సీసీ బైకుకు ఎంత లేదన్నా.. రూ.4,000 వరకు పర్సు ఖాళేయే. ఇక వీటికి ఇతర మెయింటెనెన్స్ ఖర్చులూ, స్పేర్ పార్ట్స్ వ్యయమూ ఎక్కువే. 100 సీసీతో పోల్చితే 150 సీసీ బైకుల ధరలు కూడా 30-40% అధికం.

60 శాతం వాటా 100 సీసీదే...

దేశంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో విక్రయమైన మొత్తం ద్విచక్ర వాహనాలు 31,87,682 కాగా, ఇందులో 60% వాటా 100 సీసీ బైకులదే. హీరో మోటోకార్ప్ మూడు నెలల కాలంలో 15,29,557 బైకులు, స్కూటర్లను విక్రయించగా.. ఇందులో 100 సీసీ వాటా 73%. బజాజ్ ఆటో అమ్మకాల్లోనూ 100 సీసీదే ప్రధాన వాటా అయినప్పటికీ ఇటీవల అందులో కాస్త తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా సగటున నెలకు 10 లక్షల టూవీలర్స్ అమ్ముడుపోతాయి. సుమారు 8-10%వాటాతో ఆంధ్రప్రదేశ్‌లో నెలకు 80,000 నుంచి లక్ష వరకు టూవీలర్లు విక్రయమవుతున్నాయి. హీరో హోండాలో స్ప్లెండర్ ప్లస్, ప్యాషన్ ప్లస్, ప్యాషన్ ప్రో బైకులు, బజాజ్‌లో డిస్కవర్, ప్లాటినా, టీవీఎస్‌లో స్టార్ సిటీ, స్పోర్ట్స్ వంటి బైకులు 100 సీసీ సెగ్మెంట్‌లో అత్యధిక అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమ తాజా గణాంకాల ప్రకారం ఆగస్టులో మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు 16.1% వృద్ధితో 11,11,340 యూనిట్లకు పెరిగాయి. ఇందులో మోటార్‌సైకిళ్లు 8,39,772 యూనిట్లు.

హైఎండ్ బైకులపై అధిక ప్రభావం...

ఇటీవలి పరిణామాలు హైఎండ్ బైకుల అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. వినియోగదారులు మైలేజీ ఎక్కువనిచ్చే 100 సీసీ బైకుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో ఇది మరింత ఎక్కువగా ఉంది. స్కూటర్ల అమ్మకాలు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. టీవీఎస్‌లో స్టార్ సిటీ, టీవీఎస్ స్పోర్ట్ బైకులకు డిమాండ్ పెరిగింది. వీటికి ముందస్తు బుకింగ్‌లు పెరిగాయి. 100 సీసీ బైకుల్లో 50-60 శాతం వృద్ధి కనిపిస్తోంది.
- అరుణ్, ఏరియా మేనేజర్-టీవీఎస్ మోటార్

ఏపీలో మైలేజీకి ప్రాధాన్యం...

వడ్డీరేట్ల పెరుగుదల, పెట్రోలు ధరల పెంపు ప్రభావం ద్విచక్ర వాహనాల అమ్మకాలపై పెద్దగా పడలేదు. బజాజ్ ఆటోకు ఈ పరిణామాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మా డిస్కవర్ బైకుల అమ్మకాలు బాగున్నాయి. అయితే, ఈ రాష్ర్టంలో మైలేజీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. పండగల సీజన్‌తో పాటు వినియోగదారుల డిమాండ్‌ను బట్టి ఆఫర్ల విషయంలో తగిన నిర్ణయాలు తీసుకొంటాం.
- అమిత్ తివారీ, జోనల్ మేనేజర్-బజాజ్ ఆటో

No comments: