Sep 20, 2011

'సాయం'లేని సాగు

  • సారంపల్లి మల్లారెడ్డి
  • ఎఐకెఎస్‌ ఉపాధ్యక్షులు
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రతిపాదించిన 2011-12 వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత తగ్గింది. ఈ రంగానికి సంబంధించిన పలు అంశాలకు నిధుల కేటాయింపే లేదు. నాలుగేళ్ల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞానికీ ఇదే గతి పట్టింది. చేసిన కేటాయింపులు సైతం ఖర్చు చేసే పరిస్థితి కనబడటంలేదు. దీంతో ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో అర్ధం కాని పరిస్థితి. 2010-11 బడ్జెట్‌లో 14,970 కోట్లు భారీ, మధ్యతరహా నీటిపారుదలకు కేటాయించి, సవరించిన బడ్జెట్‌లో దానిని 10,972 కోట్లకు తగ్గించారు. దాదాపుగా 4వేల కోట్ల రూపాయలు తగ్గాయి. అట్టహాసంగా బడ్జెట్‌ కేటాయింపులు ప్రకటించి మూడింట ఒక వంతు తగ్గించడం వల్ల అనేక ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి ప్రసంగంలో 43 భారీ,మధ్య తరహా ప్రాజెక్టుల కింద29.75లక్షల హెక్టార్లకు సాగునీటి సామర్ధ్యం కల్పిస్తామని చెప్పారు. రెండు రోజుల క్రితమే గవర్నర్‌ ప్రసంగంలో 12 ప్రాజెక్టులు పూర్తిగానూ, 21 ప్రాజెక్టులు పాక్షికంగాను పూర్తయినట్టు 23 లక్షల ఎకరాలకు సాగునీటి వనరులు కల్పించినట్లు చెప్పారు. గవర్నర్‌ ప్రసంగంలో చెప్పినదానికి, రాష్ట్ర బడ్జెట్‌లో పేర్కొన్నదానికి మధ్య ఇంత తేడా ఎందుకున్నట్లు? తిరిగి 2011-12 బడ్జెట్‌లో భారీ, మధ్య తరహా నీటిపారుదల రంగానికి 14,970 కోట్లు ప్రతిపాదించారు.
గత బడ్జెట్‌లో జరిగిన ప్రహసనమే ఈ సారి పునరావృతం కాదన్న గ్యారంటీ ఉందా? 2010-11 లో ఇరిగేషన్‌ బడ్జెట్‌లో ఎఐబిపి కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి 4వేల కోట్లు రానున్నట్లు మొదట చూపారు. తరువాత సవరించిన బడ్జెట్‌లో దానిని 2వేల కోట్లకు కుదించారు. కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనడానికి ఇదొక నిదర్శనం. ఇప్పుడీ బడ్జెట్‌లో ఎఐబిపి నిధులను రు.2వేల కోట్లుగా రాష్ట్ర ఆర్థిక మంత్రి చూపారు. విదేశీ నిధుల నుండి 867.36 కోట్లు కేటాయించనున్నట్లు చూపారు. ఈ లెక్కన బడ్జెట్‌ కేటాయింపులు జరిగితే మరో దశాబ్దం గడచినా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాదు. అత్యంత వెనుకబడిన మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ ప్రాజెక్టుల పనులు ఇప్పటికే నిలిచిపోయాయి. ప్రభుత్వం సాగునీటి వనరులు కల్పించామని చెప్పిన విస్తీర్ణం కూడా పూర్తిగా అవాస్తవం. ప్రతిష్టకోసం నీరు వదిలే కార్యక్రమాలు చేపట్టి, సాగునీటి వనరులు కల్పించినట్లు చెప్పడం
పూర్తిగా ప్రజలను మభ్య పెట్టడమే!
వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించామని బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. 2010-11లో 1905 కోట్ల రూపాయలు కేటాయించగా, 2011-12 సంవత్సరానికి 2,623 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో 396 కోట్లు కేంద్రం నుండి వస్తున్న నిధులు ఉన్నాయి. పంటల భీమా పథకానికి ప్రకృతి వైపరీత్యాల పరిహారానిక,ి మార్కెట్‌ జోక్యం పథకానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. పైగా, విద్యుత్‌ సబ్సిడీ 200 కోట్ల రూపాయలు తగ్గించారు. ఈ భారం తిరిగి ప్రజలపై భారం వేయడమే. ప్రస్తుత ఏడాదితో పోలిస్తే 2011-12 సంవత్సరపు బడ్జెట్‌ 15వేల కోట్లు పెరిగినా ప్రాధమిక రంగమైన వ్యవసాయానికి మాత్రం కేటాయింపులు చూపలేదు. విత్తన పరిశోధన కేంద్రాలకు ఆర్థికసాయం, భూ సార పరీక్షలు, ఎరువులు, విత్తనాల సబ్సిడీకి నిధులు కేటాయించలేదు. 2008-09లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 204 లక్షల టన్నులు కాగా, 2009-10లో 156 లక్షల టన్నులకు తగ్గింది. 2010-11లో ఇది 190 లక్షల టన్నులకు చేరుకుంటుందని అంచనాలు వేస్తూ, వ్యవసాయం గతం కన్నా 8శాతం పెరగినట్లు ప్రకటించారు. 2008-09 దిగుబడులను బట్టి చూస్తే ఇది పెరుగుదలేనా? ఇప్పటికీ గత దిగుబడులను అధిగమించిన పరిస్థితి లేదు. మొత్తం బడ్జెట్‌ను పరిశీలించినప్పుడు వ్యవసాయ రంగాన్ని, ప్రాప్తకాలజ్ఞతకు వదిలివేసినట్లే అయింది. ఈ రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలపరం చేయడానికి అనుసరిస్తున్న విధానాల వల్లే బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ప్రాధాన్యత ఇవ్వలేదు, బడ్జెట్‌ ప్రసంగంలో కార్పొరేట్‌ సంస్థలకు విత్తన మార్కెట్‌ రంగాన్ని అప్పగించినట్లు ప్రభుత్వం అంగీకరించినట్లైంది. ప్రస్తుత సాగుభూమిలో కోటి ఎకరాలు బీడుభూమిగా మారినట్లు ఆర్థికసర్వేలో తెలిపారు. మొత్తం 3.55 కోట్ల ఎకరాల సాగుభూమిలో కోటి ఎకరాలు బీడు భూమిగా మారినట్లు ఆర్థికసర్వేలో పేర్కొన్నారు. ఈ భూములను సేద్యయోగ్యంలోకి తేవడానికి ఎలాంటి కేటాయింపులు లేవు. ఇందిర ప్రభ పథకాన్ని ఎత్తివేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తికి 23శాతాన్ని సమకూరుస్తున్న వ్యవసాయ రంగానికి ప్రణాళికా నిధుల్లో కనీసం 8శాతమైనా కేటాయించేలా చూడడానికి బడ్జెట్‌ ప్రతిపాదనలను సవరించాల్సిన అవసరముంది. ధరల నిర్ణయం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి ఎక్స్‌ గ్రేషియో కింద ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇచ్చేలా బడ్జెట్‌లో పొందుపరచాలి.. ఈ విధంగా బడ్జెట్‌లో తగు సవరణలు చేపట్టి వ్యవసాయరంగాన్ని, ఈ రంగంపై ఆధారపడిన ప్రజానీకానికి భరోసా ఇవ్వాలి.

No comments: