మొత్తం 7,654 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్నీ తన అధీనంలో ఉంచుకున్న రిల్
నిబంధనల ప్రకారం ఆరేళ్ల కిందటే 4,000 చ.కి.మీ.లను సర్కారుకు
అప్పగించాల్సి ఉన్నా విడిచిపెట్టని వైనం
రిలయన్స్ అభీష్టానికి అనుగుణంగా పనిచేసిన డీజీహెచ్, పెట్రోలియం శాఖ
మొత్తం కాంట్రాక్టు ప్రాంతాన్నీ ‘డిస్కవరీ ఏరియా’గా ప్రకటించి అప్పగించిన వైనం
ఫలితంగా ప్రభుత్వానికి అంచనాలకు అందని ఆదాయనష్టం
పెట్రోలియం శాఖ, డీజీహెచ్ల తీరును తీవ్రంగా తప్పుపట్టిన కాగ్
కేజీ బేసిన్ కాంట్రాక్టును సమీక్షించాలని సిఫారసు
రిలయన్స్ అధీనంలో ఉన్న అదనపు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలన్న కాగ్
మరిన్ని రిలయన్స్ అక్రమాలను బయటపెట్టిన కాగ్.. పార్లమెంటుకు నివేదిక సమర్పణ
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి
రాష్ట్ర తీరంలోని అపారమైన జాతి సంపదను రిలయన్స్ ఇండస్ట్రీస్ కబ్జా చేసి దోచుకుంటున్న బండారం బట్టబయలైంది. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లో వేలాది కిలోమీటర్ల విస్తీర్ణంలో గల గ్యాస్ నిక్షేపాలను ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ అక్రమంగా తన అధీనంలో ఉంచుకుని తోడుకుంటున్న వైనం వెలుగుచూసింది. గ్యాస్ నిక్షేపాల అన్వేషణ కోసం కేజీ బేసిన్లో మొత్తం 7,654 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పదకొండేళ్ల కిందట కాంట్రాక్టుకు తీసుకున్న రిలయన్స్ సంస్థ.. నిబంధనల ప్రకారం అందులో సగం ప్రాంతాన్ని అంటే దాదాపు 4,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆరేళ్ల కిందటే ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా.. అలా చేయకుండా అనేక సాకులు చెప్తూ.. అధికార వర్గాన్ని అనుకూలంగా తిప్పుకుని.. తన అధీనంలోనే ఉంచుకున్న వైనాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో బహిర్గతం చేసింది. గురువారం పార్లమెంటుకు సమర్పించిన ఈ నివేదికలో.. రిలయన్స్ అక్రమాలకు వంతపాడిన కేంద్ర పెట్రోలియం శాఖ, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)ల తీరును తీవ్రంగా తప్పుపట్టింది. రిలయన్స్ అక్రమాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వానికి అంచనాలకు కూడా అందని స్థాయిలో ఆదాయ నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం తక్షణమే రిలయన్స్తో కేజీ బేసిన్ కాంట్రాక్టును పునఃసమీక్షించాలని.. ఆ సంస్థ అధీనంలో ఉన్న అదనపు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని కాగ్ సిఫారసు చేసింది.
అసలేం జరిగింది..?
దేశంలోకెల్లా అతిపెద్ద గ్యాస్ నిక్షేపాల క్షేత్రమైన.. కృష్ణా-గోదావరి బేసిన్లో గ్యాస్ నిక్షేపాల అన్వేషణ, ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో నిర్వహించిన కాంపిటీటివ్ బిడ్డింగ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కాంట్రాక్టు పొందింది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని బంగాళాఖాతంలో మొత్తం 7,654 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని గ్యాస్ అన్వేషణ కోసం కేంద్ర ప్రభుత్వం రిలయన్స్కు అప్పగించింది. అయితే.. ఉత్పత్తి భాగస్వామ్య ఒప్పందం (పీఎస్సీ) నిబంధనల ప్రకారం రిలయన్స్ సంస్థ తన అన్వేషణ, ఉత్పత్తి చేపట్టాల్సి ఉంటుంది.
నిబంధనలు ఏమిటంటే...
గ్యాస్ నిక్షేపాలను కనుగొనేందుకు.. రిలయన్స్ మూడు దశల్లో అన్వేషణ చేపట్టాల్సి ఉంటుంది. మొదటి దశ పూర్తయ్యి, రెండో దశ అన్వేషణకు వెళ్లే ముందు.. ప్రభుత్వం తనకు అప్పగించిన మొత్తం ప్రాంతంలో 25 శాతం (నాలుగో వంతు) ప్రాంతాన్ని తిరిగి ప్రభుత్వపరం చేయాలి. ఆ ప్రాంతం.. ఇంకా గ్యాస్ కోసం అన్వేషణ చేపట్టని ప్రాంతం కానీ, అన్వేషణ చేపట్టినప్పటికీ నిక్షేపాలు లభ్యంకాని ప్రాంతం కానీ కావచ్చు. అదేవిధంగా.. రెండో దశ పూర్తయ్యి, మూడో దశ అన్వేషణకు వెళ్లే ముందు మరో 25 శాతం ప్రాంతాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. ఈ మూడు దశల అన్వేషణలోనూ రిలయన్స్ సంస్థ గ్యాస్ నిక్షేపాలను కనుగొన్న ప్రాంతం మాత్రమే.. గ్యాస్ ఉత్పత్తి కోసం ఆ సంస్థ అధీనంలో ఉంచుకోవచ్చు. ప్రభుత్వానికి అప్పగించిన మిగతా ప్రాంతంలో.. ప్రభుత్వం మళ్లీ గ్యాస్ నిక్షేపాల అన్వేషణ కోసం టెండర్లు పిలిచి, వేరే సంస్థలకు కాంట్రాక్టుకు ఇచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రభుత్వానికి మరింత ఎక్కువ ఆదాయం లభిస్తుంది. అక్కడ గ్యాస్ నిక్షేపాలు బయటపడితే.. బయటపడిన నిక్షేపాల స్థాయిని బట్టి అంచనాలకు మించిన ఆదాయానికీ అవకాశముంది.
నిబంధనల ప్రకారం ఏం జరగాలి..?
రిలయన్స్ ఇండస్ట్రీస్కు 2000 సంవత్సరంలో కేజీ బేసిన్ కాంట్రాక్టు దక్కింది. మొత్తం 7,654 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ప్రభుత్వం ఆ సంస్థకు గ్యాస్ అన్వేషణ కోసం అప్పగించింది. 2004 సంవత్సరానికల్లా మొదటి దశ అన్వేషణ పూర్తయ్యింది. రెండో దశ అన్వేషణకు వెళ్లాలంటే.. రిలయన్స్ తన ఆధీనంలో ఉన్న కాంట్రాక్టు ప్రాంతంలో నాలుగో వంతు (25 శాతం) ప్రాంతాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. అంటే.. 1,914 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అప్పగించాలి. అలాగే.. రెండో దశ అన్వేషణ 2005 సంవత్సరంలో పూర్తయింది. అప్పుడు మూడో దశ అన్వేషణకు వెళ్లాలంటే.. మరో 25 శాతం భూమి.. అంటే మరో 1,914 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. అంటే.. రెండు విడతలు కలిపి మొత్తం 3,827 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ప్రభుత్వానికి అప్పగించేయాలి. మూడు దశల అన్వేషణ పూర్తయిన తర్వాత.. రిలయన్స్ సంస్థ ఎక్కడెక్కడ గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నట్లు చెప్పిందో.. ఆ ప్రాంతాలను మాత్రమే డిస్కవరీ ఏరియా (నిక్షేపాలు కనుగొన్న ప్రాంతం)గా ప్రభుత్వం ప్రకటించి, గ్యాస్ వెలికితీత కోసం ఆ సంస్థకు అప్పగిస్తుంది.
వాస్తవానికి ఏం జరిగింది..?
కానీ.. కేజీ బేసిన్ గ్యాస్ విషయంలో ఈ నిబంధనలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. 2004లో మొదటి దశ పూర్తయ్యాక వదిలిపెట్టాల్సిన ప్రాంతాన్ని రిలయన్స్ వదిలిపెట్టలేదు. అలాగే రెండో దశ అన్వేషణ ప్రారంభించింది. ఆ తర్వాత 2005లో మూడో దశకు వెళ్లే ముందు వదిలిపెట్టాల్సిన ప్రాంతాన్నీ వదిలిపెట్టలేదు. ఇంకా అన్వేషిస్తున్నామంటూ మొత్తం తన అధీనంలోనే ఉంచుకుంది. రిలయన్స్ తీరుకు మొదట అభ్యంతరం తెలిపిన డీజీహెచ్.. ఆ తర్వాత తాను కూడా తందానా అంది. 2009 వచ్చేసరికి.. అసలు రిలయన్స్కు అన్వేషణ, ఉత్పత్తి కోసం కాంట్రాక్టుకు ఇచ్చిన మొత్తం 7,654 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్నీ.. నిక్షేపాలు కనుగొన్న ప్రాంతమే (డిస్కవరీ ఏరియా) అని ప్రకటించేసింది. తద్వారా లక్షల కోట్ల రూపాయల విలువైన అపార సహజవనరు మీద రిలయన్స్ కబ్జాకు కేంద్ర పెట్రోలియం శాఖ, డీజీహెచ్లు అధికారికంగా ఆమోద ముద్ర వేసినట్లయింది.
No comments:
Post a Comment