Sep 9, 2011

100కు 255 మార్కులు..!

  • ద్రవిడ వర్సిటీలో అయ్యోర్ల లీలలు
  • విసి ఛాంబర్‌కు తాళాలు
  • రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల ఆందోళన
వందకి వంద మార్కులు రావడం ఎంతో గగనం. నిష్ణాతులకు సైతం ఇది అసాధ్యం. నూరు మందిలో ఒకరిద్దరికి వచ్చేదీ కష్టమే. అయితే కుప్పం ద్రవిడ యూనివర్శటీలోని లెక్చరర్లు విద్యార్థులకు ఏకంగా నూటికి 255 మార్కులు వేసి సంచలనం సృష్టించారు. అదేమిటో మీరే చదవండి...
ద్రవిడ యూనివర్సిటీలో ఏం చేసినా సంచలనమే. మొన్నటికి మొన్న కళాశాలలో పూజలు నిర్వహించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. పిహెచ్‌డిల్లో విచ్చలవిడిగా దొంగ సర్టిఫికేట్లు ఇవ్వడం వంటి అంశాలతో భారతదేశంలోనే ఏ యూనివర్సిటీలో జరగని విధంగా ఈ కళాశాల ప్రసిద్ధి కెక్కింది. తాజాగా మరో సంచలనానికి ద్రవిడయూనివర్సిటీ కేంద్రమైంది. ఇక్కడ చదువుతున్న కొంత మంది విద్యార్థులకు అధికంగా మార్కులేసి మరో వివాదానికి తెరదీసింది. వందకు వంద వేయడమే ఒక సంచలనం అంటే ఈ యూనివర్సిటీలో ఏకంగా వందకు 255 మార్కులిచ్చి సంచలనం సృష్టించారు. దీన్ని చూసిన విద్యార్థులు అవాక్కయ్యారు. తీరా తేరుకుని ఆందోళనకు దిగారు. విసి ఛాంబర్‌కు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. అంతేగాకుండా రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎంఎ ఇంగ్లీషు, తెలుగు, హిస్టరీ, మ్యాథ్స్‌లో రెండు, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వందకన్నా ఎక్కువ మార్కులు వేశారు. ఇలా ఒకరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 70 మంది విద్యార్థుల మార్కుల జాబితాలో వందకు అంతకన్నా ఎక్కువ మార్కులు వేశారు. ఉదాహరణకు ఎంఎ తెలుగుమీడియానికి చెందిన వి. దామోదరం రిజిస్టర్‌ నెంబర్‌ 51210125 విద్యార్థికి ఫిలాసఫీలో 100కు 255 మార్కులు వేశారు. అలాగే మరో విద్యార్థి ఎం. శీనప్ప రిజిస్టర్‌ నెంబర్‌ 51210124 విద్యార్థికి ఫిలాసఫీలో 100కు 245 మార్కులు వేశారు. ఇలా 70 మంది విద్యార్థులకు వందకు 115, 105, 200 వంటి మార్కులు వేశారు.
విద్యార్థుల ఆందోళన

ఇది తెలుసుకున్న విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కళాశాలలోని వైస్‌ ఛాన్సలర్‌ ఛాంబర్‌కు తాళాలు వేసిి నిరసన వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తరువాత పరీక్షల కో-ఆర్డినేటర్‌ మురళీమోహన్‌ విచారించి తగిన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

No comments: