Sep 18, 2011

అవినీతిపై పోరాటమా? మతతత్వ పునరేకీకరణా?

  • పీపుల్స్‌ డెమొక్రసీ సంపాదకీయం
దేశం, దేశ ప్రజలు అవినీతిపై అద్వానీ రథయాత్రలోని ఆంతర్యాన్ని తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు. మొదటిసారి అద్వానీ రథయాత్ర చేసినపుడు అది విషాదాన్ని మిగిల్చింది. రెండవసారి ప్రహసనంగా పరిణమించింది. ఆరోసారి కూడా అది ప్రహసనంగానే మారుతుంది. అవినీతిపై పోరాటం పేరుతో మత శక్తుల పునరేకీకరణను భరించగలిగే స్థితిలో దేశం లేదు. మన లౌకిక వ్యవస్థ మరోసారి విచ్ఛిన్నం, విధ్వంసం కాకుండా చూసేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉండాలి.
మరోసారి రథయాత్ర చేయాలనే తన అంతరంగాన్ని ఎల్‌కె అద్వానీ బాహాటంగా వెల్లడించారు. అంతులేని మత మారణహోమంతో అప్రతిష్ట మూటగట్టుకున్న 1992 రథయాత్ర తరువాత ఇది ఆయన చేపట్టనున్న ఆరవ యాత్ర. పదే పదే రథయాత్రల వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరనప్పటికీ ఆయన మరో సారి రథం ఎక్కాలని నిర్ణయించుకున్నాడు.
1990 సెప్టెంబర్‌లో 'మందిర్‌ వహీ బనాయేంగే' అనే నినాదంతో ఆయన ప్రారంభించిన రథయాత్ర ఆధునిక లౌకిక ప్రజాతంత్ర భారత రిపబ్లిక్‌ చరిత్రలో మాయని మచ్చగా ప్రపంచమంతా పరిగణించిన బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసింది. ఆ రథయాత్ర అంతులేని రక్తపాతానికి, విధ్వంసానికి దారితీసింది. రెండు మాసాల్లో, అంటే డిసెంబర్‌ నెలాఖరులోగా మత ఘర్షణల్లో సుమారు వెయ్యిమంది దాకా మరణించినట్లు మీడియా తెలియజేసింది. అనేక వేల మంది తీవ్రంగా గాయపడగా, ఇంకా అనేకమంది తమ ఇళ్లను వీడి పారిపోయారు. దేశ విభజన సమయంలో కంటే అద్వానీ రథయాత్ర సమయంలోనే తాను ఎక్కువగా భయపడినట్లు 'తమస్‌' రచయిత బీష్మ సహానీ పేర్కొన్నారు. ఆయన రాసిన 'తమస్‌' దేశ విభజన సమయంలో చోటుచేసుకున్న దారుణాలు, ప్రజలు పడిన అవస్థలకు సజీవ దర్పణం లాంటిది.
1992 నాటి భారత్‌కి, 2011 భారత్‌కి చాలా తేడా ఉందని నేడు వాదిస్తున్న కొందరు ఈ వ్యాసం రాసే సమయానికి భరత్‌పూర్‌ మత అల్లర్లు తొమ్మిది మంది ప్రాణాలను బలిగొన్నాయనే విషయాన్ని గమనించాలి. దేశంలో మత సామరస్యం గణనీయంగా మెరుగుపడినట్లు పని గట్టుకుని చేసిన ప్రచారాన్ని ఖండిస్తూ ఇటీవల జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో సిపిఎం లిఖిత పూర్వకంగా సవివరమైన పత్రాన్నొకదానిని సమర్పించింది. హోంశాఖ అందించిన గణాంకాలను ఆ నోట్‌లో ఉటంకిస్తూ 2009లో చోటుచేసుకున్న 791 మతపరమైన హింసాత్మక ఘటనల్లో 119 మంది మరణించగా, మరో 2342 మంది గాయపడ్డారనే విషయాన్ని గుర్తు చేసింది. 2010లో ఇటువంటి ఘటనలు 658 చోటుచేసుకోగా, వాటిలో 111 మంది చనిపోయారు. మరో 1971 మంది గాయపడ్డారు. ఈ గణాంకాలన్నీ హోంశాఖ అందించినవే. 2005-2006 మధ్య మత హింసాకాండలో ప్రతి సంవత్సరం రమారమి 130 మంది చొప్పున మరణించగా 2,200 మంది గాయపడిన విషయాన్ని సిపిఎం ఆ నోట్‌లో వివరించింది.
మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా 1992 యాత్ర తరువాత మాదిరిగా రాజకీయ ప్రయోజనాలు దండుకోవచ్చునని అద్వానీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి కూటమి ఆశలు పెట్టుకుంటున్నాయి. అప్రతిష్టను మూటకట్టుకున్న 1992 రథయాత్ర బాబ్రీమసీదు విధ్వంసానికి దారితీయడం మాత్రమే కాదు, మన సామాజిక వ్యవస్థను తీవ్రంగా విషతుల్యం చేసింది. అయితే ఆ రథయాత్ర 1996లో బిజెపి 13 రోజులపాటు, 1998లో 13 మాసాలపాటు ప్రభుత్వాలను నెలకొల్పేందుకు ఉపయోగపడింది. 1993లో స్థాపించిన ప్రభుత్వం మాత్రమే పూర్తి కాలం అధికారంలో కొనసాగింది. అయితే ఈ మూడు సందర్భాల్లోనూ అద్వానీ ఎంతగా కృషి చేసినప్పటికీ ప్రధానమంత్రి పదవిని చేజిక్కించుకోలేకపోయారు. బిజెపి మిత్రపక్షాలు కరడుగట్టిన మతతత్వవాది అద్వానీ కన్నా ఉదారవాది ముసుగు తగిలించుకున్న వాజ్‌పేయికి ప్రాధాన్యతనిచ్చాయి.
ఈ సారి కూడా అద్వానీకి అటువంటి అనుభవమే ఎదురుకానుంది. సమిష్టి నాయకత్వం ప్రాతిపదికగా 2014 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయగలదని బిజెపి అధ్యక్షుడు ప్రకటించిన వెంటనే రథయాత్ర నిర్ణయాన్ని అద్వానీ ప్రకటించారు. దీని ద్వారా తమ పార్టీ అధ్యక్షుడి ఆదేశాన్ని అద్వానీ తోసిపుచ్చినట్లయింది. బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మితిమీరిన స్థూలకాయులకు బరువు తగ్గేందుకుగాను ఈ సర్జరీని సిఫార్సు చేస్తారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సానుభూతి ప్రకటిస్తూనే కొంతమంది 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత అనుకోని పరిస్థితుల్లో అవకాశం లభిస్తే పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండేందుకే గడ్కరీ ఈ సర్జరీ చేయించుకున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులు కూడా ఇటువంటి అవకాశం కోసం తీవ్రంగా పోటీపడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే.
ఇది ఇలాఉండగా 2002 మతపరమైన ఊచకోత కేసులో సుపీం కోర్టు నిర్ణయాన్ని తనకు క్లీన్‌ఛిట్‌ ఇచ్చినట్లు అన్వయించుకుంటూ గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇందుకు భిన్నంగా సుప్రీం కోర్టు గుల్బర్గా సొసైటీ కేసులో త్వరితగతిన విచారణ పూర్తిచేయాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించింది. అమికస్‌ క్యూరే, ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికలను ట్రయల్‌ కోర్టులకు అందజేసి వాటిని సాక్ష్యాధారాలుగా పరిగణించాలని ఆదేశించింది. అంటే ఈ వ్యవహారం మోడీపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసే స్థాయిని దాటిపోయి అభియోగాలపై విచారణ దశకు కేసు చేరుకుంది. మోడీ తనకు తోచిన అన్వయంతో దేశ ప్రజల దృఫ్టిని ఆకర్షించేందుకు అన్నా హజారే తరహాలో నిరాహారదీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో చేరాలనే ఆకాంక్షతోనే ఆయన ఈ ప్రకటన చేశారన్నది సుస్పష్టం.
ఆర్‌ఎస్‌ఎస్‌- బిజెపి మధ్య అంతర్గత కలహాలు ఆ పార్టీల ఆంతరంగిక వ్యవహారం. ఎవరు ప్రధాని కావాలి అనేది ఆ పార్టీలు తేల్చుకోవాల్సిన విషయం. 'ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం' అనే సామెత ఈ సందర్భంగా గుర్తుకు వస్తుంది. ఇప్పుడేమీ ఎన్నికలు జరగడం లేదు. బిజెపికి ప్రజల ఆదరణ పెరిగిన సూచనలు ఏమీ లేవు. ఎంతటి మూర్ఖమైన విషయం!
అద్వానీ రథయాత్ర విషయానికి వస్తే, తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నా హజారే చేసిన దీక్ష కారణంగా అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో పెల్లుబుకుతున్న భావోద్వేగాలు తమ పార్టీకి అనుకూలంగా బదిలీ కాగలవని అద్వానీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అద్వానీ, బిజెపి తమ పార్టీ వ్యవహారాలను గురించి సమీక్షించుకుంటే బాగుంటుంది. అద్వానీ రథయాత్ర గురించి ప్రకటిస్తున్న సమయంలోనే ఛత్తీస్‌గఢ్‌ లోకాయుక్త రామన్‌ సింగ్‌ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంలో ప్రతి శాఖలో అవినీతి పెచ్చరిల్లిపోయిందని అభిశంసించారు. అవినీతి అధికారులను మరింత ఎక్కువ నీటిని తాగేందుకు మరణిస్తున్న చెరువులోని చేపలుగా ఆయన పోల్చారు. కర్నాటకలో బిజెపి ప్రభుత్వం పెద్దయెత్తున అవినీతికి పాల్పడినట్లు అక్కడి లోకాయుక్త నివేదిక సమర్పించిన కొద్ది రోజులకే అంటే అద్వానీ రథయాత్ర గురించి ప్రకటిస్తున్న సమయంలోనే ఛత్తీస్‌గఢ్‌లో రామన్‌ సింగ్‌ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని, అన్ని విభాగాలు అవినీతికి అడ్డాలుగా తయారయ్యాయని అక్కడి లోకాయుక్త ఆధారాలతో సహా బయటపెట్టింది. ఉత్తరాఖండ్‌లోనూ బిజెపి ప్రభుత్వం అవినీతి ఊబిలో పీకల్లోతున్న కూరుకుపోయింది. అందుకే అక్కడి ముఖ్యమంత్రిని మార్చింది. కర్ణాటకలో చాలా ప్రతిఘటన, విముఖత తరువాత ముఖ్యమంత్రి బిఎస్‌ ఎడ్యూరప్ప పదవి నుండి నిర్బంధంగా దిగిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత భారీ ఎత్తున జరిగిన అక్రమ మైనింగ్‌ కేసులో గాలి జనార్దన రెడ్డి, మాజీ మంత్రులు అరెస్ట్‌ అయ్యారు.. ఇదీ బిజెపి అవినీతి ట్రాక్‌ రికార్డు.
అద్వానీ ప్రతిపాదిత రథయాత్ర వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కుదిపేసిన అనేక కుంభకోణాలను ప్రజలు గుర్తుకు తెస్తుంది. టెలీకాం కుంభకోణం, చక్కెర కుంభకోణం, యుటిఐ కుంభకోణం, కేతన్‌ పరేఖ్‌ స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణం, తెహల్కా బయటపెట్టిన రక్షణ ఒప్పందాల్లో కుంభకోణాలు, శవపేటికల కుంభకోణం, మెగా పెట్రో కుంభకోణం, భూ కుంభకోణం మొదలైన కుంభకోణాలతోపాటు ఆర్థిక లావాదేవీలకు మారిషస్‌ మార్గాన్ని బిజెపి ప్రభుత్వం బార్లా తెరిచింది. ఇది భారీ ఎత్తున మనీ లాండరింగ్‌కు, నల్లధనం విదేశాలకు తరలించడానికి అవకాశం కల్పించింది.
దేశం, దేశ ప్రజలు అవినీతిపై అద్వానీ రథయాత్రలోని ఆంతర్యాన్ని తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు. మొదటిసారి అద్వానీ రథయాత్ర చేసినపుడు అది విషాదాన్ని మిగిల్చింది. రెండవసారి ప్రహసనంగా పరిణమించింది. ఆరోసారి కూడా అది ప్రహసనంగానే మారుతుంది. అవినీతిపై పోరాటం పేరుతో మత శక్తుల పునరేకీకరణను భరించగలిగే స్థితిలో దేశం లేదు. మన లౌకిక వ్యవస్థ మరోసారి విచ్ఛిన్నం, విధ్వంసం కాకుండా చూసేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉండాలి.
-పీపుల్స్‌ డెమొక్రసీ

No comments: