Sep 12, 2011


వ్యక్తిగత పనుల నిమిత్తం కాంగ్రెస్‌పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి మలేషియాకు వెళ్ళనున్నారు. ఆదివారం నుండి మూడురోజుల పాటు మలేషియాలోనే ఉంటారని ఆయన సన్నిహితులు తెలిపారు. మలేషియాకు వెళుతున్న చిరంజీవిని ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, అవంతి శ్రీనివాస్‌, సిహెచ్‌ మోహనరావు, ఉమా మల్లేశ్వరరావు, గౌతం, ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు శు భాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా రథయాత్ర చేస్తానన్న బిజెపి నేత ఎల్‌కె అద్వానీ ఓబుళాపురం నుంచి యాత్ర ప్రారంభిస్తే యాత్రకు సార్థకత చేకూరుతుందన్నారు. సహజవనరులను జాతీయం చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. గాలి జనార్ధన్‌రెడ్డి అరెస్ట్‌ తర్వాత జగన్‌ ప్రతిష్ట మరింత దిగజారిందన్నారు. జగన్‌ కోసం రాజీనామా చేసిన అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి కాంగ్రెస్‌లోకి తిరిగి రావడం స్వాగతించాల్సిన అంశమని, మరికొందరు పార్టీతోనే ఉంటారని చెప్పారు. ఎమ్మార్‌ వ్యవహారంలో తన ప్రమేయం లేదని నిర్వాసితుల వద్దకు వెళ్ళి చంద్రబాబు చెప్పాలన్నారు. వస్త్రాలపై విధించిన నాలుగు శాతం వ్యాట్‌ను తొలగించేందుకు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు.

No comments: