Sep 12, 2011

విఘ్నరాజుకు వీడ్కోలు..

*జనసంద్రంతో హోరెత్తిన భాగ్యనగరి*హుస్సేన్‌సాగర్‌కు బారులు తీరిన గణనాథులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏ వాడలో చూసినా గణనాథులే.. దారి పొడవునా బొజ్జ గణపయ్యలే.. ఎటువైపు విన్నా ‘విఘ్నరాజు’ నినాదాలే..! ఆదివారం రాష్ట్ర రాజధాని భక్తి పరవశమైంది. గణేష్ మహరాజ్ కీ.. జై.. గణపతి బొప్పా మోరియా.. నినాదాలతో మార్మోగింది. పదకొండు రోజులపాటు సందడి చేసిన లంబోదరుడు నిమజ్జనానికి తరలివెళ్లాడు. రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జనోత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ జనసంద్రాన్ని తలపించింది. ట్యాంక్‌బండ్‌కు నలువైపుల నుంచి లక్షలాది మంది నిమజ్జనోత్సవ వేడుకలను తిలకించేందుకు తరలి వచ్చారు. పలుచోట్ల ముస్లిం సోదరులు కూడా వేడుకల్లో పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. ఉత్సవాల్లో లడ్డూల వేలం పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

శోభాయాత్ర సాగిందిలా..

రాజధానిలో మధ్యాహ్నం నుంచే పెద్దఎత్తున విగ్రహాలు హుస్సేన్‌సాగర్ వైపు కదిలాయి. అటు ట్యాంక్‌బండ్ పొడవునా, ఇటు నెక్లెస్ రోడ్డు వైపు వినాయక విగ్రహాలు బారులు తీరాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలైన వేడుకలు సాయంత్రం 5 గంటల వరకు ఊపందుకున్నాయి. రకరకాల ఆకృతుల్లో కొలువుదీరిన విగ్రహాలు కనువిందు చేశాయి. బాలాపూర్ గణనాథుడు సాయంత్రం ఐదింటికి చార్మినార్‌ను దాటింది. విగ్రహాలతో అంగరంగ వైభవంగా ముస్తాబైన వాహనాలు మధ్యాహ్నం మూడింటికి చార్మినార్‌కు మూడుపక్కలా శాలిబండ, సర్దార్‌మహల్, లాడ్ బజార్ల నుంచి రోడ్లెక్కాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితిని సమీక్షించారు.

ఊరేగింపుల్లో అపశ్రుతులు.. ఆరుగురి మృతి

ఆదివారం నిమజ్జన వేడుకల్లో ప్రమాదవశాత్తూ ఆరుగురు మరణించారు. లాల్‌దర్వాజా ప్రాంతంలో విగ్రహాలతో వెళ్తున్న లారీ ఎక్కడానికి ప్రయత్నించి మహేశ్ (25) అదే వాహనం కింద పడి మృతి చెందాడు. పోలీసు నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ మృతుని బంధుమిత్రులు ధర్నాకు దిగడంతో గంట పాటు ఊరేగింపు ఆగింది. మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మాందాపూర్‌లో గొల్ల మాణయ్య విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. కృష్ణా జిల్లా గండ్రాయి సమీపంలో నిమజ్జనం ట్రాక్టర్ పంట పొలాల్లోకి బోల్తా కొట్టడంతో వీరబాబు (10) అక్కడిక్కడే మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండంలోని మల్లంపేట పొలిమేరలో నిమజ్జనానికి ఏర్పాటు చేసిన ట్రాలీకి అలంకరించిన పొడవాటి పైపులు విద్యుత్ లైన్‌కు తగిలి షార్ట్‌సర్క్యూట్ జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
రూ.9 లక్షలు పలికిన వీవీఆర్ హౌసింగ్ లడ్డూ
ఈ ఏడాది అమీర్‌పేట్ వీవీఆర్ హౌసింగ్ వినాయక మండపం వద్ద జరిగిన వేలం పాటలు బాలాపూర్ లడ్డు వేలం పాటలను అధిగమించాయి. ఇక్కడ రూ. 9.1 లక్షలతో టంకసాల శ్రీనివాస్‌రావు అనే భక్తుడు లడ్డూను సొంతం చేసుకున్నాడు. బడంగ్‌పేట్ లడ్డూ రెండో స్థానంలో నిలిచింది. వేలంపాటలో పెద్దబావి పార్వతమ్మ అనే భక్తురాలు రూ. 6.2 లక్షలు వెచ్చించి లడ్డూను గెల్చుకున్నారు. ఈసారి బాలాపూర్ లడ్డూ మూడో స్థానానికి పరిమితమైంది. ఇప్పటివరకు 7సార్లు లడ్డూను సొంతం చేసుకున్న కొలను మోహన్‌రెడ్డి, కొలను రామకృష్ణారెడ్డి మరోసారి రూ. 5.45 లక్షలకు వేలం పాడి గెలుచుకున్నారు. కొన్నిచోట్ల నిర్వహించిన వేలం పాటల్లో ముస్లిం సోదరులు కూడా పాల్గొని లడ్డూలను సొంతం చేసుకోవడం విశేషం.

No comments: