
- తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆజాద్ స్పష్టీకరణ
- జాతీయ స్థాయిలోనూ చర్చలు అవసరమని వ్యాఖ్య
- త్వరలో అధినేత్రికి నివేదికిస్తానని వెల్లడి
- సమ్మె విరమణకు ప్రకటనైనా చేయాలని నేతల వినతి
- నిర్ణయం వచ్చే దాకా ఢిల్లీని వీడం : కెకె
సకల జనుల సమ్మె నేపథ్యంలో తెలంగాణా విషయంలో కాంగ్రెస్
అధిష్టానం వైఖరిలో మార్పు వస్తుందని ఆశించిన ఆ పార్టీ నేతలకు తీవ్ర నిరాశే
ఎదురైంది. బుధవారం పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి గులాంనబీ ఆజాద్తో జరిగిన
సమావేశం నేతలను నిరుత్సాహానికి గురి చేసింది. తెలంగాణా విషయంలో
ఇప్పటికిప్పడు ఎటువంటి నిర్ణయమూ సాధ్యం కాదని ఈ భేటీలో ఆజాద్ తేల్చి
చెప్పారు. జాతీయ స్థాయిలోనూ విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాతే, ఒక
నిర్ణయానికి రాగలమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సమావేశం అనంతరం ఆజాద్
మీడియాకూ చెప్పడం గమనార్హం. 'రెండు నెలల క్రితం పార్టీ తెలంగాణా ప్రజా
ప్రతినిధులం దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గతంగా మూడు
ప్రాంతాల నేతలతోనూ చర్చలు జరుపుతామని రాష్ట్ర ఇన్ఛార్జిగా నాడు నేను
చెప్పాను. ఈమేరకు అన్ని ప్రాంతాల నేతలతోనూ దాదాపుగా 12 సమావేశాలు
నిర్వహించాను. సెప్టెంబర్ 30 లోపు చర్చలు పూర్తి చేస్తాననీ చెప్పాను.
రెండ్రోజుల ముందుగానే నేటితో (సెప్టెంబర్ 28) చర్చలు పూర్తి చేశాను. చర్చల
సారాంశాన్ని నేను త్వరలో సోనియాగాంధీ, మన్మోహన్కు నివేదిస్తాను. ఆ తర్వాత
జాతీయ స్థాయిలోనూ విస్తృత చర్చలు జరగాల్సిన అవసరం ఉంది ' అని ఆయన
పేర్కొన్నారు. తెలంగాణాలో ప్రస్తుతం విద్య, ప్రజా రవాణా తదితర రంగాలకు
తీవ్ర ఆటంకం ఏర్పడిన విషయం తమ దృష్టిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో త్వరగా
నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తామని, ఈ విషయంలో తాను ఎటువంటి
డెడ్లైన్లూ చెప్పలేనని ఒక ప్రశ్నకు సమా ధానంగా ఆయన తెలిపారు. డిసెంబరులోపు
నిర్ణయం వెల్లడిస్తారా అని ప్రశ్నించగా...' నేను సమయం చెప్పలేను. నేను
అధిష్టానానికి నివేదిక ఇచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో చర్చలు జరగాలి. ఆ
తర్వాత సాధ్య మైనంత త్వరగా నిర్ణయం వెల్లడిస్తాం. రాష్ట్రంలో నెలకొన్న
పరిస్థితుల నేపథ్యంలో, త్వరగా ఏదో ఒకటి తేల్చాలన్న అభిప్రాయం మాకూ ఉంది..'
అని ఆజాద్ సమాధానమిచ్చారు. సకల జనుల సమ్మె ప్రారంభమైన అనంతరం ఆయన మీడియాతో
మాట్లాడటమూ ఇదే ప్రథమం.
సమ్మె విరమింప చేయండి
అంతకుముందు
తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఆజాద్తో సుమారుగా రెండున్నర గంటల పాటు
సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తెలంగాణాలో తాజా పరిస్థితులను ఏకరువు పెట్టారు.
సకల జనుల సమ్మె అత్యంత తీవ్రంగా, అనూహ్యంగా సాగుతోందని వివరణ ఇచ్చారు.
వివిధ జిల్లాల్లో సమ్మె పరిస్థితి, ప్రజలు భాగస్వాములవుతున్న తీరును
వివరించారు. ముఖ్యంగా జానారెడ్డి, కేశవరావు, వివేక్ తదితర నేతలు
తెలంగాణాలో కాంగ్రెస్ పునాదులు కదిలిపోయే పరిస్థితి ఏర్పడిందని సమావేశంలో
పేర్కొన్నారు. ఆందోళన కొంత కాలం ఇదేలా సాగితే, పరిస్థితి పూర్తిగా చేయి
దాటి పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు
ఇలా సమైక్యంగా ఆందోళన బాట పట్టడం గతంలో ఎన్నడూ జరగలేదని తెలిపారు. '
తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం తక్షణం సాధ్యం కాకపోతే...కనీసం సమ్మె
విరమణ కోసం ఏదైనా సానుకూల ప్రక టన చేయండి. తెలంగాణా ఏర్పాటుకు కాంగ్రెస్
సిద్ధంగా ఉందని బహిరం గంగా చెప్పండి. సమ్మె విరమించాలని మీరు బహిరంగంగా
విజ్ఞప్తి చేయండి. తద్వారా ప్రస్తుత పరిస్థితి నుండి మమ్మల్ని
గట్టెక్కించండి...' అని ఈ సందర్భంగా కొందరు సీనియర్ నేతలు ప్రత్యేకంగా
విజ్ఞప్తి చేసి నట్లు సమాచారం. ' మీకు హామీ ఇచ్చినట్లుగా నేను రెండు మూడు
రోజు ల్లోనే అధిష్టానానికి నివేదిక ఇస్తాను. తక్షణ నిర్ణయం మాత్రం నా
చేతుల్లో లేదు. దీనిపై పార్టీ పెద్దలే నిర్ణయం తీసుకోవాలి. విస్తృత
సంప్రదింపులు జరపకుండానే డిసెంబర్ 9 ప్రకటన చేశాం. ఈసారి ఆ తప్పిదం
చేయబోం. జాతీయ స్థాయిలోనూ సంప్రదింపులు జరిపిన తర్వాతే, ఒక నిర్ణయానికి
రాగలం...' అని ఈ సందర్భంగా ఆజాద్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ
సమావేశంలో కెకె, జానారెడ్డి, హనుమంతరావు, గీతారెడ్డి, మంద జగన్నాథం,
మధుయాష్కీ, గీతారెడ్డి, శ్రీధర్బాబు, దామోదరరెడ్డి, యాదవరెడ్డి, డికె
ఆరుణ, ఆమోస్ తదితర 35 మంది తెలంగాణా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఢిల్లీని వీడం : కెకె
గడువులు
పెట్టకుండా, తక్షణం తెలంగాణాపై నిర్ణయం తీసుకోవాలని ఆజాద్కు తాము
విజ్ఞప్తి చేసినట్లు భేటీ అనంతరం కేశవరావు మీడియాకు చెప్పారు. ' రెండు గంటల
పాటు తెలంగాణాలో పరిస్థితిని వివరించాం. రెండ్రోజుల్లో అధిష్టానానికి
నివేదిక ఇస్తామని ఆజాద్ చెప్పారు. రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవల్సిన
పరిస్థితి ఉందని చెప్పాం. పార్టీ అధిష్టానం తెలంగాణాపై ఏదో ఒక నిర్ణయం
వెల్లడించే వరకూ ఎమ్మెల్యేలు, ఎంపీలం ఢిల్లీని విడిచి వెళ్లం. ఇదే
విషయాన్ని ఆజాద్కూ స్పష్టంగా చెప్పాం ' అని కెకె పేర్కొన్నారు. ఆజాద్
చర్చలు ఒక డ్రామా అంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా...కెకె
సమాధానం దాటవేశారు.
No comments:
Post a Comment