
- ఉపాధ్యాయ ధూంధాంలో ఘర్షణ
- అమాత్యుని అనుచరుల ప్రతిదాడి
- ఆందోళనకారులపై లాఠీఛార్జీ
మౌలిక సదుపాయాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి
చుక్కెదురైంది. విద్యుత్ కోతకు నిరసనగా విద్యుత్ సౌథ ఎదుట ధర్నా చేసి
అరెస్టయిన మంత్రికి సొంత జిల్లాలో మాత్రం తెలంగాణవాదుల నుంచి చేదు అనుభవం
ఎదురైంది. మంత్రి పదవికి రాజీనామా చేసి లక్ష మందితో దీక్ష చేస్తానని
చెప్పుకునేందుకు జిల్లాకు వచ్చిన మంత్రిపై చెప్పులూ, నీళ్ల సీసాలూ విసిరిన
ఘటన చర్చనీయాంశమైంది. నిరసనలతో సంఘటనా ప్రాంతం గందరగోళంగా మారింది.
అధికార
పార్టీకి చెందిన ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్
రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం నల్గొండ జిల్లా
కేంద్రంలో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం గడియారం
సెంటర్లో తెలంగాణ ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన ధూంధాంకు మద్దతు
తెలిపేందుకు వచ్చారు. ఆయన ఉపాధ్యా యులనుద్దేశించి మాట్లాడుతుండగా పలు వురు
ఉపాధ్యాయులతో పాటు టిఆర్ఎస్, ఇతర విద్యార్థి సంఘాల కార్యకర్తలు
అడ్డుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని
డిమాండ్ చేశారు. మంత్రికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు, ఆందోళనకారులు నినాదాలు
చేశారు. రాజీనామా చేయకుండా ఉద్యమం పేరుతో లబ్ధి పొందాలని చూస్తున్న మంత్రి
సభ నుంచి వెళ్లిపోవాలంటూ వేదిక వైపు దూసుకెళ్లారు. ఇద్దరు ఎంపీలు,
పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు పూల రవీందర్, ఇతర నాయకులు ఆందోళనకారులకు
సర్దిచెప్పేందుకు యత్నించారు. మంత్రి దిగిపోవాలంటూ ఆందోళనకారులు నినా దాలు
చేశారు. అయినా మంత్రి మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో ముందు భాగంలో ఉన్న
కొందరు వేదిక పైకి చెప్పులు విసిరారు. మంత్రి, ఎంపీలు వేదిక దిగి
వెళ్లిపోయారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కాంగ్రెస్
కార్యకర్తలు, నాయకులు ఆందోళనకారులపై విరుచుకు పడ్డారు. మంత్రికి
వ్యతిరేకంగా మాట్లాడ తారా..? అంటూ కుర్చీలు విసిరేశారు. దీంతో
తెలంగాణవాదులు, మంత్రి అను చరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం
కుర్చీలు విసిరేసుకుంటూ ఘర్షణకు దిగారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు ఇరు
గ్రూపుల వారిపైనా లాఠీఛార్జి చేశారు. ఆందోళనకారులు మంత్రి కారుపై రాళ్లు,
కుర్చీలు విసిరేశారు. దీంతో మంత్రి వెంట ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు
ఉపాధ్యాయులపై దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఈ
ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి చేజారి పోవడంతో మంత్రి,
ఎంపీలను పోలీసులు అక్కడి నుంచి పంపేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియా
ప్రతినిధులతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల కార్యక్రమంలో జరిగిన ఘర్షణకు క్షమాపణ
చెబుతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 1న మంత్రి పదవికి రాజీనామా చేసి 2న
ఎన్జి కళాశాల మైదానంలో తెలంగాణవాదులతో నిరవధిక దీక్ష చేయనున్నట్లు
ప్రకటించారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి కూడా
రాజీనామా చేస్తానని తెలిపారు.
మంత్రి అనుచరులపై ఎస్పీకి ఫిర్యాదు
తెలంగాణా
టీచర్స్ జెఎసి కార్యక్రమంలో దాడి చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జెఎసి ఆధ్వర్యంలో
ఎస్పీ శివశంకర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం గడియారం సెంటర్లో
ఉపాధ్యాయులు, తెలంగాణ వాదులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు
నాయకులు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి తన పదవికి రాజీనామా చేయకుండా
ఆందోళన చేస్తున్న వారిపై దాడులు చేయించడాన్ని ఖండించారు. ఉపాధ్యాయులపై దాడి
చేసిన మాజీ కౌన్సిలర్ బుర్రి శ్రీనివాసరెడ్డితో పాటు మరికొందరిపై కేసు
నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. మంత్రి పదవి కోసం
పాకులాడుతూనే దీక్షలు చేస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి
లేదన్నారు. ముందుగా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment