
ఛాందసం రాజ్యమేలుతున్న రోజుల్లోనే 'మాలపిల్ల' వంటి
చిత్రాన్ని తీసిన అభ్యుదయ చలనచిత్రసారధి గూడవల్లి రామబ్రహ్మం. ఆయన
జీవితాన్ని పుస్తకరూపంలో తీసుకువచ్చారు రచయిత జగన్మోహన్. ఈ
పుస్తకావిష్కరణ కార్యక్రమం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఆయనతో
అనుబంధమున్న అక్కినేని నాగేశ్వరరావు పుస్తకాన్ని ఆవిష్కరించి విశిష్ట అతిథి
ప్రవాసాంధ్రుడు అనుమోలు సుబ్బారావుకు అందజేశారు.
ఈ
సందర్భంగా అక్కినేని తన అనుభూతుల్ని పంచుకున్నారు. సన్నగా కుర్రాడిగా
ఉన్నప్పుడే ఆయనదగ్గరకు వెళ్ళాను. మొదట్లో అవకాశం ఇయ్యలేదు. ఆ తర్వాత ఆయన
తీసిన 'మాయలోకం'లో అవకాశం వచ్చింది. నాకు సినీ జీవితాన్నిచ్చింది
బాలరామయ్యగారయితే, అన్నంపెట్టి తనకు పెండ్లికూడా చేయాలనుకున్న వ్యక్తి
రామబ్రహ్మం. మరోజన్మక్కూడా మర్చిపోలేనంత సాయం చేశారువారు. ఎన్నో అభ్యుదయ
చిత్రాలు ఆనాడు తీశారు. ఆయనకు సమాజంపట్ల ఎంత బాధ్యత ఉందో చిత్రాలే
చెబుతాయి. ఆయన జర్నలిస్టు కూడా. ఆ తరాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాంటి
వారిని సినిమా పరిశ్రమ తలచుకోవాల్సిన అవసరముంది. ఆయనకు తగిన స్థానాన్ని
సినిమా పరిశ్రమలో ఇవ్వాల్సిన అవసరముంది. నిర్మాతలమండలి నాకు స్థలం చూపిస్తే
వారి శిలావిగ్రహాన్ని చేయించి ఇస్తాను' అన్నారు.
పరుచూరి
గోపాలకృష్ణ మాట్లాడుతూ, రామబ్రహ్మంగారి చనిపోయిన పదినెలలకు పుట్టినవాడిని.
ఆయన్ను చూసే అవకాశం లేదు. ఒక వ్యక్తి దూరమై అరవై ఎనిమిది సంవత్సరాలైనా ఆయన
గురించి పుస్తకాన్ని వేయడం గొప్ప విషయం. ఆయన సాగుచేసి వెళ్ళిపోతే వాటి
ఫలాలను మనం తింటున్నాం. మనం చిత్రాల్లో చెప్పుకునే విషయాలు ఆయన ఎప్పుడో
చెప్పాడు. మాలపిల్ల సినిమా చూసి కొన్నివేలమంది దళితులు ఆయన్ను
సన్మానించారు. అటువంటి వ్యక్తిబాటలో అందరూ పయనించాలని' అన్నారు.
రావికొండలరావు
మాట్లాడుతూ, అప్పట్లో సాంఘిక చిత్రాలు తీస్తే ఆడేవికావు. అందరూ పురాణకథలే
తీసేవారు. కానీ రామబ్రహ్మంగారు 'మాలపిల్ల' తీసి సంచలన సృష్టించారు. తన
చుట్టూ బ్రాహ్మణులే స్నేహితులైనా వారిపైనే చిత్రాన్ని తీసిన ఘనుడాయన' అంటూ
వివరించారు.
రమేష్ప్రసాద్ మాట్లాడుతూ, మా నాన్న
ఎల్.వి.ప్రసాద్గారి కెరియర్కు 'పల్నాటియుద్ధం' తోడ్పడింది.
రామబ్రహ్మంగారు తీసిన 'సంసారం'లో ఎన్.టి.ఆర్. కొడుకుగా నటించాను. మళ్ళీ
నటించలేదు. ఆయన చిత్రాలు గొప్ప సందేశాత్మకచిత్రాలని' తెలిపారు.
No comments:
Post a Comment