Sep 28, 2011

పెట్టుబడిదారీ విధాన దుష్ఫలితమే !

  పెట్టుబడిదారీ విధానం దుష్ఫలితమే నేటి అమెరికా సంక్షోభం అని చెప్పక తప్పదు. వలసవాదులు వదలిన చెప్పుల్లో అమెరికా కాళ్లుదూర్చింది. అరేబియా ప్రాంత దేశాల్లో లభ్యమవుతున్న చమురు నిల్వలను తన గుప్పెటలో పెట్టుకోవాలన్న సామ్రాజ్యవాద కాంక్షలో భాగమే నిన్నటి ఇరాక్‌, నేటి ఆప్ఘనిస్తాన్‌,లిబియా, రేపటి యెమెన్‌, ఇరాన్‌, సిరియా యుద్ధాలు. అమెరికా తమ దేశ సంపదలో ఎక్కువ భాగం ఖర్చు చేయాల్సి వస్తోంది. దీని ఫలితం దేశంలో సంక్షోభం, ముస్లిం దేశాలతో కయ్యం. 2008లో అమెరికాలో ఏర్పడిన ఆర్థికమాంద్యం ఫలితం సబ్‌ప్రైమ్‌ ఏర్పడటం. దీనికి ఒబామా ప్రభుత్వం ధనాడ్య వర్గాలపై పన్నులు పెంచేందుకు నిరాకరించి, దివాళాతీసిన బ్యాంకులను రక్షించేందుకు ఉద్దీపన పథకాల పేరిట అనేక లక్షల కోట్ల డాలర్లు ప్రభుత్వ ధనాన్ని బ్యాంకులకు అందజేసిందే తప్ప ఆర్థిక సంక్షోభ ఫలితంగా ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఒక చర్యా తీసుకోలేదు. దీనిఫలితంగా ఐదు కోట్ల మంది అమెరికన్లు సరిపడినంత ఆహారం కొనుగోలు చేయలేని పేదరికంలో కూరుకుపోయారు. నిరుద్యోగం రెండంకెల స్థాయికి చేరింది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ప్రభుత్వం అప్పు చేయాలి. పెరిగిన రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఇతర ఖర్చులు తగ్గించుకోవాలి. పన్నులు పెంచి ఆదాయం పెంచుకోవడానికి బదులు సామాజిక వ్యయం తగ్గించి ప్రజలపై భారాన్ని పెంచే విధానాలను అమలు చేస్తోంది. 'రుణ పరిమితి పెంపు బిల్లు' ఆమోదింపజేసుకోవడానికి పాలకపార్టీయైన డెమోక్రటిక్‌పార్టీ, ప్రతిపక్ష పార్టీ అయిన రిపబ్లికన్‌ పార్టీల చేతులు కలిపాయి. రుణ పరిమితి పెంపు బిల్లును ఆమోదించడమంటే అమెరికా ప్రజల జీవన ప్రమాణాలు, సామాజిక హక్కులపై తీవ్ర దాడి చేయడమే. 

No comments: