Sep 19, 2011

గవర్నర్‌ హోదాలో రాజకీయాలు మాట్లాడలేం : రోశయ్య

గవర్నర్‌ హోదాలో రాజకీయాలు మాట్లాడటం సరైంది కాదని తమిళనాడు గవర్నరు కె రోశయ్య అభిప్రాయపడ్డారు. ఆదివారం టిఎస్‌ఆర్‌ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో రోశయ్యకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాజకీయాల గురించి మాట్లాడకూడదని సన్నిహితులు చెప్పారన్నారు. రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాల్సివుంటుందన్నారు. 60ఏళ్ల తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎన్నో అవకాశాలు వచ్చాయని, వాటన్నింటిలో కూడా ప్రజలకు ఉపయోగపడే పని చేశానన్నారు. తమిళనాడు గవర్నరుగా తనకొచ్చిన అవకాశాన్ని ఆ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వినియోగించుకుంటునన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎదో రకంగా ఉపయోగపడేందుకు కృషి చేస్తానన్నారు. ఆయనకు ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి నారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యులు కె రామచంద్రారావు, నగర మేయర్‌ బండా కార్తికరెడ్డి సన్మానం చేశారు. ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ తిరుమలగిరి సురేందర్‌, సీనియర్‌ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, వరదాచారి, సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ కెవి రమణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments: