Sep 7, 2011

'సూరి' హత్యపై వీడని మిస్టరీ


AA

మద్దెల చెర్వు సూరీ హత్యసులో సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. అసలు నిందతుడు భాను కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తునే ఉన్నాయి. అతడు తెరపైకి వస్తేకానీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. జైళ్లో ఉన్న నాటి నుంచే సూరీ పేరిట సెటిల్మెంట్లు చేస్తూ భాను కోట్లు గడించాడు.

గ్యాంగ్‌లో తనదైన ముద్రను ప్రదర్శించే ప్రయత్నాలు చేసేవాడు. భాను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అన్నంతగా ఎదిగిపోయాడు. మద్దెలచెరువు సూరీ మొదటి నుంచి తన నీడను కూడా అనుమానించేవాడు. అందుకే జూబ్లీ హిల్స్‌ కారుబాంబు కేసు మొదలు... ఎప్పటికప్పుడు తన అనుచరుల్ని మార్చేశాడు. వ్యక్తిగత విషయాలే కాకుండా, సెటిల్మెంట్లు, ఇతరత్రా వ్యవహారాలు కూడా అనుచరుల్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేవాడు.

అలాంటి సూరీ దగ్గర గత పదేళ్లుగా భాను కిరణ్‌ నమ్మిన బంటుగా పనిచేస్తున్నాడు. అలాంటి బంటే... ఈ నెల 3న సూరీని అంతం చేశాడన్న అంశంపైనే పోలీసులు దృష్టి పెట్టారు. భాను అప్పటికప్పుడు సూరీని చంపాలని నిర్ణయం తీసుకోలేదని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. పక్కా ప్రణాళికతో సూరీ హత్యకు ఒక స్కెచ్‌ వేశాడని చెబుతున్నాయి.

ముందు నుంచీ నేరచరిత్ర ఉన్న భానుకిరణ్‌ గతంలో అక్రమ ఆయుధాల కేసులో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. సూరీ హత్య తర్వాత చాకచక్యంగా తప్పించుకున్న భాను పకడ్బందీగా ఏ ఒక్క ఆధారం మిగలకుండా జాగ్రత్తపడ్డాడు. కొండాపూర్‌లోని వైట్‌ఫీల్డ్స్‌లో ఉన్న ప్రశాంత్‌ విహార్‌లోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న భాను, అక్కడ ఏ ఆధారం దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

తన దగ్గర ఉన్న లైసెన్స్‌డ్‌ పిస్టల్‌ను సూరీ హత్యకు నాలుగు రోజుల ముందు, అంటే... గతనెల 30న ఆబిడ్స్‌లోని ఏపీ ఆర్మరీలో డిపాజిట్‌ చేశాడు. అవివాహితుడైన భాను ఈ హత్యకు ఇరవై రోజుల ముందే హైదరాబాద్‌లో ఉంటున్న తన సోదరి కుటుంబాన్ని మరో ప్రాంతానికి తరలించాడు. సీక్రెట్‌ మీటింగ్‌కు వెళ్లినప్పుడు వెంట ఎవరూ ఉండరని తెలిసి పక్కా వ్యూహంతోనే సూరీని ఖతం చేశాడనేది పోలీసుల అభిప్రాయం.

ముందుగానే ఫిక్స్‌ చేసుకున్న ఎస్కేప్‌ ప్లాన్‌ మేరకు ముగ్గురు నుంచి నలుగురు అనుచరుల సాయంతో భాను సిటీ దాటినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇంతకీ భాను ఈ హత్యకు ఎందుకు పాల్పడ్డాడని ఆలోచిస్తే ప్రధానంగా ఆర్థిక పరమైన వివాదాలే కనిపిస్తున్నాయి. సూరీ జైలులో ఉన్నప్పుడు తన ఆస్తులకు బినామీగా భానుని పెట్టాడు.

బయటకు వచ్చాక కూడా సూరీ పేరుతో భాను సెటిల్మెంట్లు చేసేవాడు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్నిజిల్లాల్లో సూరీ పేర భాను సెటిలమెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు అదే పేరును ఉపయోగించుకుని భాను తన పాత వ్యాపారం అయిన అక్రమ ఆయుధాల బిజినెస్‌తోపాటు అమ్మాయిల బిజినెస్‌ చేసినట్లు తెలిసింది.

వీటిపై సూరీ అతన్ని తీవ్రంగా మందలించినట్లు సమాచారం. ఇవే కాకుండా బెజవాడ ఎపిసోడ్‌లో సూరీకి, భానుకు విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలిసింది. విజయవాడ అన్నపూర్ణ ప్యాకేజెస్‌ వ్యవహారం సూరీ దృష్టికి రావడం, ఓ సీనియర్‌ మంత్రి కొడుకు ఫోన్‌కాల్‌తో ప్రదీప్‌రెడ్డి, భానుకిరణ్‌లు ఆ కంపెనీలకు డైరెక్టర్లవ్వడం... ఈ వ్యవహారం పత్రికల్లో రావడం... దీని సమాచారం సూరీ దగ్గర లేకపోవడంతో ఆ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే వాదనలు ఉన్నాయి. దీంతో భాను కాస్త కంగారు పడ్డట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ భాను సూరీని చంపి ఉండకపోతే... సూరీ భానుతోపాటు మరికొందరిని అంతం చేసేవాడనే కోణం కూడా ఉందనేది మరో వెర్షన్‌. ఇదే కాకుండా సూరీ మద్యం మత్తులో ఉన్నప్పుడు భానును బూతులు తిట్టేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కారణాలే సూరీ హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు సూరీ శతృవర్గంతో భాను చేతులు కలిపి ఉండొచ్చని, వారి నుంచి సుపారీ తీసుకుని, సూరీని అంతమొందించి ఉండొచ్చనే వాదనా లేకపోలేదు.

దీంతోపాటు టాలీవుడ్‌లో సూరీ దాదాపు మూడొందల కోట్లమేర పెట్టుబడులు పెట్టాడు. ముంబై మాఫియా బాలీవుడ్‌ను శాసిస్తున్నట్లు, టాలీవుడ్‌పై పట్టుసాధించేందుకు యత్నించాడు. ప్రముఖ హీరోల సినిమాల్లో సూరీవర్గం పెట్టుబడులున్నాయనేది మరోవాదన. వీటన్నిటినీ సొంతం చేసుకోడానికే పథకం ప్రకారం భాను ఈ హత్యకు స్కెచ్‌ వేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సూరీని చంపితే డబ్బుకు డబ్బు, పాపులారీటికి పాపులారిటీ దక్కుతాయనేది భాను భావన అయి ఉంటుందని కొంతమంది అధికారులు విశ్లేషిస్తున్నారు.

అటు హైదరాబాద్‌ పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. వీలైనంత తొందరలో భానును అరెస్టు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొదట బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేయగా... కేసు తీవ్రత మేరు సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఇప్పటికే భాను కోసం ఆరు ప్రత్యేక బృందాలు రాష్ట్రంతో పాటు, కర్ణాటక జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే సూరీ కీలక అనుచరులు, పనివాళ్లు, భాను సన్నిహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్‌, బెంగళూరు నగరాలతోపాటు, పలు ప్రాంతాల్లోని సూరీ, భాను ఆస్తులను సోదా చేస్తున్నారు. ఇదే క్రమంలో సూరీ డ్రైవర్‌ మధుసూదన్‌రెడ్డి అలియాస్‌ మధు కూడా సూరీ ఆస్తులకు బినామీ అనే విషయం బయటపడింది. హత్యా సమయంలో అక్కడే ఉన్న మధును కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యజరిగిన వెంటనే పోలీసులు భాను సెల్‌ఫోన్‌ కాల్‌డేటాను విశ్లేషించారు.

కాల్‌డేటా మేరకు అనంతపురంలోని తన సన్నిహితులకే ఎక్కువగా కాల్స్‌ చేశాడని స్పష్టమవుతోంది. సూరీ హత్య తర్వాత గణేష్‌ అనే వ్యక్తికి భాను 9 సార్లు ఫోన్‌ చేసి, దాదాపు 251 సెకన్లు మాట్లాడినట్లు కాల్‌డేటా స్పష్టం చేస్తోంది. కొండాపూర్‌లోని సూరీ ఇంట్లో లభించిన అతని వ్యక్తిగత ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబ్‌ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఆ నివేదిక వస్తే కీలకమైన ఆధారాలు లభించే అవకాశాలున్నట్లు పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ల్యాప్‌టాపే కాకుండా ఈ హత్యకేసులో ఫోరెన్సిక్‌ నివేదికలు అత్యంత కీలకం కానున్నాయి. మరోవైపు పోలీసుల అదుపులో లేకుంటే భాను తన సేఫ్టీకోసం మీడియాను ఆశ్రయించే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ప్రొడ్యూసర్‌ రక్తచరిత్ర సీక్వెల్‌ పార్ట్‌ త్రీ తీయాలన్నా... బెజవాడ రౌడీలు సినిమా పూర్తికావాలన్నా... భాను దొరకడం తప్పనిసరి. అయితే భాను అరెస్టయితే రక్తచరిత్ర పార్ట్‌ త్రీ తర్వాత సీక్వెళ్లకు ఫుల్‌స్టాప్‌ పడే అవకాశాలు లేకపోలేదు.

No comments: