
కొన్ని శక్తులు పాలనావ్యవస్థను అస్థిరపరచాలని చూస్తున్నాయని, అశాంతితో ఉన్న ప్రతిపక్షం బలవంతంగా ముందస్తు ఎన్నికలకు ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఆరోపించారు. మంగళవారం రాత్రి ఆయన ఎయిరిండియా వన్ విమానంలో న్యూయార్క్ నుంచి స్వదేశం చేరుకున్నారు. అంతకు ముందు ప్రధానమంత్రి తనతో పాటు న్యూయార్క్ నుంచి విమానంలో ప్రయాణిస్తున్న విలేకరులతో మాట్లాడారు. తన ప్రభుత్వంలో కొన్ని బలహీనతల్ని ప్రతిపక్షం కనిపెట్టి, ముందస్తు ఎన్నికలకు ఒత్తిడి తీసుకురాగలనని అనుకుంటోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ముందుగా ఎన్నికలు రావడం కోసం హోంమంత్రి చిదంబరంపై బురద చల్లుతున్నారన్నారు.
‘ఇది పద్ధతి కాదు. అయిదేళ్లు అధికారంలో ఉండేందుకు మా ప్రభుత్వానికి ప్రజలు అనుజ్ఞ ఇచ్చారు. ఆ ప్రకారమే ప్రభుత్వం అయిదేళ్లూ అధికారంలో ఉంటుంది. మేం ఉంటాం’ అని ప్రధాని మన్మోహన్సింగ్ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన ప్రభుత్వంలో కొంత అవగాహన లోపం ఉండవచ్చని ప్రధాని అంగీకరించారు. దాన్ని చక్కదిద్దాల్సి ఉందన్నారు. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రధాని...‘నేను గుర్తించని కొన్ని ఇతర శక్తులున్నాయన్న అనుమానం ఉంది. ఆ శక్తులు మన పాలనాక్రమాన్ని, విధానాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయి’ అన్నారు.
విభేదాలపై ఆచితూచి...
తన కేబినెట్లో ఆర్థికమంత్రి ప్రణబ్ముఖర్జీకి, హోంమంత్రి చిదంబరానికి మధ్య విభేదాలున్నాయని అనుకుంటున్న నేపథ్యంలో... మన్మోహన్ ఆచితూచి మాట్లాడారు. మీడియా చెబుతున్న ‘మంత్రుల పోరు’ గురించి తనకేమీ తెలీదన్నారు. ఆర్థికమంత్రిత్వశాఖ పంపిన ‘నోట్’పై రేగిన వివాదానికి తెరదించేందుకు ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. 2జి పై నోట్ తర్వాత మంత్రులమధ్య విభేదాలు పెరిగాయని పిస్తోంది అని విలేకరులు అడగ్గా ప్రధాని- ‘మంత్రుల మధ్య విభేదాలు లేవు. మంత్రుల మధ్య పోరు సాగుతోందని మీరు (మీడియా) అంటున్నారు. అలాంటిదేం నాకు తెలీదు’ అన్నారు. మీరు చిదంబరానికి క్లీన్చిట్ ఇస్తారా? అని అడగ్గా, ఇంతకుముందు చెప్పిందే ప్రధాని తిరిగి చెప్పారు.
ఇప్పుడూ అదే మాట
‘అప్పటి ఆర్థిక మంత్రిగా చిదంబరంపై నాకు నమ్మక ముంది. ఇప్పటి హోంమంత్రిగా ఆ నమ్మకం కొనసాగుతోంది. ప్రణబ్ముఖర్జీకి కూడా అదే వర్తిస్తుంది’ అన్నారు. ‘మాది సంఘటిత ప్రభుత్వం. పాలన కూడా అదేవిధంగా ఉండాలి. నా కేబినెట్లో విభేదాలకు స్థానం లేదు’ అని చెబుతూ కేబినెట్లో అరమరికలు లేకుండా బహిరంగ చర్చలు జరుగుతూనే ఉంటాయన్నారు.‘మంత్రులకు భిన్నాభిప్రాయా లు ఉన్నా, అంతా కలిసికట్టుగా పనిచేసేందుకు అవి అడ్డుగా నిలవవు. సంఘటితంగా ఉండడం నిర్ణయాలు తీసుకునేం దుకు తోడ్పడుతుంది.

బీజేపీ అభ్యంతరం
తనపై ప్రధాని మన్మోహన్సింగ్ మంగళవారం చేసిన వ్యాఖ్యలపట్ల ప్రతిపక్షం మండిపడింది. ముందుగా ఎన్నికలు రావడంకోసం తాము 2జి కుంభకోణంలోకి చిదంబరాన్ని లాగి, బురదచల్లుతున్నామని ఆయన అనడంపై భారతీయ జనతాపార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలా అనడం వల్ల మొత్తం వ్యవహారాన్ని అవహేళన చేసినట్టు అవుతోందని చెప్పింది. ‘ప్రధాని ప్రకటన ఎంతో విచారకరం. దురదృష్ట కరం. కేసుపై దర్యాప్తు జరగాలని మేం డిమాండ్ చేస్తుంటే ప్రతిపక్షం ముందస్తు ఎన్నికల్ని కోరుకుంటోందని ఆయన అన్నారు’ అని బీజేపీ ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. దీనిపై చర్చించేందుకు సీనియర్ నాయకుడు ఎల్కె అద్వానీ బీజేపీ అగ్రనాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, రాజ్యస భలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్జైట్లీ, పార్టీ సీనియర్ నాయ కులు గోపీనాథ్ముండే, ఎస్ఎస్ అహ్లూవాలియా, రవిశంకర్ ప్రసాద్, హరేన్ పాథక్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
No comments:
Post a Comment