Pages

Nov 3, 2011

గాస్ ధర పెరిగితే ప్రజాగ్రహ గాస్ పేలుద్ధి .



-ఈ రోజు ప్రజాశక్తి లో వచ్చిన వార్త ఇది.
- గాస్ ధర పెరిగితే ప్రజాగ్రహ గాస్ పేలుద్ధి .

మళ్లీ గ్యాస్‌ భారం!

  • కిరోసిన్‌, డీజిల్‌ ధర బాదుడు
  • పార్లమెంటు సమావేశాలకు ముందే భారాలు
  • యుపిఎ ప్రభుత్వం మళ్లీ ప్రజల నడ్డి విరిచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రెండు నెలల క్రితమే పెట్రోలు ధరలను భారీ స్థాయిలో పెంచగా ఇప్పుడు పెట్రోలుతో పాటు వంటగ్యాసు, డీజిల్‌, కిరోసిన్‌ ధరలను పెంచేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. 'తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి' అనే రీతిలో 'పెట్రో ధరలపై నియంత్రణ ఎత్తేశాం కాబట్టి అంతా చమురు కంపెనీల ఇష్టం...మాదేం లేదు' అని పాలకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
  • డీజిల్‌, వంట గ్యాస్‌, కిరోసిన్‌ ధరలను పెంచే విషయమై చర్చించేందుకు మంత్రుల సాధికార బృందం(ఇజిఒఎం) భేటీకి కేంద్ర చమురు శాఖ మంత్రి ఎస్‌ జైపాల్‌రెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీని బుధవారం జైపాల్‌ కలవడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. 'మంత్రుల సాధికార బృందం సమావేశం ఏర్పాటు చేయాలని కోరాను' అని ఆయన భేటీ ముగిసిన అనంతరం విలేకరులకు చెప్పారు. తక్కువ ధరకు ఇంధనాన్ని విక్రయించడం వల్ల రోజుకు రూ. 333 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు చమురు సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ చమురు సంస్థలు డీజిల్‌ లీటరుకు రూ. 9.27, కిరోసిన్‌ లీటరుకు రూ. 26.94, 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌కు రూ. 260.50 నష్టపోతున్నాయని చెప్పారు. మంత్రుల బృందం సమావేశం నవంబర్‌ 22న ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశానికి ముందే ఉంటుందని, అయితే ధరలను పెంచడం అంత సులభం కాదని జైపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
  • చమురు కంపెనీల ఇష్టం
  • ఇప్పటికే సామాన్యులకు భారంగా మారిన పెట్రోలు ధరలను మరింత పెంచుకోవడానికి యత్నిస్తున్న చమురు సంస్థలకు ఊతమిచ్చేవిధంగా ప్రభుత్వ, చమురు మంత్రిత్వ శాఖ ప్రకటనలున్నాయి. పెట్రోలు ధరపై నియంత్రణ ఎత్తివేశాక ఇక తమకేమి సంబంధం అంటున్నాయి. బుధవారం చుమురు మంత్రిత్వ శాఖ కార్యదర్శి జిసి చతుర్వేది వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత పెట్రోలు ధరల వలన తమకు లీటరుకు రూ.1.50 చొప్పున నష్టం వాటిల్లుతోందని, అందువల్ల మళ్ళీ పెట్రో ధరలు పెంచాల్సి ఉందని మంగళవారం హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పిసిఎల్‌) డైరెక్టర్‌(ఆర్థిక) బి ముఖర్జీ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందన కోరుతూ బుధవారం తనను కలిసిన విలేకరులతో చతుర్వేది మాట్లాడారు. '(ధరలు) పెంచాలా, వద్దా అన్నది వారి(కంపెనీలు) ఇష్టం. సరైన సమయంలో వారు నిర్ణయం తీసుకుంటారు' అని ఆయన వ్యాఖ్యానించారు. పెట్రోల్‌ ధరపై ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేసిందని, అందువల్ల ప్రభుత్వం ధరను నిర్ణయించదని చెప్పారు. పెట్రోలు ధరను చివరిసారి సెప్టెంబరు 16న లీటరుకు రూ.3.14 చొప్పున పెంచిన విషయం తెలిసిందే.
  • భారం మోపేందుకు సిద్ధమవుతున్న యుపిఎ: సిపిఎం
  • ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బందుల్లో ఉన్న సామాన్యునిపై మరింత భారం మోపేందుకు సిద్ధపడుతున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ తీరును సిపిఎం తీవ్రంగా విమర్శించింది. ప్రతిపాదిత ఇంధన ధరల పెంపు సామాన్యులను మరింత కుంగదీస్తుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరితో ప్రజల జీవితం దుర్భరంగా మారిందని, ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల అధిక ధరలతో ఇబ్బందిపడుతున్న పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు మరింత ప్రభావితమవుతాయని అన్నారు.

No comments:

Post a Comment