నిరసనలు ... కిరణ్ సర్కార్ ఏం వెలగ బెట్టిందని మరి !
నిరసనల మధ్య 'రచ్చబండ'
రూపాయికి కిలో బియ్యం ఇస్తేనే సరిపోదు
నిత్యావసరాల ధరల మాటేమిటని సిఎంను ప్రశ్నించిన మహిళలు
'తూర్పు'లో రబీ నీటి ఊసెత్తని కిరణ్ కుమార్
రచ్చబండ పథకం ప్రారంభించిన తొలిరోజునే ముఖ్యమంత్రి మహిళల నిరసనను ఎదుర్కొన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి, రూపాయికి కిలో బియ్యం ఇస్తే సరిపోతుందా? వాటి ధరలు కూడా తగ్గించాలి.. అని విశాఖ జిల్లా యలమంచిలిలో బుధవారం జరిగిన రచ్చబండ సభలో సిఎం ఎన్.కిరణ్కుమార్రెడ్డిని మహిళలు నిలదీశారు.
ఊహించని ఈ పరిణామానికి సిఎం, అధికారులు, కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు. బుధవారం విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో నిర్వహించిన రెండో విడత రచ్చబండ కార్యక్రమాల్లో సిఎం పాల్గొన్నారు. విశాఖలో మహిళల నుండి నిరసన వ్యక్తమవ్వగా, తూర్పుగోదావరిలో సిఎం అసలు రబీకి సాగు నీటి గురించి ప్రస్తావించనేేలేదు. విశాఖ సభలో సిఎం కిలో రూపాయికే బియ్యం పథకంపై ప్రసంగిస్తుండగా మహిళలు అడ్డుతగిలారు.
''రూపాయికే కిలో బియ్యం ఇచ్చినంత మాత్రన సరిపోదు. నిత్యావసర వస్తువుల ధరలు వివరీతంగా పెరిగాయి. వాటి ధరలు తగ్గించాలి'' అని నినాదాలు చేశారు. పోలీసులు కలుగజేసుకొని మహిళలకు సర్దిచెప్పారు. అనంతరం సిఎం తన ప్రసంగాన్ని కొనసాగించారు. పావలా వడ్డీ రుణాలు అందాయా? అని మహిళనుద్దేశించి అడిగారు. దీంతో, పలువురు మహిళలు తమకు అందలేదని ఠక్కున సమాధానం చెప్పారు. అయినా పట్టించుకోకుండా సిఎం ప్రసంగాన్ని కొనసాగించారు. సభలో ధరలపై నిలదీసిన ఆర్ మహాలకిë్మ, వై.కల్యాణి తదితర మహిళలు వేదికపై మాట్లాడటానికి తమకు అవకాశమిస్తే తమ బాధలను సిఎంకు విన్నవించేవారమని విలేకర్లతో అన్నారు. ఇదిలా వుండగా తమ బాధలు వివరిస్తూ సిఎంకు మెమోరాండం ఇవ్వాలని ప్రయత్నించిన కంప్యూటర్ టీచర్లను పోలీసులు ముందే అరెస్టు చేసి స్టేషన్లో నిర్బంధించారు.
తూర్పుగోదావరి గండేపల్లి మండలంలో నిర్వహించిన సభలో సిఎం అసలు రైతు సమస్య సాగునీటి గురించి మాట కూడా మాట్లాడలేదు. పాత పథకాలనే వల్లెవేశారు.. మహిళలకు, రైతులకు రుణాలిస్తామంటూ ఎప్పుడూ చెప్పిందే చెప్పారు. ఆధార్ కార్డు అమల్లోకి వచ్చిన తరువాత ఆ కార్డు ఉంటేనే రేషన్ ఇస్తారని, మార్చి తరువాత ఈ విధానం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బోగస్ రేషన్కార్డులు ఉన్నమాట వాస్తవమేనని, ఆధార్ కార్డులతో వీటిని పూర్తిగా నిరోధిస్తామని తెలిపారు. మహిళలకు, రైతులకు త్వరలో రూ.లక్ష వడ్డీ లేని రుణం అందిస్తామని తెలిపారు. మహిళల బ్యాంకు అకౌంట్లకే డబ్బులు జమ చేసేలా హామీ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉండగా, రైతులను ఏనాడూ పట్టించుకోలేదని, అధికారం పోయాక ఇంత కాలానికి ఆయనకు రైతులు గుర్తొచ్చారని విమర్శించారు. ఆర్థిక మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రైతు పోరాటం పేరుతో రాజకీయ పోరాటం మొదలుపెట్టారని విమర్శించారు. జిల్లా మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణ పనులు ప్రారంభించాలని, జగ్గంపేటలో డిగ్రీ కళాశాల భవనాలకు, ఫైర్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సిఎంను కోరారు. సిఎం తన ప్రసంగంలో కోనసీమ, మెట్ట ప్రాంతాల్లో ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. రబీ సీజన్లో ఎన్ని ఎకరాలకు నీరందిస్తారో చెప్పలేదు. కౌలు రైతుల రక్షణ చట్టం అమలు తీరును ప్రస్తావించనే లేదు. పుష్కర ఎత్తిపోతల పథకం ప్రస్తావనే లేదు. సాగునీటి కొరత, వర్షాభావం, ఎండిన పంటల గురించి మాట్లాడకపోవడం రైతులను నిరాశ పరిచింది. జిల్లాలోని 2.50 లక్షల ఎకరాల్లో రబీకి నీరు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిపై రైతులు మండిపడుతున్నారు. మొత్తం ఆయకట్టుకు సాగునీరందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ విషయమై ఎలాంటి ప్రకటనా చేయలేదు. మంత్రి తోట నరసింహం ఏలేరు ఆధునీకరణ గురించి ఆవేదన వ్యక్తం చేసినా సిఎం చలించలేదు.
No comments:
Post a Comment