Sep 26, 2011

రోగనిరోధక శక్తినిపెంచే హోమియో మందులు !

మానవ శరీరం ఒక అద్భుతం. శరీరంలో ఎలాంటి అన్యపదార్థాలు, క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి దానికుంది. దీన్నే ఇమ్యునిటీ లేదా రోగనిరోధక శక్తి అంటాం. దీని వల్ల మన శరీరంలోనికి గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా, ఎలాంటి ప్రతీకూల పదార్థాలు బ్యాక్టీరియా, వైరస్‌, అన్యపదార్థాలు వచ్చినా తెల్ల రక్తకణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంత మందిలో ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వల్ల కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీన్నే 'హైపర్‌ సెన్సిటివిటీ' లేదా అలర్జీ అంటారు. గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు ఒకటో, రెండో తుమ్ములు రావడం సహజం. అయితే అలర్జీతో బాధపడేవారికి ఇక అదేపనిగా వరసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి, జలుబు చేసి, పల్చని నీరులా స్రవిస్తుంది. దాంతోపాటు కళ్లు ఎరుపెక్కి కళ్ల నుండి నీరుకారుతుంటుంది. ఈ పరిస్థితిని 'అలర్జిక్‌ రైనైటిస్‌' అంటారు. దీనిని అశ్రద్ధ చేస్తే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కల్లె వస్తుండడం, ముఖం లోపలి భాగంలో నొప్పిగా ఉండటం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. దీన్నే అలర్జిక్‌ సైనసైటిస్‌ అంటాం. క్రమంగా ఈ వ్యాధి గాలి గొట్టాలలోకి, ఊపిరితిత్తులకు సోకి పొడి దగ్గు, తర్వాత కల్లెతో కూడిన దగ్గుగా మొదలవుతుంది. దాన్ని అలర్జిక్‌ బ్రాంకైటిస్‌ అంటాం. ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కనిపిస్తే అలర్జిక్‌ ఆస్తమా అంటాం.
అలర్జిక్‌ డెర్మటైటిస్‌ : కొంత మందికి వంకాయ, మునక్కాయ, పల్లీలు వంటి ఆహార పదార్థాలు తినగానే శరీరంపై దద్దుల్లాగా ఎర్రగా, ఉబ్బెత్తుగా, తీవ్ర దురదతో లేదా దురదలేకుండా వస్తాయి. దీన్ని ఆర్టికిరియ అంటారు. ఈ దద్దుర్లు 24 గంటల్లో తగ్గుతాయి. కొందరిలో లేటెక్స్‌ సంబంధ వస్తువులు తగిలిన స్థలాలలో చర్మంపైన పొక్కులు వస్తాయి. దీన్ని అలర్జిక్‌ డెర్మటైటిస్‌ అంటారు. ఇలా అలర్జీలలో అనేక రకాలు ఉన్నప్పటికీ ఎక్కువ మందిలో కనబడేవి శ్వాసకోశ సంబంధ అలర్జీలు. అంటే రైనైటిస్‌, సైనసైటిస్‌, బ్రాంకైటిస్‌, బ్రాంకియల్‌ ఆస్తమా, అలర్జీని కలిగించే పదార్థాలను అలర్జెన్స్‌ అంటారు. శ్వాసకోశ సంబంధ అలర్జీలను కలిగించే వాటిలో ప్రధానమైంది పుప్పొడి, ఉన్ని, దుమ్ములో ఉండే క్రిములు, మోల్డ్‌, బొద్దికంలు, పశువుల పేడ మొదలైనవి. కొంత మందికి పూలవాసన, సెంటు, కూర పోపువాసన వంటివి పడవు.
కొన్ని జాగ్రత్తలు : శ్వాసకోశ సంబంధ అలర్జీలు శరీరంలో ఎటోపి అనే తత్వం కలిగిన వారికి ఎక్కువగా వస్తుంటాయి. అలర్జీతో బాధపడేవారిలో ఏదో ఒక ప్రత్యేకమైన పదార్థానికి దగ్గరగా వచ్చినప్పుడు రక్తంలో ఉండే ఇమ్యునోగ్లోబ్యులిన్‌-ఇ అనే యాంటిబాడీస్‌తో అలర్జిన్‌ కలవడం వల్ల హిస్టమిన్‌ విడుదలవుతుంది. దీని వల్ల లక్షణాలు ప్రారంభమవుతాయి. సాధారణంగా వాడే యాంటీ-హిస్టమిన్‌ మందుల వల్ల శరీరంలోని ఎటోపి తత్వాన్ని, వ్యాధినిరోధక వ్యవస్థలోని సున్నితత్వాన్ని అవి తొలగించలేవు. కాబట్టి సమస్య దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే శరీర తత్వాన్ని బట్టి సూచించే హోమియోపతి కాన్స్‌టిట్యూషనల్‌ మందుల వల్ల అలర్జీ సమస్య నుండి శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. హోమియోపతి మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఎంత దీర్ఘకాలంగా ఉన్న అలర్జీ సమస్యలైనా చక్కని ఉపశమనం పొందవచ్చు. చికిత్స సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. వాతావరణం మార్పు ఉన్నప్పుడు, సంధికాలంలో, పుప్పొడి, ఎక్కువగా విడుదలయ్యే సమయాలలో సాధ్యమైనంత వరకు బయటికి రాకూడదు. దుమ్ములో వెళ్లేటప్పుడు విధిగా క్యాప్‌, మాస్క్‌ వాడాలి. ఇంట్లో దుమ్ము, ధూళి వారం రోజులకోసారి దులుపుకోవాలి. పెంపుడు జంతువులు ఉంటే ఇంటి బయటే ఉంచడం మంచిది. బెడ్‌షీట్స్‌, పిల్లో కవర్స్‌ తరచూ మారుస్తుండాలి. ఆహారంలో పడనివాటిని తగ్గంచుకోవాలి. ఇంట్లో తేమశాతం తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకుని మంచి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా కొంత కాలం జాగ్రత్తలు పాటిస్తూ హోమియోపతి మందులు వాడితే తర్వాత వ్యాధినిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి పదార్థాలు ఎదురైనా ఎలాంటి సమస్య ఉండదు.

No comments: