Sep 26, 2011

గురి మార్చిన జ‘గన్‌’ ?

jaganహైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: తమకు ప్రత్యర్థి కాంగ్రెస్సేనని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రూటు మార్చారా అన్న కోణంలో చర్చ సాగుతోంది. సీబీఐ విచారణకు ముందు కాంగ్రెస్‌ పార్టీపై ఆ పార్టీ అధినాయకురాలు సోనియాపై దుమ్మెత్తిపోసిన జగన్‌ ఇప్పుడు విమర్శనాస్త్రాలను టీడీపీపై ఎక్కిపెడుతున్నారు. అకస్మాత్తు గా యువనేతలో వచ్చిన ఈ మార్పు వెనక కారణం లేకపోలేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నా యి. ఏ పార్టీ అయినా సరే అధికార పక్షం పైనే ప్రధానంగా విమర్శలు చేస్తాయి. అందుకు భిన్నంగా ప్రస్తుతం జగన్మోహన్‌రెడ్డి ఎందుకు వ్యవహ రిస్తున్నారో అవగాహన చేసుకొంటేచాలు వాస్తవం ఏమిటో తెలుస్తుందని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత పేర్కొన్నారు.

విమర్శల జోరు తగ్గించడంద్వారా జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి పరోక్షంగా స్నేహ హస్తం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంగా పేర్కొంటూ విమర్శలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన విమర్శనాస్తల్రు చేయడం ఇందులో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. కడప ఉప ఎన్ని కల్లో కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఎంత తీవ్రంగా జగన్‌ విమర్శలు చేశారో ఇప్పుడు ఆవేశం ఆయనలో కనిపించడంలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా ధృవీకరిస్తున్నారు. జగన్‌ దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఓ నేత చెప్పడం విశేషం.

అయితే తమ నేత కాంగ్రెస్‌కు అందిస్తున్న స్నేహ హస్తం ఎంత వరకు ఫలిస్తుందో, తమ పార్టీకి ఎంత నష్టం చేకూర్చుతుందోనని కూడా ఆయన పేర్కొన్నారు. సీబీఐ విచారణతో ఉక్కిరి, బిక్కిరి అవుతున్న జగన్‌ జాతీయ స్థాయిలో పార్టీల మద్దతు కోరుతూ ఢిల్లీలో లాబీయింగ్‌ మొదలెట్టారు. కానీ అది అంతగా కలసి రాకపోవడంతో అవసరమైతే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని జగన్‌ ఓ మీడియాతో అన్నారు. దీంతో ఆయనకు బాసటగా నిలిచిన బీజేపీ సైతం దూరమైంది. అదే సందర్భంలో కాంగ్రెస్‌ వైపు నుంచి జగన్‌ వ్యాఖ్యలపై పెద్దగా స్పందన రాలేదు.

సీబీఐ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్‌ మద్దతు ఎంతో అవసరమని గమనించే జగన్‌ తన వాయిస్‌ మార్చారని ఓ కాంగ్రెస్‌ నేత పేర్కొన్నారు. ఏ పార్టీ అయినా అధికార పీఠం అధిరోహించేందుకు సహజంగా అధికారపార్టీనే టార్గెట్‌ చేసుకొంటుంది. అవసరమైతే తమకు ధీటుగా ఉన్న ఇతర పార్టీలను టార్గెట్‌ చేసుకొంటారు. కానీ ఇందుకు భిన్నం గా అధికార పక్షమైన కాంగ్రెస్‌ పార్టీని వదిలేసి, కేవలం టీడీపీనే టార్గెట్‌ చేస్తూ జగన్‌ చేస్తున్న వ్యాఖ్యల మర్మమేమిటి అన్న చర్చ రాజకీయవర్గాలో సాగుతోంది. ఢిల్లీ యాత్ర తరువాత జగన్‌ చేపట్టిన ఓదార్పు యాత్రలో ఆయన చేస్తున్న విమర్శలలో సోనియా పేరుగానీ, కాంగ్రెస్‌ అన్న పథం కాని వినిపించడంలేదు. ఎక్కువగా టీడీపీని టార్గెట్‌ చేస్తున్నట్లు ప్రసంగాలు కొనసాగుతున్నాయి.

మరోవైపు ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారే గానీ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటూ విమర్శలు చేయకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారని కాంగ్రెస్‌ చెందిన ఓ నేత పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో స్నేహం కోసం అనుకూల వాతా వరణం సృష్టించు కొనేందుకు జగన్‌ ఈ రకమైన వైఖరిని అవలంభిస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సీబీఐ విచారణలతో తన రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బందులు ఏర్పడకూడదన్న ఉద్దేశంతోనే జగన్‌ ఇలా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఓదార్పుయాత్రలో టీడీపీపై విమర్శలు చేయడం ద్వారా సోనియా ఆశీస్సులు దక్కుతాయన్న వ్యూహంలో జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ఓదార్పు యాత్రతో తన బలాన్ని గుర్తించడమే కాకుండా కాంగ్రెస్‌ అధిష్ఠానం తన అవసరాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుంటుందన్న ఆలోచన యువనేతలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ సానుకూల ధృక్పథంతో ఆలోచించినప్పుడేనన్నది కూడా అని ఆయన భావిస్తున్నారు. తనపట్ల సానుకూల ధృక్పథం రావాలంటే కాంగ్రెస్‌పై, సోనియాపై విమర్శవేడి తగ్గించడమే మార్గంగా జగన్‌ గుర్తించారని ఓ కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణలపై జరుగుతున్న విచారణ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కాంగ్రెస్‌ స్నేహ హస్తం కచ్చితంగా అవసరమని యువనేత గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణం చేతనే జగన్‌ తన గురిని మార్చినట్లు సమాచారం.

No comments: