Sep 28, 2011

‘ఊపిరి’ తీస్తున్న భారత్, చైనా నగరాలు

శ్వాస సంబంధ వ్యాధులకు నిలయాలన్న డబ్ల్యూహెచ్‌ఓ



జెనీవా: భారత్, చైనాలోని నగరాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వెలిబుచ్చింది. గాలి కాలుష్యంతో ఈ రెండు దేశాల్లోని నగరాలు శ్వాస సంబంధ వ్యాధులకు నిలయాలుగా మారాయని పేర్కొంది. ఎస్‌వీయూ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్), కార్లు, ద్విచక్రవాహనాలు వాడే వారి సంఖ్య పెరుగుతుండడంతో వాయు కాలుష్యం ఎక్కువ అవుతోందని అభిప్రాయపడింది. మధ్యతరగతి ప్రజలు ఆధునిక వాహనాలు కలిగివుండడం స్టేటస్ సింబల్‌గా భావిస్తుండడమే వాహనాల వృద్ధికి కారణమని విశ్లేషించింది.

వాయు కాలుష్యంతో శ్వాస సంబంధ వ్యాధులు, కేన్సర్లతో 2008లో 1.34 మిలియన్ మంది అకాల మరణం చెందారని డబ్ల్యూహెచ్‌ఓఅంచనా వేసింది. భారత్, చైనా దేశాల్లో వేగంగా పారిశ్రామీకరణ చెందుతున్న నగరాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు శ్వాస సంబంధ వ్యాధులకు కేంద్రాలు మారుతున్నాయని వివరించింది. తాము రూపొందించిన మార్గదర్శకాల ద్వారా 2008లో ప్రపంచ వ్యాప్తంగా 1.09 మిలియన్ మరణాలను నివారించగలిగామని అంచనా కట్టినట్టు డబ్ల్యూహెచ్‌ఓ పబ్లిక్ హెల్త్, ఎన్విరాన్‌మెంట్ డెరైక్టర్ మారియా నీరా పేర్కొన్నారు.

No comments: