Sep 28, 2011

బ్రిటన్‌లో 23 మంది భారతీయుల అరెస్ట్

లండన్: బ్రిటన్‌లో అక్రమంగా ఉంటున్న 23 మంది భారతీయులతో సహా 25 మంది విదేశీయులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరందరూ ఆసియన్ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో పశ్చిమ లండన్‌లోని సౌతాల్ ప్రాంతంలో ఉన్న క్వాలిటీ ఫుడ్స్ సూపర్ మార్కెట్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. వలస నిబంధనలను ఉల్లంఘించి ఇక్కడ పనిచేస్తున్న 25 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో 23 మంది భారతీయులు, పాకిస్థాన్, ఘానా పౌరులున్నారు. వీరంతా 19 నుంచి 54 మధ్య వయస్కులు. నిందితుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

అరెస్టయిన వారిలో 15 మంది వలస నిబంధనలను ఉల్లంఘించారని, ఆరుగురు అక్రమంగా బ్రిటన్‌లోకి ప్రవేశించారని, నలుగురు వీసా గడువు ముగిసిపోయినప్పటికీ ఇక్కడ ఉంటున్నారని అధికారులు గుర్తించారు. 25 మంది నిందితులను వీలైనంత తొందరగా వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సూపర్‌మార్కెట్ యజమానికి పెనాల్టీ నోటీసు ఇచ్చారు. నేరం రుజువైతే ఒక్కో కార్మికుడికి 10 వేల చొప్పున యజమానికి జరిమానా విధిస్తామని యూకే సరిహద్దు సంస్థకు చెందిన ఈలింగ్ స్థానిక ఇమ్మిగ్రేషన్ బృందం అధిపతి జెన్నిఫర్ మనీ తెలిపారు. అక్రమ వలసదారులను గుర్తించేందుకు మరిన్ని దాడులు నిర్వహించనున్నామని ఆమె హెచ్చరించారు.

No comments: