Sep 28, 2011

సెన్సెక్స్ దూకుడు

ఇటీవల వరుస నష్టాలను చవిచూస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒక్కసారిగా కదంతొక్కాయి. ఇందుకు పెద్ద ఎత్తున జరిగిన షార్ట్ కవరింగ్ దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. భారీ స్థాయిలో పుంజుకున్న ప్రపంచ మార్కెట్లు సైతం ఇందుకు ప్రోత్సాహమిచ్చాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 473 పాయింట్లు దూసుకెళ్లి 16,524 వద్ద ముగిసింది. వెరసి ఈ ఏడాదిలోనే మూడో పెద్ద ర్యాలీ నమోదైంది! ఈక్విటీ లావాదేవీలపై పన్ను తగ్గింపు ప్రతిపాదన వార్తలు దేశీయంగా ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నివ్వగా, రుణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పటిష్టమైన కార్యాచరణను సిద్ధం చేస్తామంటూ యూరోపియన్ ఆర్థిక మంత్రులు ప్రకటించడం విదేశీ మార్కెట్లకు ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో మొదటినుంచీ లాభాలతో ప్రారంభించిన పరుగును చివరి వరకూ మార్కెట్లు కొనసాగించాయి. ఇదే బాటలో నిఫ్టీ కూడా 136 పాయింట్ల జంప్‌తో 4,971 వద్ద ముగిసింది.

రియల్టీ, ఐటీ హవా

బీఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా, రియల్టీ అత్యధికంగా 4.7% పుంజుకుంది. డీఎల్‌ఎఫ్ 8.5% జంప్ చేయగా, యూనిటెక్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్ 4.5-3.7% మధ్య లాభపడ్డాయి.
ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో 4-2.4% మధ్య పుంజుకోవడంతో ఐటీ ఇండెక్స్ 3.6% బలపడింది. ఈ బాటలో ఆయిల్, వినియోగ వస్తువులు, బ్యాంకింగ్, ఆటో, మెటల్స్ 3.5-2.6% మధ్య పురోగమించాయి.

ఆర్‌ఐఎల్ 5%కు పైగా ఎగసి ర్యాలీకి మద్దతిచ్చింది.

మిగిలిన బ్లూచిప్స్‌లో టాటా మోటార్స్ 6% దూసుకెళ్లగా, హిందాల్కో, బీహెచ్‌ఈఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోల్ ఇండియా, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ 4.3-2.3% మధ్య జంప్ చేశాయి.

మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% బలపడ్డాయి.

ట్రేడైన షేర్లలో 1,873 లాభపడగా, 952 నష్టపోయాయి. బీఎస్‌ఈ క్యాష్‌లో రూ. 2,387 కోట్ల టర్నోవర్ నమోదు కాగా, ఎన్‌ఎస్‌ఈలో రూ. 9,780 కోట్లు, డెరివేటివ్స్‌లో దాదాపు రూ. 1.66 లక్షల కోట్లు జరిగింది.

ప్రపంచ మార్కెట్ల జోరు..

ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా 5% జంప్ చేయగా, హాంకాంగ్ 4%, జపాన్ 3% ఎగశాయి. ఇక యూరప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్, యూకే 4-3% మధ్య లాభాలతో ట్రేడవుతున్నాయి. అమెరికా ప్రధాన సూచీలు 2% లాభాలతో ట్రేడవుతున్నాయి. 16 నెలల్లో విదేశీ మార్కెట్లు ఈ స్థాయిలో లాభపడడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ ఏడాది మూడో పెద్ద ర్యాలీ

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం జరిపిన ర్యాలీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో అతిపెద్ద జంప్. అంతక్రితం సెన్సెక్స్ ఆగస్ట్ 29న 567 పాయింట్లు దూసుకెళ్లగా, జూన్ 24న 513 పాయింట్లు ఎగసింది. వెరసి మంగళవారం వచ్చిన 473 పాయింట్ల ర్యాలీ 2011-12 ఏప్రిల్1 తరువాత మూడో స్థానంలో నిలిచింది!

ఒక్క రోజులో రూ. 1.3 లక్షల కోట్లు

మంగళవారం ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల మొత్తం సంపద ఒక్క రోజులో రూ. 1,30,000 కోట్లు పెరిగింది. దీంతో ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.60,24,887 కోట్లకు చేరింది. తాజాగా పెరిగిన రూ.1.3 లక్షల కోట్లలో సెన్సెక్స్ 30 షేర్ల నుంచే రూ. 80,000 కోట్లు జతైంది. 

No comments: