Sep 20, 2011

సకల జనుల సమ్మెపై హైకోర్టు సీరియస్‌ !

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: తెలంగాణాలోని పది జిల్లా లలో జరుగుతున్న సకల జనుల సమ్మెపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ సమ్మెకారణంగా సామాన్యప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ నారాయణ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వాజ్యాన్ని విచా రణకు స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, డీజీపీ, సిఎస్‌లతో పాటు కేసీఆర్‌, కోదండరామ్‌రెడ్డి, ఉద్యోగుల-టీ- జేఏసీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌లకు నోటీసులు జారీ చేసింది.ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తక్షణం ప్రారంభించాలని కోరుతూ తెలంగాణాలోని అన్నిరాజకీయపార్టీలతో పాటు, సకల విభాగాల ఉద్యోగులు ఏకమై సకల జనుల సమ్మెను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అయితే ఇలాంటి నిరవధిక సమ్మెలు, బంద్‌ల కారణంగా సామాన్యప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారంటూ నారాయణ పిటిషన్‌ను దాఖలు చేశారు. గత వారం దాఖలైన ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారం నాడు పలువురు రాజకీయ, అధికార అనధికార ప్రముఖులతో పాటు తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారికి కూడా నోటీసులు జారీ చేసింది. ఇందులో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వ ముఖ్యకార్యద ర్శి, డిజిపిలతో పాటు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌, తెలంగాణా ఉద్యమ పొల్టికల్‌ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ రెడ్డి, ఉద్యోగ-టీ-జేఏసీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌లకు ఈ నోటీసులు జారీ చేసింది. సకల జనుల సమ్మె నివారించేందుకు, నిరోధించేందుకు ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలు, తీసుకున్న చర్యలను వివరించాలని ప్రభుత్వానికి, సీఎస్‌కు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. వీటికి సంబంధించి తక్షణం సమాధానాలు కౌంటర్‌ రూపంలో దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

No comments: