‘‘ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టిక్కెట్స్ అమ్మాలి. అప్పుడే ప్రేక్షకులు
థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు. లేకపోతే పైరసీ సీడీలను చూస్తారు.
బ్లాక్లో టిక్కెట్లు అమ్మి ప్రేక్షకుల జేబుకి చిల్లుపెట్టి, ఎగ్జిబిటర్లు,
ప్రొడ్యూసర్లు లాభం పొందుతున్నారు. ఆ రకంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం
వారి జేబులోకి వెళుతోంది’’ అని నిర్మాతల సెక్టార్ చైర్మన్, నిర్మాత
నట్టికుమార్ అన్నారు. శనివారం ఉదయం హైదరాబాదులోని ప్రెస్క్లబ్లో జరిగిన
సమావేశంలో ఆయన మరికొన్ని విషయాలపై కూడా బాహాటంగా మాట్లాడారు.
‘‘పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు బ్లాక్లో టిక్కెట్లు అమ్మి సొమ్ము
చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం థియేటర్ల యజమానులు
వ్యవహరించడం లేదు. తాజాగా విడుదలైన ‘దూకుడు’ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. కొన్ని విషయాల్లో ఇలా నేను నోరెత్తకుండా ఉండటానికి ఒక ప్రముఖ
నిర్మాత కమ్ పంపిణీదారుడు, మరో ప్రముఖ పంపిణీదారుడు నాకు 2 కోట్లు
ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని తెలిసింది. ఆ డబ్బు తీసుకుని నేను
వారివైపే మాట్లాడతానని వారు అంటున్నారట. నాకు డబ్బిచ్చిన మాట నిజమే అయితే ఆ
విషయాన్ని ప్రెస్ ముందు చెప్పాలి. ఆ ప్రచారాన్ని మానుకోకపోతే వారి ఇళ్లను
నేను ముట్టడిస్తా’’ అని ఘాటుగా స్పందించారు నట్టికుమార్. ఈ సమావేశంలో ఇంకా
మోహన్గౌడ్, సీఎన్ రావు, తోట కృష్ణ, శంకర్ తదితరులు కూడా పాల్గొన్నారు.
|
|
No comments:
Post a Comment