Oct 6, 2011

సంక్షేమం దిశగా దూకుడు...


సమస్యలతో సతమతమవుతున్న ఈ సంక్షోభ సమయంలో సైతం ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దూకుడుగా వెళుతున్నారు. ధైర్యంగా నిర్ణయాలు తీసు కుంటున్నారు. తాను ఏ ప్రాంతానికీ చెందని వ్యక్తినని, తనకు మూడు ప్రాంతాలూ సమాన మేనన్న సంకేతాలిస్తున్నారు. సకల జనుల సమ్మె, తెలంగాణ ఉద్యమ క్రమంలో చెలరేగు తున్న విధ్వంసం, తనకు వ్యతిరేకంగా ఏకమవు తున్న పార్టీలోని అంతర్గత శక్తులు పెడుతున్న పరోక్ష ఇబ్బందులను లెక్కచేయకుండా దూకుడుగా అడుగులేస్తున్నారు.

సంక్షోభ సమయంలో సంక్షేమ మంత్రం జపిస్తు ఒత్తిళ్లలోనూ బలవంతుడవుతున్నారు.సకల జనుల సమ్మె, తెలంగాణ ఉద్యమం వల్ల రాష్ట్ర ఖజానాకు రావలసిన ఆదాయం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఖజానాకు మూలస్తంభాలుగా పేరున్న ఎకై్సజ్‌, రెవిన్యూ, కమర్షియల్‌, రిజిస్ట్రేషన్‌ విభాగాలను సీఎం పరుగులు పెట్టిస్తున్నారు. దానితో పన్నుల వసూలు 95 శాతం వరకూ వసూలయింది. ఇంత క్లిష్ట సమయంలోనూ వాణిజ్య పన్నులు ఈ స్థాయిలో వసూలు కావడం చూస్తే ముఖ్యమంత్రి ఖజానాపై ఎంత సీరియస్‌గా సమీక్షలు నిర్వహిస్తున్నారో స్పష్టమవుతోంది. సమ్మె సందర్భంగా చెలరేగుతున్న విధ్వంసాల వల్ల నష్టపోతున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమ యిందని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న భావన సామాన్య ప్రజల్లో నెలకొంది. ఈ విషయాన్ని గ్రహించిన కిరణ్‌.. విధ్వంసకారులపై ఉక్కుపాదం మోపాలని, కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

మూడురోజుల క్రితం నల్లగొండ జిల్లా నకిరేకల్‌ వద్ద విజయ వాడ నుంచి వచ్చే బస్సులపై రాళ్లు రువ్వి ప్రజలను భయభ్రాంతు లకు గురిచేసిన వైనం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న భావనను గమనించిన కిరణ్‌.. వారిపై కేసులు పెట్టాలని ఆదేశించారు. భద్రత ఇచ్చేందుకు నిరాకరించిన డీస్పీ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఎస్పీని నివేదిక కోరారు. ఫలితంగా స్పందించిన పోలీసులు అల్లరిమూకలపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు. దీని ద్వారా.. విధ్వంసకారులను కఠినంగా అణచివేస్తామన్న సంకేతాలు ఇచ్చారు. గత కొద్దిరోజుల నుంచి ఆయన డీజీపీ, ఇతర ఉన్నతాధి కారులతో శాంతిభద్రతలపైనే తరచూ భేటీ అవుతున్నారు.

సమ్మె వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించే అంశాన్ని ఆయన సవాలుగా తీసుకున్నారు. వాటిని తొలగించే క్రమంలో తనపై ఎన్ని విమర్శలు వస్తున్నా, చివరకు తెల,గాణ వ్యతిరేకి అన్న ముద్ర వేస్తున్న లెక్కచేయకుండా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 9,10,11న రైల్‌రోకో ఆందోళనకు జాక్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. పోలీసుల రక్షణతో రైళ్లు నడిపించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై తాజాగా డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ అయ్యారు. సమ్మెను ప్రతిష్ఠాత్మ కంగా తీసుకున్న కిరణ్‌.. ప్రజలను ఇబ్బందుల నుంచి బయట పడేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని, ప్రభుత్వం, పోలీసులు భద్రత కల్పిస్తాయన్న భరోసా ఇస్తున్నారు.

ఇన్ని చిక్కులు, పార్టీలో అంతర్గత సమస్యలు చికాకు పెడుతున్నప్పటికీ సంక్షేమ పథకాల్లో మాత్రం ఎవరూ ఊహించని దూకుడుగా వెళుతున్నారు. కిలోరూపాయి బియ్యం పథకాన్ని వచ్చే నెల ఒకటి నుంచి ప్రారంభించేందుకు కిరణ్‌ సర్కారు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల 2.26 కోట్ల కుటుంబాలకు, 7.5 కోట్ల జనాభాకు భారీ స్థాయిలో లబ్థి చేకూరనుంది. ఈ పథకంతో కాంగ్రెస్‌ భవిష్యత్తుకు ఇక తిరుగు ఉండదని, రూపాయి బియ్యం పథకం అమలయితే జనం ఇక వైఎస్‌ను మర్చిపోతారన్న ధీమాతో ఉన్నారు. లక్షరూపాయల వరకూ పంట రుణం తీసుకునే రైతులకు సున్నా వడ్డీ పథకం వల్ల 95 లక్షల మంది లబ్థి పొందనున్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం 10 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావడానికి ప్రవేశపెట్టిన ఇందిర జలప్రభ పథకాలతో దూకుడుగా వెళుతున్నారు.

వీటితో బడుగు, బలహీనవర్గాలు కాంగ్రెస్‌కు శాశ్వత ఓటు బ్యాంకుగా మారతారన్న అంచనా, ఒకేరోజు లక్ష ఉద్యోగాల వల్ల నిరుద్యోగులు కాంగ్రెస్‌ వైపు ఆకర్షితులవుతారన్న ఆత్మవిశ్వాసం కిరణ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు వెన్నాడుతున్నా వాటిని లెక్కచేయకుండా సంక్షేమ పథకాలతో దూకుడుగా వెళుతున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు సంక్షేమ పథకాలతో జవాబు చెప్పాలన్న వైఖరితో కనిపిస్తున్నారు. కేంద్రం నుంచి అదనంగా గ్యాస్‌, విద్యుత్‌ను రాబట్టడం ద్వారా కేంద్రంలో తనకున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెబుతోంది.

సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మిగిలిన వారిి భిన్నంగా వ్యవహరిస్తున్న కిరణ్‌.. అందుకు కారకులైన వారిపైనా ఎదురుదాడిలో రాటు తేలుతున్నా రు. మొట్టమొదటిసారిగా కేసీఆర్‌, కోదండరామిరెడ్డిపై కిరణ్‌ విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితికి, రైతుల దుస్థితికి, పంటనష్టాలకు, విద్యుత్‌ కోతకు వారిద్దరే కారణమంటూ విరుచుకుపడుతున్నారు. ఇది టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయాలా వద్దా అన్న సందిగ్థంలో ఉన్న పార్టీ శ్రేణులకు ఒక టానిక్‌లా పరిణమించింది. దానితో టీఆర్‌ఎస్‌, జాక్‌ నేతలు కూడా ఇరకాటంలో పడ్డారు.

ఇక రాజీనామాస్త్రాలతో సర్కారును ఇబ్బంది పెడుతున్న మంత్రు లను బుజ్జగించకూడదన్న గట్టి పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. మంత్రులుగా ఉంటూనే సర్కారును, పార్టీని విమర్శిస్తున్న వారిని బుజ్జగిస్తే చెడు సంకేతాలు వెళతాయని భావిస్తున్న వారి రాజీనామా లను ఆమోదించాలని నిర్ణయించారు. దాని ద్వారా తాను ఒత్తిళ్లకు తలొగ్గే నేతను కానన్న సంకేతంతో పాటు, రాజీనామా చేయనున్న మంత్రులకు ఒక హెచ్చరిక పంపిస్తున్నారు.

కోమటిరెడ్డి రాజీనామాపై ఎలాంటి బుజ్జగింపులు లేకుండా ఆయన రాజీనామాను ఆమోదించాలని గవర్నర్‌కు కిరణ్‌ సిఫారసు చేయడం, వెంటనే ఆయన రాజీనామాను గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించడం చకచకా జరిగిపయాయి. గతంలో జూపల్లి కృష్ణారావు రాజీనామా వ్యవహారంలోనూ కిరణ్‌ ఇదేవిధంగా వ్యవహరించారు. దాని ద్వారా సర్కారును ఇబ్బందిపెట్టే వారెవరినీ తాను ఎవరినీ బుజ్జగించేలేదన్న స్పష్టమైన సంకేతం పంపారు.మొండితనం, అనుకున్నది చేయడంలో కిరణ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ బాటలోనే నడుస్తున్నట్లు ఆయన నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. పథకాల రూపకల్పన, విపక్షాలపై ఎదురు దాడి, వారిపై మానసిక యుద్ధం చేయడం వంటి ఎత్తుగడ అంతా వైఎస్‌నేనని కనిపిస్తోంది.

No comments: