Oct 30, 2011

టిఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల జంప్‌!

  • త్వరలో టి రాజయ్య, సోమారపు, జూపల్లి
  • ఎంపీలు మందా, రాజయ్య చేరే అవకాశం?
టిఆర్‌ఎస్‌ పార్టీలోకి అధికారిక కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు తెలిసింది. తెలంగాణా అంశంపై కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడాన్ని నిరసిస్తూ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వారిలో వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే టి రాజయ్య, మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్‌పార్టీకి అనుబంధంగా ఉన్న రామగుండం స్వతంత్ర ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రెండు మూడు రోజుల్లో టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిసింది. శనివారం జూపల్లి, సోమారపు ఇద్దరు తమతమ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశమై టిఆర్‌ఎస్‌లోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టిఆర్‌ఎస్‌లోకి జూపల్లి చేరనున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వస్తే వాటిని ఆయన ఖండించారు. టిఆర్‌ఎస్‌లో చేరే ప్రసక్తే లేదని చెప్పిన మూడోరోజుకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎంపీలు మందా జగన్నాథం, సిరిసిల్ల రాజయ్య కూడా టిఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి.

No comments: