
మనకు నిఖార్సుగా వ్యవహరించే ఆడిటింగ్ వ్యవస్థ ఉండాలి.
కేంద్ర మంత్రివర్గ సభ్యుల సంపదతో అది ప్రారంభం కావాలి. అధికారంలో ఉన్న
సమయంలో నాయకులు రోజుకు యాభై లక్షల రూపాయల ఆదాయం ఎలా సంపాదించగలుగుతారు?
వారిలో ఎక్కువ మంది తమ సంపదను అధికారంలో ఉన్న సమయంలో మితిమీరి ఎలా
పెంచుకోగలిగారు? దీనిపై మనకు స్పష్టమైన సమాధానాలు కావాలి. ఆస్తులను
ప్రకటించినంతమాత్రాన సరిపోదు. ఆ ఆస్తులను ఎలా సంపాదించారో కూడా
వెల్లడించాలి.
ఎయిరిండియా పరిస్థితి అంత బాగు లేకపోవచ్చు. ఈ
లోహ విహంగం అప్పుల మేఘాల్లో భారంగా ఎగురుతూ ఉండొచ్చు. కానీ, ఒకప్పటి పౌర
విమానయాన శాఖా మంత్రి ప్రఫుల్ పటేల్ (ఆ శాఖలో ఉన్నంతకాలం)కు మాత్రం ఇది
అపారమైన సిరిసంపదలు పోగేసుకునే రాజ హంసలా మారింది. 2009మే, 2011 ఆగస్టు
మధ్య గల 28 మాసాల కాలంలో పటేల్ రోజుకు సగటున 5లక్షల ఆస్తులు
పోగేసుకున్నాడు.వాస్తవానికి ఈ ఆదాయం ఇంకా అనేక రెట్లు అధికంగా ఉండొచ్చు. ఈ
అంకెలు ఆయనంటే గిట్టనివారెవరో సృష్టించినవి కావు. ఎన్నికల సంఘానికి, ప్రధాన
మంత్రి కార్యాలయానికి ఆయన సమర్పించిన అఫిడవిట్లలో వెల్లడించినవే. 2009 మే
నెలలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల మొత్తం విలువ
రు.79 కోట్లుగా పటేల్ చూపారు.ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయానికి (పిఎంఓ)కి
అందజేసిన అఫిడవిట్లో తన ఆస్తుల విలువను రు.122 కోట్లుగా చూపారు. ఈ
వివరాలను తాజాగా ఆన్లైన్లో కూడా పెట్టారు. రోజుకు అయిదు లక్షల చొప్పున
ఇంత భారీగా పటేల్ ఆస్తులు పెరగడం ఆ 28 మాసాల కాలంలో జరిగిందే.(అయినా
పటేల్ దూకుడుకి తగినట్లుగా ఇది లేదనే చెప్పాలి).
ఎయిర్ ఇండియా
తన సిబ్బందికి జీతాలు చెల్లించడానికి నానా అవస్థలు పడుతుంటే, ఆ శాఖ
మంత్రిగా ఉన్న కాలంలో పటేల్ ఆస్తులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా
పెరిగిపోయాయి. అవి ఎంతగా పెరిగిపోయాయంటే ఈయన రోజువారీ సంపాదించిన ఆదాయం
కొంతమంది ఎయిర్లైన్స్ ఉద్యోగుల సాంవత్సరిక ఆదాయకం కంటే ఎక్కువే ఉంటుంది.
పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ బోర్డు (బిఐఎఫ్ఆర్) మాజీ అధిపతి
చెప్పినట్లు దశాబ్దం క్రితంతో పోల్చితే ఇప్పుడు ఖాయిలా పడిన పరిశ్రమల సంఖ్య
పెరిగింది. అదే సమయంలో వాటి యజమానుల ఆస్తులు అంతకన్నా వేగంగా అనేక రెట్లు
పెరిగాయి. భారతీయ పేదలకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు ఎంతగా దిగజారాయో
తెలుసుకునేందుకు ఇదొక మచ్చు తునక. ప్రజలు అనేక కడగండ్లతో సతమతమవుతుంటే
మంత్రులు కోట్లకు పడగలెత్తుతున్నారు. (కార్పొరేట్ అధిపతులు పోగేసుకున్న
సంపదల గురించి వివరించాలంటే అది మరో పెద్ద గాథ అవుతుంది).పటేల్ సేవలకు
ఇదొక బహుమానం! ఇది చాలదన్నట్లు సహాయ మంత్రిగా వున్న ఆయనకు కేబినెట్ హోదాగల
భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖను అప్పగించారు.
కేంద్ర
మంత్రివర్గంలోని మంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్
రిఫార్మ్స్ (ఎడిఆర్), నేషనల్ ఎలక్షన్వాచ్ (ఎన్ఇడబ్ల్యు) క్షుణ్ణంగా
విశ్లేషించినప్పుడు ఈ సంగతి బయటపడింది. కేంద్రమంత్రి ప్రఫుల్ పటేల్
ఆస్తులు 28 మాసాల కాలంలో సగటున నెలకు 7.3 కోట్ల నుంచి 10.6 కోట్ల వరకు
పెరిగినట్లు ఈ పరిశీలనలో తేలింది. ప్రఫుల్ పటేల్ కేంద్ర మంత్రివర్గంలో
అత్యంత సంపన్నుడైన మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత స్థానం డిఎంకెకు చెందిన
సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి జగద్రక్షకన్కు దక్కుతుంది. ప్రఫుల్
ఆస్తులు 53 శాతం పెరగ్గా జగద్రక్షకన్ ఆస్తులు 1,092 శాతం పెరిగాయి.
ఎడిఆర్ విశ్లేషణ ప్రకారం ఆయన జగద్రక్షకన్ ఆస్తులు 2009లో రు. 5.9 కోట్లు
ఉండగా ప్రస్తుత సంవత్సరం అవి రు. 70 కోట్లకు పెరిగాయి.
ఇదే
సమయంలో కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయమంత్రి మురళీ
దేవరా ఆస్తులు రెట్టింపయ్యాయి. ఆయన ఆస్తులు రు. 17 కోట్ల నుండి రు. 33
కోట్లకు పెరిగాయి. తనకు రు. 8.8 కోట్ల ఆస్తులున్నట్లు 2004 ఎన్నికల సమయంలో
సమర్పించిన అఫిడవిట్లో దేవరా పేర్కొన్నారు. గత ఏడు సంవత్సరాలుగా రోజుకు
సగటున లక్ష రూపాయల చొప్పున, అంటే మూడు రెట్లు పెరగడం చిన్న విషయం ఏమీ కాదు.
ఈ విషయంలో దేవరా వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ను అధిగమించారు. పవార్
చూపిన ఆస్తుల విలువ రు. 12.5 కోట్లు. అయితే ఇవి నెలసరి ఆదాయ లెక్కలే
అయిఉంటాయన్న ప్రచారమూ ఉంది. అత్యంత శక్తిసంపన్నునిగా పేరుగాంచిన పవార్
కంటే దేవరా రెండున్నర రెట్లు అధికంగా ఆస్తులు కలిగి ఉన్నారు. 2009లో కూడా
పవార్ కంటే దేవరా సంపన్నవంతుడు. అప్పటినుండి ఆయన ఆస్తులు 90 శాతం
పెరిగాయి.
కేంద్ర మంత్రివర్గంలో ఆస్తులను స్వల్పంగా
పెంచుకున్నవారిలో మరో వ్యక్తి విలాసరావు దేశ్ముఖ్. 2009 నుండి ఆయన ఆస్తుల
విలువ కేవలం రు. 1.73 కోట్ల మేరకు పెరిగింది. దేశ్ముఖ్ ధరిత్రి శాఖ
మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. (రియల్ ఎస్టేట్ రంగంలో విశేష పరిజ్ఞానం
కలవారిని మహారాష్ట్రలో ఈ విధంగా వ్యవహరిస్తారు. మన్మోహన్ ప్రభుత్వంలో
క్రికెట్ కాకస్ పరిస్థితి బాగానే ఉంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
మంత్రి, ఐపిఎల్ కొత్త బాస్ రాజీవ్ శుక్లా ఆస్తులు ఈ 28 నెలల్లో రు. 22
కోట్ల మేరకు పెరిగాయి. 2009లో ఆయన ఆస్తుల విలువ ఏడు కోట్ల రూపాయలు కాగా ఈ
ఏడాది రు. 30 కోట్లు.
మంత్రులుగా ఉన్న వారి ఆస్తులు మాత్రమే
పెరగడం లేదు. ఆస్తుల పెరుగుదల కేంద్ర మంత్రులకే పరిమితం కావడం లేదు.
గిన్నీస్ రికార్డుల పుస్తకంలో నమోదవుతున్న రికార్డుల్లో అధిక భాగం నా సొంత
రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్కు చెందినవిగా ఉంటున్నాయి.
(వాస్తవానికి ఈ జాబితాలో మూడో రాష్ట్రం కూడా ఉంది. అదే జగద్రక్షకన్కు
చెందిన తమిళనాడు).ఆంధ్రప్రదేశ్ విషయానికే వద్దాం. వైఎస్ జగన్మోహన్
రెడ్డి అధికారంలో లేరు. అయినప్పటికీ ఆయన పారిశ్రామికంగా అభివృద్ధి
చెందడానికి అది అడ్డం కాలేదు. ఈ ఏడాది ఏప్రిల్తో ముగిసిన 24 మాసాల్లో తన
ఆస్తుల విలువ రు. 357 కోట్ల రూపాయలు పెరిగినట్లు ఆయనే ప్రకటించుకున్నారు.
2009 ఏప్రిల్లో ఆస్తుల విలువ రు. 72 కోట్లు మాత్రమే. అంటే రోజుకు యాభై
లక్షల రూపాయల మేరకు ఆయన ఆదాయం పెరిగింది. అన్ని రంగాల్లో తీవ్ర ఒత్తిళ్లను
ఎదుర్కొంటున్న ఆయన ఈ మేరకు అభివృద్ధి సాధించారంటే అది తక్కువ అభివృద్ధి ఏమీ
కాదు. తదుపరి తరం రాజకీయాల్లో చురుకుదనం గురించి రాజకీయ పండితులు
చెబుతున్న విషయం ఇప్పుడు మీకు అర్థం అయి ఉంటుంది.
ఒక్క చంద్రబాబు
నాయుడు ఆస్తులే తగ్గిపోయాయి. అన్నా హజారే రేకెత్తించిన చైతన్యం నేపథ్యంలో
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తన ఆస్తులను ప్రకటించారు. ఆయన ఆస్తులు నలభై
లక్షల రూపాయలు కూడా లేవు. జీవనోపాధి విషయమై ఆయన తక్షణం ఆందోళన చెందాల్సిన
అవసరం లేదు. ఆయన భార్య పేర రు. 40 కోట్ల ఆస్తి ఉంది. అయితే జగన్మోహన్
రెడ్డి ప్రాభవం పెరుగుతోంది. నాయుడు ప్రాభవం తగ్గిపోతోంది. చంద్రబాబు
అదృష్టం అనుకూలంగా లేకపోయినా ఆయన అకౌంటెంట్లు మాత్రం ఆయన పట్ల ఎంతో ఔదార్యం
ప్రదర్శిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఖరీదైన ప్రాంతమైన
జుబ్లీహిల్స్లో ఆయనకు గల ఆస్తి (1,125 చదరపు గజాలు లేదా పది వేల చదరపు
అడుగుల స్థలం) విలువను రు. 23.2 లక్షలుగా మాత్రమే వారు లెక్కేశారు. పది వేల
చదరపు అడుగుల ఇంటిని ఆంత వ్యయంతో నిర్మించడం అసాధ్యమని వాదిండం వృథా
ప్రయాస మాత్రమే. 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆ ఆస్తి విలువను తొమ్మిది
కోట్లుగా ప్రకటించలేదా? ఈ సారి మార్కెట్ విలువను కాకుండా అది తాను
సేకరించడానికి అయిన వ్యయాన్ని మాత్రమే ప్రకటించారు. మార్కెట్ విలువ
ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది.
ఈ మొత్తం వ్యవహారం నుండి మనం అనేక
పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. చురుకైన అకౌంటెంట్ల అవసరం ఎంతైనా ఉంది.
ఆస్తులు, సంపద పెరిగిపోవడం ఒక్క మంత్రులకు మాత్రమే పరిమితం కాదు. ఎంపీలు,
ఎంఎల్ఎలకు కూడా విస్తరించింది. ప్రధాన రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా
కాంగ్రెస్, బిజెపి, రాష్ట్రాల్లో పెద్ద పార్టీలకు చెందిన అనేక
స్థాయిల్లోని రాజకీయ నాయకుల ఆస్తులు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి.
పార్లమెంటు, ప్రతి రాష్ట్రంలోని శాసనసభల్లో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది.
మహారాష్ట్రలో 2004లో వీరి సంఖ్య 108 ఉండగా 2009 నాటికి 186కు పెరిగింది.
కేంద్ర మంత్రివర్గంలో నాల్గింట మూడు వంతుల మంది కోటీశ్వరులే. వీరి
ఆస్తుల్లో ఎక్కువ భాగం అధికారంలో ఉండగా పెరిగినవే.
ఎడిఆర్లు,
ఎన్ఇఎస్ల ఒత్తిడి, ప్రజల ఆగ్రహం కారణంగా ఇందుకు సంబంధించిన సమాచారం నేడు
ఎక్కువగా అందుబాటులోకి వస్తోంది. ఇది నిజంగా ప్రశంసనీయమైన విషయం. వారు
చెల్లించిన పన్నులను కూడా ఈ ప్రకటనల్లో జోడించాలి. అందువల్ల ఈ గణాంకాల
గురించి వారికి మరింత స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ప్రజాసేవలో పారదర్శకత
చోటుచేసుకోవాలంటే, అన్ని రకాల ఆదాయ వివరాలను ఆన్లైన్లో ప్రచురించే
ఏర్పాటు ఉండాలి. మనం ప్రవేశపెట్టాల్సిన సంస్కరణల్లో ఇది అత్యంత ముఖ్యమైంది
కావాలి. దగా చేసిన వారికి పెనాల్టీలు విధించాలి. తమకు గల 12 రెసిడెన్షియల్
భవనాలను ఆస్తుల జాబితాలో ప్రకటించని మంత్రుల జాబితా ఎడిఆర్లో ఉంటుంది.
మనకు
నిఖార్సుగా వ్యవహరించే ఆడిటింగ్ వ్యవస్థ ఉండాలి. కేంద్ర మంత్రివర్గ
సభ్యుల సంపదతో అది ప్రారంభం కావాలి. అధికారంలో ఉన్న సమయంలో నాయకులు రోజుకు
యాభై లక్షల రూపాయల ఆదాయం ఎలా సంపాదించగలుగుతారు? వారిలో ఎక్కువ మంది తమ
సంపదను అధికారంలో ఉన్న సమయంలో మితిమీరి ఎలా పెంచుకోగలిగారు? దీనిపై మనకు
స్పష్టమైన సమాధానాలు కావాలి. ఆస్తులను ప్రకటించినంతమాత్రాన సరిపోదు. ఆ
ఆస్తులను ఎలా సంపాదించారో కూడా వెల్లడించాలి.
పట్టణాల్లో రోజుకు
ఇరవై రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను రూపాయల తలసరి మొత్తాన్ని
పేదరికాన్ని నిర్ధారించేందుకు కటాఫ్ మొత్తంగా ప్రకటిస్తూ ప్రణాళికా సంఘం
గత ఏప్రిల్లో సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. దీనిని ఇరవై అయిదు
రూపాయలకు పెంచవచ్చుననే ఔదార్యాన్ని ఇప్పుడు ప్రకటించింది. డాక్టర్
అర్జున్ సేన్ గుప్తా నేతృత్వంలో అసంఘటిత రంగంలోని జాతీయ పారిశ్రామిక
సంస్థల కమిషన్ ఇచ్చిన నివేదికను గుర్తు చేసుకోండి. 83.6 కోట్ల మంది
భారతీయులు రోజుకు ఇరవై, అంతకంటే తక్కువ ఆదాయంపై జీవిస్తున్నారని ఆ నివేదిక
పేర్కొంది. మన కోటీశ్వరుల క్లబ్లు వీరికి ఏ విధంగా ప్రాతినిధ్యం
వహిస్తాయి? వీటినిఎలా నివారించగలుగుతాం? మనం దీని గురించి ఆలోచించాలి. గత
ఇరవై ఏళ్లలో చోటుచేసుకున్న మార్పులు కోటీశ్వరులు తప్ప మిగిలినవారు
ఎన్నికల్లో పోటీచేయలేని పరిస్థితిని సృష్టించాయి. కోటీశ్వరులు మాత్రమే
ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించగల పరిస్థితులు నెలకొన్నాయి. పేదల
పరిస్థితి ఎంతగా దిగజారితే మన మంత్రుల సంపద అంతగా పెరుగుతుంది.
No comments:
Post a Comment