Sep 4, 2011

ఉపాధ్యాయుల చేతిలో దేశ భవిష్యత్తు !


జస్టిస్‌ బి. చంద్రకుమార్‌ Sat, 3 Sep 2011, IST

ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండటం ఎంతో అవసరం. ఇది వారి కోసమే కాదు విద్యార్థుల కోసం, దేశం కోసం. అధ్యాపకులు ఇతర వ్యాపకాలకో, డబ్బు సంపాదనకో ప్రాధాన్యత ఇవ్వకూడదు. వ్యక్తిగతమైన ఇబ్బందులు ఉండవచ్చు. లేదా విద్యా విధానం లోపభూయిష్టంగా ఉండవచ్చు లేదా అందరి దృష్టి ర్యాంకుల మీద, ఫలితాల మీదనే ఉండవచ్చు. విద్యార్థులు, తల్లిదండ్రులు తాత్కాలిక ప్రయోజనాలనే కోరవచ్చు. ఏది ఏమైనా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడంతోపాటు వారిని తీర్చిదిద్దే బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.

దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలో ఉంది. ఎందుకంటే, నేటి విద్యార్థులను తీర్చిదిద్దే మహత్తర అవకాశం ఉపాధ్యాయులకే ఉంది. విద్యార్థులలో విజ్ఞానాన్ని, వివే కాన్ని, భవిష్యత్తులో వారు చేయబోయే పనిలో నైపుణ్యాన్ని పెంపొందించి జీవన గమనాన్ని కొనసాగించడానికి, అలాగే వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది మానవతా విలువల్ని, దేశభక్తిని పెంపొందించడానికి విద్య అత్యంతావశ్యకం.
అందుకే, విద్యను బోధించే గురువుపై గురుతరమైన బాధ్యత ఉంది. విద్యార్థులలోని అంతర్లీనమైన శక్తియుక్తుల్ని బయటకు తీసి వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలిగేది ఉపాధ్యాయులే. ఒక రాయిని ఒక శిల్పి ఎలా అందమైన విగ్రహంగా తీర్చిదిద్దుతాడో, విద్యార్థులను కూడా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అదే విధంగా తీర్చిదిద్దాలి.
పిల్లలు తల్లిదండ్రులను,ఉపాధ్యాయులను, పొరుగువారిని, పెద్దలను చూసి అనుకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు తమ చుట్టూ ఉన్న విషయాలను పరిశీలించడం ద్వారా నేర్చుకుంటారు. పుస్తకాలు, పత్రికలు, టి.వి, ఇంటర్‌నెట్‌, సినిమాలు ఏవైనా కావచ్చు. విద్యార్థులపై అవి ఎంతో కొంతమేర ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా పిల్లలు అభిప్రాయాలను ఏర్పరచుకునే దశలో ఇటువంటివి ప్రధాన పాత్ర వహిస్తాయి.
దేశభక్తిని, ధైర్యాన్ని, త్యాగాన్ని ప్రబోధించే పుస్తకాలు చదివినప్పుడు లేదా అటువంటి సందేశాలనందించే సినిమాలు, సీరియల్స్‌ చూసినప్పుడు మంచి భావాలు కలుగుతాయి. అదే సమయంలో హింసా ప్రవృత్తిని కల్గించే సినిమాలు, లేదా మానసిక వికారాలు కల్గించే సాహిత్యం, లేదా మానవ సంబంధాల పట్ల అసహ్యాన్ని కల్గించి, స్వార్థమే పరమార్థమని చెప్పే సీరియల్స్‌ చూసినప్పుడు పిల్లలపై వాటి చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే, మనం విద్యార్థులకు ఎటువంటి పుస్తకాలను, సమాచారాన్ని, సినిమాలను, సీరియల్స్‌ను, ఇంటర్‌నెట్‌లో లభ్యమయ్యే విషయాలను అందుబాటులో ఉంచుతున్నామో గమనించాలి. విద్యార్థుల్లో మంచి భావాలను పెంపొందించే విషయాలను ఏ విధంగా అందుబాటులో ఉంచవచ్చో పరిశీలించాలి. ఉపాధ్యాయులకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాలో, విద్యను ఎలా బోధించాలో, వారిలో మంచిని, మానవత్వాన్ని ఎలా పెంపొందించాలో ప్రతి ఉపాధ్యాయుడు ఆలోచించి తగిన ప్రణాళిక వేసుకోవాలి.
ప్రతి ఉపాధ్యాయుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. తన జీవితంలో కొంతమంది విద్యార్థులనైనా గొప్పవారిగా తీర్చిదిద్దుతానని, వారిలో దేశభక్తిని, నైతిక విలువల్ని పెంపొందిస్తానని ప్రతిన బూనాలి. గొప్పవారి జీవిత చరిత్రలను, వారి త్యాగశీలతను సందర్భోచితంగా విద్యార్థులకు బోధించాలి. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ దిశగా ముందుకు వెళ్లేటట్లు సహకరించాలి. అధ్యాపకులు విద్యార్థుల పట్ల ప్రేమను, ఆప్యాయతను కలిగివుండి, వారిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ వారి అభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వాలి. మంచి పనులను ప్రోత్సహించాలి. ప్రోత్సాహం విద్యార్థులకు టానిక్‌లా పనిచేస్తుంది. ఉపాధ్యాయుల మెప్పు పొందాలని విద్యార్థులు తాపత్రయపడతారు. ప్రతిభకు గుర్తింపు దొరుకుతుందనే భావన కల్గించాలి. విద్యార్థులను ఎట్టి పరిస్థితులలోను కించపరచవద్దు. జీవితంలో గెలుపు, ఓటములు సహజమని, జీవితం ఎంతో విలువైనదని తెలియజేయాలి. అదే సమయంలో ప్రపంచమంతా వారు కలలుగనే రంగుల ప్రపంచం మాదిరిగా వుండదని, జీవితంలో పొరపాట్లు సహజమని, ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకుంటూ, తమనుతాము నిరంతరం తీర్చిదిద్దుకోవడమే జీవితమని చెప్పాలి. ఏదో ఒక విషయంలో మనం అనుకున్నట్లు జరగకపోతే, నిరాశా నిస్పృహలకు గురికావలసిన అవసరం లేదనే విషయాలను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. చిన్నప్పటి నుండే తల్లి, తండ్రి, గురువు పిల్లలకు విద్యతోబాటు పరిస్థితులను ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని కల్గించాలి. మార్పు సహజ పరిణామమని, ఈ ప్రపంచంలో మార్పు లేనిది ఏదీ లేదని, ఈ రోజు ఎంతటి క్లిష్ట పరిస్థితులున్నా పరిస్థితిలో మార్పు వస్తుందని పిల్లలకు స్పష్టంగా తెలియజేయాలి. పరీక్షలో ఫెయిలయితే అంతటితో జీవితం అంతం కాదని, ఆవేశకావేశాలతో, కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దని, మాయమాటలు నమ్మి మోసపోవద్దని, అనాలోచితంగా జీవితాలను బలి తీసుకోవద్దని బోధించాలి. మళ్లీ, మళ్లీ ప్రయత్నాలు చేసి గెలిచినవారి ఉదాహరణలు ఇవ్వాలి. పేద కుటుంబాల నుండి వచ్చి, పట్టుదలతో చదువుకుని పైకి వచ్చిన వారి జీవితాలను తెలియజేయాలి. డా|| బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, అబ్దుల్‌కలామ్‌, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి లాంటి వారి జీవిత చరిత్రల నుంచి స్ఫూర్తి కల్గించాలి. సందర్భోచితంగా మంచి మాటలను, మంచి కథలను చెబుతూ అవసరమైన విషయాలను వారితో చర్చిస్తూ వుండాలి.
విద్యార్థులకు ఎన్నో సందేహాలు కలుగుతాయి. పిల్లల్లో ప్రశ్నించే స్వభావాన్ని అణచి వేయకూడదు. పిల్లల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పినప్పుడు వారి ఆలోచనలు విస్తరిస్తాయి. తార్కిక శక్తి పెరుగుతుంది. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు గురువు సమాధానం చెప్పలేకపోతే తరువాత చెబుతానని, జవాబులు తెలుసుకుని చెప్పాలి. లేదా ఆ ప్రశ్నలకు జవాబులు ఎలా పొందవచ్చో, ఏ పుస్తకాలు చదవాలో, ఎవరితో చర్చించాలో సూచించాలి. ఉపాధ్యాయులు సామాజిక, ఆర్థిక పరిణామక్రమాన్ని దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను, అధ్యయనం చేసి విద్యార్థులకు బోధించాలి. ఉపాధ్యాయులు వారి జీవితానుభవాల నుంచి నేర్చుకున్న మంచి విషయాలను విద్యార్థులకందించాలి. విద్యార్థులకు సరైన విజ్ఞానాన్ని కల్గించడం ద్వారా ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని నిర్వహించడమే కాకుండా దేశానికెంతో సేవ చేసినవారవుతారు. ఎందుకంటే, ఒక విద్యార్థిని ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిగా, సామాజిక బాధ్యతను గుర్తెరిగే వ్యక్తిగా, దేశభక్తి గల వ్యక్తిగా తీర్చిదిద్దగలిగితే అతడు గొప్పవాడు కావచ్చు. అతని వల్ల దేశానికి, సమాజానికి ఎంతో మేలు కలుగవచ్చు. అతడు ఎందరికో స్ఫూర్తిని కలిగించవచ్చు. అందుకే విద్యార్థులను తీర్చిదిద్దే గురుతరమైన బాధ్యతను ఉపాధ్యాయులు గుర్తించినప్పుడు ఫలితాలు మరో రకంగా ఉంటాయి.
ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండటం ఎంతో అవసరం. ఇది వారి కోసమే కాదు విద్యార్థుల కోసం, దేశం కోసం. అధ్యాపకులు ఇతర వ్యాపకాలకో, డబ్బు సంపాదనకో ప్రాధాన్యత ఇవ్వకూడదు. వ్యక్తిగతమైన ఇబ్బందులు ఉండవచ్చు. లేదా విద్యా విధానం లోపభూయిష్టంగా ఉండవచ్చు లేదా అందరి దృష్టి ర్యాంకుల మీద, ఫలితాల మీదనే ఉండవచ్చు. విద్యార్థులు, తల్లిదండ్రులు తాత్కాలిక ప్రయోజనాలనే కోరవచ్చు. ఏది ఏమైనా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడంతోపాటు వారిని తీర్చిదిద్దే బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.
ఆరోజు బ్రిటిష్‌ వాళ్ల కాలంలో మెకాలే విద్యా విధానం బ్రిటిష్‌ వారికి గుమాస్తాలను తయారుచేసి ఇవ్వడానికి ఉపయోగపడితే ఈ రోజుల్లోని ఇంజనీరింగ్‌ కళాశాలలు అమెరికా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల లాభాలను చేకూర్చిపెట్టే ఇంజనీర్లను సరఫరా చేస్తున్నాయి. అందుచేత దేశ అవసరాలకు, ప్రయోజనాలకు ఉపయోగపడే శాస్త్రీయ విద్యా విధానాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యార్థుల మీద ఎంతటి భారాన్ని మోపుతున్నామో, వారిని ఎలా ఒత్తిడికి గురి చేస్తున్నామో విద్యావేత్తలు ఆలోచించాలి.
పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. పిల్లలు ఆట పాటలకు దూరం అయ్యారు. వారికి సామాజిక స్పృహను, విశాల భావాలను, శాస్త్రీయ దృక్పథాన్ని, మానసిక స్థైర్యాన్ని కల్గించడం లేదు. అందుకే, ఏదో ఒక పరీక్షలో తప్పినా, మరో తీవ్ర పరిస్థితి ఉత్పన్నమైనా విద్యార్థులు తట్టుకోలేక పోతున్నారు. కాబట్టి విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం వహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై మరింత ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో సైతం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, కనీసం వారంలో ఒక పీరియడ్‌ కేటాయించాలి.
అదేవిధంగా పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రతిరోజూ సాయంత్రం ఒక గంట ఆట పాటలకు కేటాయించడం ఎంతో అవసరం. ప్రధానోపాధ్యాయులు, స్కూలు నిర్వాహకులు, సంబంధిత అధికారులు అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలి.
విద్యార్థులను చైతన్యవంతులుగా జీవితం పట్ల సరైన దృక్పథం కలవారిగా, సమాజం పట్ల బాధ్యతగలవారిగా, సాటి మానవుల కష్టాలకు స్పందించే వారిగా, నీతిమంతులుగా, దేశభక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నాల మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
(వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి) -జస్టిస్‌ బి. చంద్రకుమార్‌

No comments: