Sep 4, 2011

ఒక డాలర్‌ జీతగాడు!


టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ కంప్యూటర్స్‌ ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌గా రూపుదిద్దుకోవడంలో విశేష కృషి సల్పిన వ్యక్తి స్టీవ్‌జాబ్స్‌. ఆయన పలు రకాల ఆవిష్కరణలు చేశాడు. ఆధునికత, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఐఫోన్‌, ఐప్యాడ్‌, ఐపోడ్‌ను అందించాడు. ఆన్‌లైన్‌ మ్యూజిక్‌లోనూ విప్లవాత్మక మార్పులు తేవడంతో పాటు స్మార్ట్‌ఫోన్‌, లెడ్‌ పిక్సర్‌లను ఆవిష్కరించి యాపిల్‌ ఇన్‌కార్పొరేషన్‌ను ఒంటి చేత్తో నిలబెట్టాడు. 2007లో యాపిల్‌ కంపెనీకి కీలకంగా భావించే ఐఫోన్‌ ద్వారా టెక్నాలజీ శకంలో విప్లవం తీసుకొచ్చాడు. ఐఫోన్‌ ద్వారానే యాపిల్‌ అతిపెద్ద అమెరికన్‌ కార్పొరేషన్‌గా అవతరించింది. ఐట్యూన్స్‌ సాఫ్ట్‌వేర్‌ను, మ్యూజిక్‌ ప్లేయర్‌ను కనుగొనడం ద్వారా 2000 సంవత్సరంలో దివాలా తీసే స్థితిలో వున్న యాపిల్‌ సంస్థకు స్టీవ్‌ తిరిగి ఊపిరిలూదాడు. కంప్యూటర్లు, మ్యూజిక్‌, మూవీస్‌, మొబైల్‌ టెలిఫోన్ల విభాగాల్లో యాపిల్‌ను ఎవరికీ అందనంత ఎత్తుకు చేర్చాడు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏడాదికి ఒక డాలర్‌ మాత్రమే జీతం తీసుకుని సంస్థను నడిపాడు. అందుకుగాను ఆయనకు చక్కటి గౌరవమే లభించింది. ఫార్చ్యూన్‌ మేగజైన్‌ ఆయన్ను ఈ దశాబ్దపు సిఇఒగా ప్రకటించింది. అలాంటి జాబ్స్‌ ఇప్పుడు యాపిల్‌ సంస్థకు రాజీనామా చేశారు. ఎందుకో, ఏమిటోతోపాటు ఆయన జీవిత విశేషాలనూ తెలుసుకుందామా!

తొలి యాపిల్‌ కంప్యూటర్‌ 2,10,000 డాలర్లు మాత్రమే

ఆ కంప్యూటర్‌ యాపిల్‌ ఐపాడ్‌ కన్నా వెయ్యి రెట్లు నిదానంగా పనిచేస్తుంది. కానీ ధరలో మాత్రం ఐపాడ్‌ కన్న 425 రెట్లు ఎక్కువగా అమ్ముడైంది. అందుకు కారణం అది యాపిల్‌ సంస్థ తయారు చేసిన మొట్టమొదటి కంప్యూటర్‌ కావడమే. 2,10,000 అమెరికన్‌ డాలర్లు పలికిన ఈ యాపిల్‌-1 కంప్యూటర్‌ 1970వ దశాబ్దంలో యాపిల్‌ సంస్థ ఇలాంటి కంప్యూటర్లను కేవలం 200 మాత్రమే తయారు చేసింది. ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ సెంట్రల్‌ లండన్‌లో దీనిని వేలం వేయగా.. ఇది 1,33,250 పౌండ్ల (దాదాపు 2,10,000 అమెరికా డాలర్ల) వెల పలికింది. యాపిల్‌-1ను 1976లో విడుదల చేశారు. ఇది అప్పట్లో పూర్తిగా అసెంబిల్డ్‌ మదర్‌బోర్డుతో తయారైన ఒకే ఒక పర్సనల్‌ కంప్యూటర్‌ కావడం విశేషం. 1977లో దీని తయారీని నిలిపివేశారు. అప్పటి వరకూ ఇది 666.66 అమెరికా డాలర్లకు అమ్ముడైంది.
ఒక డాలర్‌ జీతమే...

ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ సంస్థను నడుపుత్ను వ్యక్తి యాపిల్‌ కంప్యూటర్స్‌ చీఫ్‌ స్టీవ్‌జాబ్స్‌ జీతం ఎంతో తెలుసా? కేవలం ఒక్క డాలర్‌ మాత్రమే. గత మూడేళ్ల నుంచి ఆయన తన జీతం కేవలం ఒక డాలర్‌ మాత్రమే. అందుకు కారణం కూడా ఉంది. 2008-09లో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యంతో తాను వేతనం తీసుకోరాదని, సంవత్సరానికి కేవలం 1 డాలర్‌ మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 2010 సంవత్సరానికి జీతంగా 1 డాలర్‌తో పాటు, వ్యాపార నిమిత్తం ప్రయివేట్‌ జెట్‌ విమానాన్ని వాడుకున్నందుకు 248,000 డాలర్లు అందుకున్నాడు. ఆయనకు కంపెనీలో 5.5 మిలియన్‌ డాలర్ల షేర్లున్నాయి. నాస్‌డాక్‌లో లిస్ట్‌ అయ్యే ఆపిల్‌ కంప్యూటర్‌ మార్కెట్‌ వాల్యూ జనవరి 7, 2011 నాటికి 308 బిలియన్‌ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం 65.2 బిలియన్‌ల రెవెన్యూలో నికర లాభం 14 బిలియన్‌ డాలర్లను నమోదు చేసింది.

యాపిల్‌ సంస్థ సిఇఓ స్టీవ్‌జాబ్స్‌ మరో 6 వారాలలో చనిపోవచ్చని, అతనికి క్యాన్సర్‌ ఉన్నందున ఇంతకంటే ఎక్కువ కాలం బ్రతకలేరని డాక్టర్లు తేల్చి చెప్పినట్టు సమాచారం. స్టీవ్‌జాబ్స్‌ ఇప్పటికే తన విధులకు హాజరుకావటం లేదు. సంస్థ బోర్డు సభ్యులకు రాసిన లేఖలో తనకు విశ్రాంతి కల్పించవలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. అరుదైన క్లోమ సంబంధ క్యాన్సర్‌తో పోరాడుతున్న స్టీవ్‌ స్థానంలో టిమ్‌ కుక్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. 2012లో మరిన్ని ఫీచర్లతో కూడిన కొత్త ఐఫోన్‌ను యాపిల్‌ విడుదల చేస్తుందనే వార్తల నేపథ్యంలో జాబ్స్‌ రాజీనామా విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
యాపిల్‌ ప్రత్యేకత

యాపిల్‌ సంస్థ ఏదైనా ఒక ఉత్పత్తిని విడుదల చేస్తోందనగానే అది ఏమై వుంటుంది? అది కంప్యూటర్‌ రంగంలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది? అని వినియోగదారులు, పరిశీలకులతోపాటు పోటీ సంస్థలు సైతం ఎదురుచూస్తుంటాయి. ఐబిఎం సంస్థ తయారుచేసిన పర్సనల్‌ కంప్యూటర్లను పోలిన వాటిని తయారుచేయడానికి, దానిపై పనిచేసే సాఫ్ట్‌వేర్లు, ఇతర పరికరాలను తయారుచేయడాకే అంతా ఆసక్తి చూపుతున్న తరుణంలో పూర్తి వైవిధ్యభరితమైన ఆలోచనలతో వేరొక ప్లాట్‌ఫామ్‌ని తయారుచేసి, ప్రపంచానికి అందించిన ఘనత యాపిల్‌ సంస్థది. 'థింక్‌ డిఫరెంట్‌' అనే నినాదంతో ప్రపంచ కంప్యూటర్‌ చరిత్రలో తన స్థానం నిలుపుకున్న యాపిల్‌ కంప్యూటర్‌ సంస్థ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నేటికీ సరికొత్త టెక్నాలజీలను అందించే సంస్థగా పేరుపొందింది. ఐబిఎం కంపాటిబుల్‌ కంప్యూటర్లకు సుమారు దశాబ్దం పూర్వమే జియుఐ (గ్రాఫికల్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌) ఆపరేటింగ్‌ సిస్టమ్‌ని అందించినా, మౌస్‌ వినియోగాన్ని తొలిసారి రుచి చూపించినా, పిర్‌ టు పిర్‌ నెట్‌వర్కింగ్‌ని తొలి కంప్యూటర్‌తోనే అందించినా, తొలి పిడిఎ విడుదలచేసినా, సరికొత్త డిజైన్‌తో ఐమ్యాక్‌ మోడల్‌ విడుదల చేసినా, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఐఫోన్‌, ఐప్యాడ్‌, ఐపోడ్‌లను అందించినా అది ఆ సంస్థకే చెల్లింది.
ఓ అనాథ సిఈఓ అయిన తీరు

ఒక అనాథ బాలుడు, 30 సంవత్సరాల వయసుకే కోటీశ్వరుడై, ప్రపంచ కంప్యూటర్‌ రంగంలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని లిఖించుకున్నాడు. ఆ పిల్లవాడే స్టీవ్‌ జాబ్స్‌ అంటే ఆశ్చర్యం వేస్తుంది. 1955 ఫిబ్రవరిలో జన్మించిన స్టీవ్‌ పాలిస్‌ను అనాథాశ్రమం నుంచి పాల్‌ జాబ్స్‌-క్లారా జాబ్స్‌ దంపతులు దత్తత తీసుకున్నారు. స్టీవ్‌ పాల్‌ జాబ్స్‌ పేరుతో పెంచి పెద్దచేశారు. కాలిఫోర్నియాలోని లాస్‌ ఆల్టోస్‌లో 1972లో హైస్కూల్‌ విద్యనభ్యసించిన జాబ్స్‌, పోర్ట్‌ల్యాండ్‌లోని రీడ్‌ కాలేజీలో చేరారు. అయితే జాబ్స్‌ ఒక సెమిస్టర్‌ పూర్తికాగానే చదువు మానేశాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం అటారీ ఇన్‌కార్పొరేషన్‌లో చేరిన జాబ్స్‌, తన చిన్ననాటి స్నేహితుడు స్టీవ్‌ వోజ్నియాక్‌ని తిరిగి కలుసుకున్నాడు.కంప్యూటర్‌ సెమినార్లు, క్లబ్బులకు ఇద్దరూ తప్పకుండా హాజరయ్యేవారు.

1975లో జాబ్స్‌ ఇంటిలోని కార్‌గ్యారేజిలో పర్సనల్‌ కంప్యూటర్లపై పనిచేయసాగారు. ఆ సంవత్సరాంతంలోనే మౌంటెన్‌వ్యూలోని బైట్‌ షాప్‌ నుంచి 50 అసెంబుల్డ్‌ పర్సనల్‌ కంప్యూటర్లకు ఆర్డర్‌ వచ్చింది. దీంతో స్టీవ్‌జాబ్స్‌ మరో ఇద్దరితో కలిసి 1976 ఏప్రిల్‌ 1న 'యాపిల్‌ కంప్యూటర్స్‌'ను స్థాపించాడు. జాబ్స్‌ తనకు అత్యంత ఇష్టమైన పండు పేరునే కంపెనీ పేరుగా నిర్ణయించుకుని, లోగోలో బైట్‌ని కూడా సూచించడానికిగాను పూర్తి యాపిల్‌ని కాకుండా కొరికిన యాపిల్‌ని ఉపయోగించాడు. అదే సంవత్సరంలో సింగిల్‌ బోర్డ్‌ కలిగిన యాపిల్‌-1 కంప్యూటర్‌ విడుదల చేశాడు. కేవలం ఆన్‌బోర్డు రామ్‌ మాత్రమే కలిగివున్న ఈ కంప్యూటర్‌కి వీడియో ఇంటర్‌ఫేస్‌ (టీవీని మోనిటర్‌గా కనెక్ట్‌ చేసుకోవడానికి), ఎక్స్‌టర్నల్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ మాత్రమే వుండేవి.

1977లో యాపిల్‌-2 కంప్యూటర్‌ను విడుదల చేశారు. అత్యధికంగా అమ్ముడుపోయిన తొలి పర్సనల్‌ కంప్యూటర్‌ ఇదే. ఆ రోజుల్లోనే యాపిల్‌-2పై సుమారు 16వేల అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌లు తయారయ్యాయంటే జాబ్స్‌ ఏ స్థాయిలో ప్రోగ్రామర్లను ఆకట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. అదే సంవత్సరం జాబ్స్‌ వ్యాపార బాధ్యతల నుంచి తప్పుకుని, ఛైర్మన్‌ బాధ్యతలను ఇంటెల్‌లో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేసిన మైక్‌ మార్కులాకు అప్పగించాడు. తను తర్వాతితరం పర్సనల్‌ కంప్యూటర్‌ మాకింతోష్‌ తయారీలో నిమగమయ్యాడు.

1980లో పబ్లిక్‌ లిమిటెడ్‌గా మారిన యాపిల్‌, తన యాపిల్‌-3 మోడల్‌ని విడుదలచేసింది. అయితే దానిలో సమస్యలు రావడంతో మైక్‌ మార్కులా ఛైర్మన్‌ పదవినుంచి తప్పుకుని తిరిగి జాబ్స్‌కి అప్పగించాడు. 1983లో యాపిల్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఆ సంవత్సరం వీరు తమ మ్యాకింతోష్‌ కంప్యూటర్‌ను విడుదల చేశారు. నాటికి, నేటికి మ్యాక్‌ అనే పేరు నూతనత్వానికి, సరికొత్త ప్రయోగాలకు మారుపేరుగా నిలిచిపోయింది. అదే సంవత్సరంలో జాబ్స్‌ అంతకు పూర్వం తనతో పనిచేసిన జాన్‌స్కల్లీని ప్రెసిడెంట్‌-సిఇవోగా నియమించాడు. తరువాతి కాలంలో వీరి మధ్య జరిగిన ఆధిపత్యపోరులో మెంబర్లు కూడా జాన్‌స్కల్లీనే సమర్థించడంతో స్టీవ్‌కు యాపిల్‌ను వదలక తప్పలేదు.
అనంతరం 'నెక్ట్స్‌ సాఫ్ట్‌వేర్‌' సంస్థని ప్రారంభించాడు.

1986లో జార్జి లూకస్‌ నుంచి పిక్సర్‌ యానిమేషన్‌ స్టూడియోని కొనుగోలుచేసి, చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాడు. 1989లో నెక్ట్స్‌ అద్భుతమైన కంప్యూటర్‌ని తయారుచేసినప్పటికీ అత్యధిక ధర కలిగిన ఆ కంప్యూటర్‌ అసలు అమ్ముడుపోలేదు. ఈ ఏడాదే పిక్సర్‌ నిర్మించిన 'టిన్‌ టారు' యానిమేషన్‌ చిత్రానికి ఆ కేటగిరిలో అత్యుత్తమ చిత్రంగా అకాడెమీ అవార్డు లభించింది. 1995లో వాల్ట్‌డిస్నీ సంస్థ పిక్సర్‌ వారి పూర్తిస్థాయి కంప్యూటర్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అయిన 'టారు స్టోరీ'ని విడుదల చేయడంతో ఇక ఈ సంస్థ చిత్ర నిర్మాణంలో అత్యున్నత సంస్థలలో ఒకటిగా నిలిచిపోయింది.1995లో 'ఎ బగ్స్‌ లైఫ్‌', 1999లో 'టారుస్టోరీ-2' చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ ఈ మూడు చిత్రాల నుంచి సుమారు 1.2 బిలియన్‌ డాలర్ల వ్యాపారం చేసింది. వీరి నాల్గవ చిత్రం 'మోన్‌స్టర్స్‌' 2001 నవంబర్‌లో విడుదలైంది.

తర్వాత యాపిల్‌ తాత్కాలిక సిఇవోగా నియమితులైన జాబ్స్‌ 1999లో తిరిగి యాపిల్‌ సిఇవోగా బాధ్యతలు చేపట్టాడు. ఆనాటికి నష్టాలలో మునిగివున్న యాపిల్‌ని తిరిగి లాభాల బాటలోకి తీసుకొచ్చి, గత దశాబ్దపు సంచలన ఉత్పత్తి అయిన 'ఐమ్యాక్‌'ని విడుదల చేయడం ద్వారా తిరిగి వెలుగులోకి వచ్చాడు. 1991లో లారెన్స్‌ పావెల్‌ని వివాహమాడిన జాబ్స్‌కి ముగ్గురు పిల్లలు. 1985లో 'నేషనల్‌ టెక్నాలజీ మెడల్‌', 1989లో 'ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది డికేడ్‌' వంటి ప్రతిష్టాత్మక అవార్డులను ఈయనను వరించాయి.

'కంప్యూటర్‌ యుగం తొలిరోజుల్లోనే ఈ రంగంలో అడుగుపెట్టడం నా అదృష్టం. ఆ రోజుల్లో వ్యక్తులు ఈ రంగంపై ప్రేమతో పనిచేశారు కానీ, డబ్బు కోసం కాదు' అని పేర్కొనే స్టీవ్‌జాబ్స్‌... నేటికీ తనదైన శైలిలోనే పనిచేస్తారు. పనిచేయడమే జీవిత ధ్యేయమన్నట్లుగా మెలిగే ఈ వ్యక్తి, తాను ఉత్సాహం నింపుకుని తనతో పనిచేసేవారికీ ఉత్సాహం నింపుతారు. ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన స్టీవ్‌జాబ్స్‌ తన 55ఏళ్ళ వయస్సుకే రిటైర్డ్‌ కావడం... అదీ క్యాన్సర్‌ వ్యాధితో రోజులు లెక్కిస్తుండడం ఈ రంగంలోని ప్రతి ఒక్కరినీ, యాపిల్‌ కంప్యూటర్‌ అభిమానులనూ మనసు కలచివేసే సంఘటనే.
- కె.ఎక్స్‌.రాజు

No comments: