Sep 28, 2011

జగడం పరామర్శ పేరుతో లగడపాటి హల్‌చల్.. తీవ్ర ఉద్రిక్తత






విజయవాడ ఎంపీని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు
ఆయనను అడ్డుకునేందుకు వచ్చిన టీఆర్‌ఎస్, తెలంగాణ జేఏసీ నేతలు
ఆర్‌టీఏ కార్యాలయం వద్ద అడ్డుకున్న పోలీసులు.. తోపులాట, ధర్నాలు
లోపలికి చొచ్చుకెళ్లటంతో స్పృహ తప్పిన హరీశ్‌రావు..
డీసీపీకి చేయి ఫ్రాక్చర్.. స్వామిగౌడ్‌కు అస్వస్థత
టీఆర్‌ఎస్, జేఏసీ నేతలు అరెస్ట్.. బంజారాహిల్స్ పీఎస్‌కు తరలింపు
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పీఎస్‌ల వద్ద పెద్ద ఎత్తున తెలంగాణవాదుల ధర్నా ... 15వ రోజూ కొనసాగిన సకల జనుల సమ్మె..

హైదరాబాద్, న్యూస్‌లైన్: పదిహేను రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ సకల జనుల సమ్మె.. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్‌లో చేసిన హల్‌చల్‌తో మంగళవారం ఉద్రిక్తంగా మారింది. సోమవారం రవాణాశాఖలో సీమాంధ్ర ఉద్యోగులను పరామర్శించేందుకంటూ లగడపాటి రావటం.. ఆయనను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, తెలంగాణ జేఏసీ నేతలు రావటంతో మొదలై.. నినాదాలు, తోపులాటలు, నిరసనలు, ధర్నాలు, అరెస్టులు, పోలీస్‌స్టేషన్‌లో బైఠాయింపుల ఆద్యంతం తీవ్ర ఉత్కంఠతో హైడ్రామా నడిచింది. ఈ సందర్భంగా ఇటు లగడపాటిని, అటు టీఆర్‌ఎస్ నాయకులు హరీశ్‌రావు కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీ, విష్ణువర్ధన్‌రెడ్డి, టీ-జేఏసీ నాయకుడు స్వామిగౌడ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుల సందర్బంగా జరిగిన తోపులాటలో హరీశ్‌రావు, స్వామిగౌడ్‌లు అస్వస్థకు గురికాగా.. డీసీపీ స్టీఫెన్ రవీంద్ర చేయి విరిగింది. ఖైరతాబాద్‌లోని ఆర్‌టీఏ కార్యాలయం వద్ద, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మూడు ప్రాంతాలూ ధర్నాలతో దద్దరిల్లాయి. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా సకల జనుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్‌టీసీ కార్మికులు, ప్రభుత్వ వైద్యులు, న్యాయవాదులు సమ్మె కొనసాగిస్తుండటంతో.. సర్కారు సేవలు, ప్రజా రవాణా మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజులు గడస్తున్న కొద్దీ సమ్మె ప్రభావం రాష్ట్రమంతటికీ విస్తరిస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా సమ్మెపై పంతానికి పోతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా సమ్మె సమస్యను అధిగమించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీసు సబార్డినేట్లను తాత్కాలికంగా నియమించుకోవాలని, విధుల్లోకి వచ్చే ఉద్యోగులకు భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రయివేటు సెక్యూరిటీని సమకూర్చుకోవాలనీ సూచించారు. ఇక తెలంగాణ జేఏసీ కార్యాచరణలో భాగంగా.. బుధవారం హైదరాబాద్ నగరమంతటా రాస్తారోకో చేపట్టనున్నారు.


రగడ... రగడ...

సీమాంధ్ర ఉద్యోగులను పరామర్శించేందుకంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆర్‌టీఏ (ఖైరతాబాద్) కార్యాలయానికి రావటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అప్పటికే కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యోగులు.. లగడపాటి రాక గురించి అగ్రనేతలకు సమాచారం అందించారు. ఈలోపే పోలీసులు లగడపాటిని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎంపీని తరలించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్‌లు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే భారీగా మోహరించివున పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వారు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. టాస్క్‌పోర్స్ పోలీసులు - ప్రజాప్రతినిధుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో హరీశ్‌రావు చొక్కా పూర్తిగా చినిగిపోయింది. పోలీసులు గోళ్లగాట్లతో గాయపడ్డారు. పోలీసులను తోసేసి కమిషనర్ చాంబర్‌కు చేరుకున్న నాయకులు.. ‘లగడపాటి ఎక్కడ? తెలంగాణ ద్రోహి లగడపాటికి రెడ్‌కార్పెట్ స్వాగతం పలికి.. మమ్మల్ని అడ్టుకుంటారా?’ అని కమిషనర్ హీరాలాల్‌సమారియాపై ధ్వజమెత్తారు. అప్పటికే ఒకింత అస్వస్థతకు గురైన హరీశ్‌రావు సోఫాలో కూలబడిపోయారు. అంతలోనే డీసీపీ స్టీఫెన్ రవీంద్ర అక్కడకు చేరుకొని నాయకులను బయటకు రావాలని కోరారు. దీనికి వారు నిరాకరిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు బయటకు వచ్చిన యాష్కీ, విష్ణు, కొప్పులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. అప్పటికే అక్కడకు చేరుకున్న వేల సంఖ్యలోని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. పోలీస్ వాహనం టైర్లలో గాలి తీసేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు వారిని అరెస్ట్ చేసి తీసుకొస్తుండగా.. నాయకులు
వాహనంలోంచి దూకి కేసీపీ జంక్షన్ వైపు ర్యాలీగా వెళ్ళారు. పోలీసులు మళ్లీ వారిని వాహనంలో ఎక్కించుకుని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హరీశ్‌రావు తన సొంత వాహనంలో వెళ్లేందుకు సిద్ధమవగా.. డీసీపీ స్టీఫెన్ అడ్డుకుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అదుపులోకి తీసుకోవటానికి వీల్లేదని హరీశ్ వాదించటంతో.. సంకెళ్లు వేసి మరీ తీసుకువెళతానని డీసీపీ హెచ్చరించారు. దీంతో ఆగ్రహానికి గురైన హరీశ్‌రావు.. కారు దిగి చేతులు చాచి బేడీలు వేయాలని చెప్పారు. వెంటనే అక్కడకు వచ్చిన ఆందోళనకారులు డీసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీశ్ అక్కడే బైఠాయించారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనను సముదాయించి ఆయన సొంతవాహనంలో జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్ వద్దకు తెలంగాణవాదులు పెద్ద ఎత్తున చేరుకోవటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. హరీశ్, విష్ణులు స్టేషన్ ఆవరణలోనే బైఠాయించారు. లగడపాటికి ఆర్‌టీఏ కార్యాలయంలో ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానం పలికారని.. తమను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను నిలదీశారు. తాము వెళతామని చెప్పినా పోలీసులు అంగీకరించలేదు. పోలీస్‌స్టేషన్ నుంచి పంపిస్తే.. వారంతా లగడపాటిని తరలించిన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళే అవకాశం ఉందని పోలీసులు నిరాకరించారు. దీంతో నాయకులు గంటల తరబడి ఎండలోనే కూర్చున్నారు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో హరీశ్‌రావు స్పృహతప్పారు. తర్వాత అరగంటకు నేతలను వదిలిపెట్టారు. అప్పటికే స్టేషన్‌కు భారీగా చేరుకున్న కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.

స్టేషన్‌లో లగడపాటి బైఠాయింపు


లగడపాటిని ఆర్‌టీఏ ఆఫీస్ నుంచి జూబ్లీహిల్స్‌కు తరలించగా.. తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. లగడపాటికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తుండటంతో ఆ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉదయం 11 గంటల సమయంలో లగడపాటిని జూబ్లీహిల్స్ స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు.. అరగంట తర్వాత ఆయనను తన ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ సతీష్‌రెడ్డి ఒక్కసారిగా స్టేషన్ గేట్లు దూకి లోనికి ప్రవేశించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. లగడపాటి డౌన్‌డౌన్ అంటూ సతీష్‌రెడ్డి నినాదాలు చేస్తుండగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారు. అప్పటికే లగడపాటి స్టేషన్ ఆవరణలో కారులో కూర్చున్నారు. సరిగ్గా ఆ సమయంలో స్టేషన్ వద్దకు వచ్చిన తెలంగాణ న్యాయవాదులు.. లగడపాటి కారును చూసి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ స్టేషన్ గేట్లు దూకి లోనికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగడపాటి స్టేషన్ నుంచి వెళ్లనంటూ ఐదు గంటల పాటు అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ట్రాఫిక్ రికవరీ వ్యాన్‌ను రప్పించి దాని సహాయంతో లగడపాటి కారును బలవంతంగా స్టేషన్ బయటకు ఈడ్చుకొచ్చారు. ఆయనను జూబ్లీహిల్స్‌లోని ఇంటికి తరలించారు.


స్టీఫెన్ రవీంద్ర చేయి ఫ్రాక్చర్: ఆర్‌టీఏ కమిషనరేట్ వద్ద లగడపాటి రాకను నిరసిస్తూ ధర్నాకు దిగిన తెలంగాణ శ్రేణులతో జరిగిన తోపులాటలో వెస్ట్‌జోన్ డీసీపీ స్టీఫెన్ రవీంద్ర ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది. ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా.. పరీక్షలు నిర్వహించి మణికట్టు సమీపంలోని మెటా కార్బ్ ప్రాంతంలో ఎముక విరిగినట్లు గుర్తించారు. బుధవారం ఆపరేషన్ నిర్వహించాలని డాక్టర్లు నిర్ణయించారు.


ఆసుపత్రిలో చేరిన స్వామిగౌడ్: ఆర్టీఏ కార్యాలయంలో పోలీసులతో జరిగిన తోపులాటలో గాయపడిన తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ మంగళవారం కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆర్‌టీఏ కార్యాలయం వద్ద పోలీసులను తోసుకుని లోపలకు వెళ్లటానికి స్వామిగౌడ్ ప్రయత్నించగా.. మఫ్టీలో ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకుని గట్టిగా లాగేశారు. పోలీసులతో పెనుగులాడి లోపలికి వెళ్లి వచ్చిన తర్వాత తనను అరెస్ట్ చేయటానికి ప్రయత్నించినప్పుడు కూడా ప్రతిఘటించారు. పోలీసులు గట్టిగా పట్టుకొని వాహనంలో విసిరేశారు. పోలీసుల ధాటికి నలిగిపోయిన స్వామిగౌడ్ అస్వస్థకు గురవటంతో ఆసుపత్రిలో చేరారు.

దాడిచేసిన వారిపై కేసు నమోదు: రవాణా శాఖ అసిస్టెంట్ కమిషన ర్ శ్రీనివాస్‌పై దాడి ఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్ ఆధారంగా విద్యార్థి సంఘం నాయకుడు సుమన్, ఐఎఫ్‌టీయూ నాయకుడు కిరణ్‌లపై కేసు నమోదు చేసినట్లు పంజగుట్ట పోలీసులు చెప్పారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకున్నందుకు వారిపై సెక్షన్ 353 ఆర్/డబ్ల్యూ 34 కింద కేసు నమోదయిందన్నారు.

జేఏసీ నేతలూ ఢిల్లీ బాట!

రాష్ట్రంలో సకల జనుల సమ్మెను ఉధృతంగా కొనసాగిస్తూనే తెలంగాణ ఏర్పాటుపై జాతీయస్థాయిలో కసరత్తుకు జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు. జేఏసీలో భాగస్వాములుగా ఉన్న టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలతో పాటు వివిధ ఉద్యోగ సంఘ నాయకులు రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్నారు. యూ పీఏ భాగస్వామ్య పక్ష పార్టీ నేతలతో పాటు జాతీయ విపక్ష పార్టీ నేతలను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న సమ్మె గురించి వివరిస్తారు.

నేడు సింగరేణికి బస్సుయాత్ర

సకల జనుల సమ్మెలో భాగంగా సింగరేణి బొగ్గు గనుల్లో విధులకు దూరంగా ఉంటున్న కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు జేఏసీ నేతలు బుధవారం బస్సుయాత్ర చేయనున్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, అరవింద్‌రెడ్డి, బీజేపీ నుంచి రాజేశ్వరరావు, ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, సీపీఐ ఎంఎల్ నూడెమోక్రసీ నేతలు గోవర్ధన్, వెంకటేశ్వరరావు, జేఏసీ నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు బస్సుయాత్రలో పాల్గొంటారు. బొగ్గు గనులున్న అన్ని ప్రాంతాల గుండా బస్సుయాత్ర కొనసాగుతుంది.

15వ రోజూ స్తంభించిన పాలన

సకల జనుల సమ్మెతో తెలంగాణ వ్యాప్తంగా వరుసగా 15వ రోజు కూడా పరిపాలన స్తంభించిపోయింది. తెలంగాణ జిల్లాల్లో సర్కారు కార్యాలయాలకు పడిన తాళాలు తీసే నాధుడే ఉండటం లేదు. పాలనకు గుండెకాయ లాంటి సచివాలయంతో పాటు హైదరాబాద్‌లోని 250 శాఖాధిపతుల కార్యాలయాల మీద సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండటంతో.. తెలంగాణేతర ప్రాంతాలకు సంబంధించిన ఫైళ్లు కూడా ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వనస్థలిపురం నుంచి వస్తున్న ఉద్యోగుల బస్సులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఉద్యోగులకు, తెలంగాణవాదులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సర్కారు డ్రైవర్లు సమ్మెలో ఉన్నందున డైవర్లంతా విధులను బహిష్కరించాలని కోరతూ మంగళవారం సచివాలయ ప్రధాన ద్వారం వద్ద ప్రభుత్వ వాహనాలను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ప్రతి రోజూ రెండు గంటల పాటు విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శనలు చేస్తుండటంతో వైద్య సేవలకు పాక్షికంగా అంతరాయం కలుగుతోంది.
న్యాయవాదుల సమ్మెతో హైకోర్టు మినహా మిగతా కోర్టుల్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు రోజుల పరిశ్రమల బంద్ మంగళవారం ముగిసింది. డిస్టిలరీస్, బ్రూవరీస్ (మద్యం, బీరు ఉత్పత్తి కేంద్రాలు) సోమ, మంగళవారాలు ఉత్పత్తిని నిలిపేశాయి. ఆర్టీసీ సమ్మె 9వ రోజు కొనసాగటంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 89 డిపోల పరిధిలో పోలీసు బందోబస్తుతో 430 బస్సులు నడిచాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బస్‌భవన్ వరకు జరిగిన ర్యాలీలో పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఆర్‌టీసీ జేఏసీ నేతలు పాల్గొన్నారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన వీఆర్వోలతో అక్టోబర్ ఒకటో తేదీన పోరు గర్జన నిర్వహించనున్నట్లు తెలంగాణ వీఆర్‌వోల సంఘం ప్రకటించింది.

ప్రైవేటు బస్సుకు నిప్పు
రాజధానిలో రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన ఓ ప్రైవేటు బస్సుకు అగంతకులు నిప్పంటించారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జామైఉస్మానియా రహదారిపై రోజుమాదిరిగానే పార్క్ చేసి ఉన్న ఓల్వా ప్రైవేటు బస్సు (ఏపీ 05 ఏఎఫ్ 5051)కు రాత్రి 11.30 గంటలకు ముగ్గురు అగంతకులు వచ్చి పెట్రోల్‌ను చల్లి నిప్పంటించి ద్విచక్ర వాహనంపై పారిపోయినట్లు సమాచారం. బస్సుకు నిప్పంటుకున్న విషయం తెలియగానే స్థానికులు ఫైర్ సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. ముషీరాబాద్ ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఇది టీసీఎస్ కంపెనీ ఉద్యోగులను కార్యాలయానికి తీసుకెళ్లే బస్సు కావడం గమనార్హం. మరోవైపు జామైఉస్మా నియా రైల్వేస్టేషన్ బుకింగ్ కౌంటర్‌ను తగులపెట్టేందుకు ఆందోళనకారులు పెట్రోల్ చల్లారు. పోలీసులు రావడంతో పరారయ్యారు.

ప్రత్యామ్నాయాలకు సీఎం ఆదేశాలు

డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ సిబ్బందిగా ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవడానికి వీలుగా శాఖాధిపతులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ప్రజా రవాణా కోసం ప్రైవేటు వాహనాలను అనుమతించింది. మంగళవారం సీఎం కాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈమేరకు నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు బొత్స సత్యనారాయణ, దానం నాగేందర్, రాంరెడ్డి వెంకటరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వి.ప్రసాద్‌లు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రత పెంచాలని, విధులకు వచ్చే ఉద్యోగులకు ఆటంకం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ముఖ్యమైన కార్యాలయాలతో పాటు సింగరేణి బొగ్గు గనుల వద్ద అదనపు బలగాలను పెట్టాలని సూచించారు. రూ. 10 కోట్లతో మంగళవారం 1,100 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేశామని, వేసవిలో కూడా ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ కోనుగోలు చేయాల్సిన అవసరం రాలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయినా కొరతను అధిగమించలేకపోతున్నామన్నారు. ప్రజలు నానా అవస్థలు పడుతున్నందున సకల జనుల సమ్మెపై ఉద్యోగ సంఘాలు, ఆయా పార్టీల నేతలు పునరాలోచించాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

No comments: