Oct 25, 2011

సమ్మె ఆగింది సర్కారుతో చర్చలు సఫలం.. నేటి నుంచి విధుల్లోకి తెలంగాణ ఉద్యోగులు..

*ముగిసిన 42 రోజుల సమ్మె
*తాత్కాలిక వాయిదానే: జేఏసీ
*విరమణ ఒప్పందంపై సుదీర్ఘ కసరత్తు
*తొమ్మిది డిమాండ్లపై అంగీకారం
*ఢిల్లీకి ఉద్యోగుల ప్రతినిధి బృందాన్ని తీసుకువెళతానని సీఎం హామీ
*610 జీవో పర్యవేక్షణకు కమిషన్!
*‘సమ్మె కాలానికి అడ్వాన్స్’గా వేతనం
*ఆన్ డ్యూటీగా పరిగణించడంపై ఏజీ సలహా, హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం
*విద్రోహ చర్యల్లో పాల్గొనని ఉద్యోగులపై కేసుల రద్దు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సకల జనుల సమ్మెలో ఆఖరి అంకం కూడా ముగిసింది. తెలంగాణ ఉద్యమాన్ని తొలి నుంచీ ముందుండి నడిపిస్తున్న ఉద్యోగులు ఎట్టకేలకు సమ్మె విరమణకు అంగీకరించారు. సెప్టెంబరు 13న ప్రారంభమై 42 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఉద్యోగుల సమ్మెకు సోమవారం తెరపడింది. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల దాకా సుదీర్ఘంగా సాగిన చర్చల్లో ఉద్యోగుల చేసిన 9 డిమాండ్లకు సర్కారు పాక్షికంగా అంగీకారం తెలపడంతో చర్చలు సఫలమ య్యాయి. తెలంగాణ ఏర్పాటుపై నిర్దిష్ట కాల పరిమితితో కూడిన ప్రకటన డిమాండ్‌ను సంఘాలు కాస్తంత సడలించి... ఢిల్లీ నుంచి ప్రకటన చేయించాలని సర్కారును కోరిన ఫలితంగా ఆదివారం వచ్చిన ఆజాద్ ప్రకటన ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలకు అనువైన వాతావవరణానికి ఆధారమైంది. ఆజాద్ ప్రకటనను స్వాగతించిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు... సర్కారు ఆహ్వానం మేరకు సోమవారం మంత్రుల ఉపసంఘంతో చర్చలు ప్రారంభించారు.

రోజంతా చర్చలే
ఆజాద్ ప్రకటన నేపథ్యంలో.. ప్రభుత్వంతో చర్చలు జరపాలని సోమవారం ఉదయం జరిగిన జేఏసీ సమావేశం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కో-చైర్మన్లు దేవీప్రసాద్, విఠల్ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం, సీఎస్ కార్యాలయాలుండే సి-బ్లాక్‌కు చేరుకున్నారు. ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదితో మాట్లాడారు. తర్వాత మంత్రుల ఉపసంఘంతో చర్చలు జరిపారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, దానం నాగేందర్, రఘువీరారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చల్లో పాల్గొన్నారు. జీతాల చెల్లింపు, ఉద్యోగుల మీద కేసుల ఎత్తివేత డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. కేసుల ఎత్తివేతపై చర్చించేందుకు డీజీపీ దినేశ్‌రెడ్డినీ పిలిపించారు. ఉద్యోగుల డిమాండ్లను యథాతథంగా అంగీకరించడానికి సర్కారు మొదట తటపటాయించింది.

సాయంత్రం 4.30 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎం వద్ద తుది చర్చలు ఉన్నాయని, అన్నీ సజావుగానే జరుగుతున్నాయని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. విరమణ ఒప్పందం రూపకల్పనపై అధికారులు, ఉద్యోగ సంఘాలు సుదీర్ఘ కసరత్తు చేశారు. ఫలితంగా 4.30 గంటలకు ఉద్యోగ సంఘాల నేతలు క్యాంపు కార్యాలయానికి వెళ్లకుండా సచివాలయంలోనే ఉండిపోయారు. ఒప్పందంలో ప్రస్తావించాల్సిన అంశాల తీరుపై జేఏసీ నేతల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. అధికారులతోనూ పలు దఫాలుగా సమావేశమైనా ఏకాభిప్రాయం సాధ్యపడకపోవడంతో దామోదరను కలిసి సమస్యను వివరించారు. సీఎస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులతో మాట్లాడి ‘ఒప్పంద పత్రం రూపకల్పన’ కసరత్తును కొలిక్కి తెచ్చారు.

జీతం చెల్లింపు, కేసుల ఎత్తివేత, సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించడం సహా మొత్తం 9 డిమాండ్లను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందుంచాయి. వాటన్నింటినీ అంగీకరిస్తామంటూ ప్రభుత్వం ఒప్పందంలో పేర్కొన్నా పేర్కొనకపోయినా... వాటి అమలు బాధ్యత స్వీకరిస్తానని ఉద్యోగ సంఘాలకు దామోదర హామీ ఇచ్చారు. దాంతో ‘సీన్’ సచివాలయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి మారింది. సీఎం సమక్షంలో తుది చర్చలు జరిగాయి. ఒప్పందం గురించి సీఎంకు వివరించారు. ఉద్యోగుల ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంతో చర్చించిన ఉద్యోగ సంఘాల నేతలు, అక్కడే సమ్మె విరమణ ప్రకటన చేశారు.

విరమణ కాదు.. తాత్కాలిక వాయిదానే: కోదండరాం
తెలంగాణ ఉద్యమాన్ని క్రియాశీలంగా నడపడంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని, సమ్మెను వాయిదా వేసినా ఉద్యమంలో వారి భాగస్వామ్యం కొనసాగుతుందని కోదండరాం చెప్పారు. సీఎంతో చర్చల తర్వాత సంఘాల నేతలు నేరుగా జేఏసీ కార్యాలయానికి వెళ్లి చర్చల వివరాలను ఆయనకు వివరించారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం ప్రకటన చేయాల్సిన అనివార్యతను సకల జనుల సమ్మె కల్పించిందన్నారు. సాధించిన విజయాలను కాపాడుకొంటూ ఉద్యమ రూపాలను మార్చుకొని మరింత ఉద్ధృతంగా పోరాడతామని చెప్పారు.

రాజకీయ జేఏసీ సూచన మేరకే సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశాం తప్ప విరమించలేదని స్వామి గౌడ్ చెప్పారు. సమ్మెకు ప్రజలు సంపూర్ణంగా సహకరించారంటూ అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మేల్కొల్పడంలో సఫలమయ్యామన్నారు. అయితే తెలంగాణ తెచ్చే సత్తా ఉద్యోగులకు లేదన్నారు. వాయిదా నేపథ్యంలో నూతనోత్సాహంతో కార్యాలయాలకు హాజరు కావాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

సర్కారు అంగీకరించిన డిమాండ్లు ఇవీ..
తొమ్మిది డిమాండ్లతో కూడిన సమ్మె విరమణ ఒప్పందం మీద జీఏడీ కార్యదర్శి(పొలిటికల్) అజయ్ మిశ్రా, ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఉద్యోగులు పేర్కొన్నారు. డిమాండ్లు, సర్కారు హామీలు ఇవీ...

1. 610 జీవో అమలు పర్యవేక్షణకు హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వం: హైకోర్టు మాజీ న్యాయమూర్తి లభించని పక్షంలో జిల్లా మాజీ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేస్తాం.

2. సమ్మె కాలంలో ఎస్మా ప్రయోగం నిలిపివేయాలి.
ప్రభుత్వం: పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం.

3. ఉద్యోగుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.
ప్రభుత్వం: విద్రోహ చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొనని ఉద్యోగుల మీద పెట్టిన కేసులను తొలగిస్తాం.

4.177 జీవో రద్దు చేయాలి.
ప్రభుత్వం: ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది.

5. సమ్మె కాలంలో జరిగిన బదిలీలు, డిప్యుటేషన్లు రద్దు
ప్రభుత్వం: పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.

6. సమ్మె కాలాన్నీ ఆన్‌డ్యూటీగా పరిగణించాలి. హాఫ్ పే లీవ్ అమలు చేయాలి.
ప్రభుత్వం: రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సలహా తీసుకోవడంతో పాటు హైకోర్టు ఆదేశాల అమలు మేరకు వ్యవహరిస్తాం.

7. ‘నో వర్క్, నో పే’ అమల్లో ఉన్నా.. స్పెషల్ కేసుగా పరిగణిస్తూ మినహాయింపు ఇవ్వాలి. హాఫ్ పే లీవ్ ప్రభుత్వానికి సరండర్ చేయనున్న నేపథ్యంలో..పండుగలు వస్తున్నందున ఉద్యోగులకు అడ్వాన్స్ ఇవ్వాలి.
ప్రభుత్వం: అడ్వాన్స్ రూపంలో జీతం ఇస్తాం. అడ్వాన్స్‌ను ఎలా రికవరీ చేయాలి, ఏవిధంగా సర్దుబాటు చేయాలో జేఏసీ నేతలతో చర్చిస్తాం.

8. సమ్మె కాలంలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల మీద విధించిన ఆంక్షలను తొలగించడంతో పాటు తొలగించిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలి.
ప్రభుత్వం: మంచి నడవడిక ఉన్న ఉద్యోగులను తీసుకోవాలని ఆదేశిస్తాం.

9. ఉద్యోగుల ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి.
ప్రభుత్వం: తగిన ఏర్పాట్లు చేస్తుంది.

No comments: