- ఎంసెట్లో ఎంబిబిఎస్ రద్దు
- ఇంగ్లీషు, హిందీ భాషల్లో పరీక్ష : డిఎల్
- తెలుగులోనూ ఉంటుంది: ఆజాద్
- రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర నష్టం : విద్యావేత్తలు
రాష్ట్రప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోకుండానే వైద్య విద్య ప్రవేశ పరీక్షపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎంసెట్ నుంచి ఎంబిబిఎస్ పరీక్ష తొలగించనున్నట్లు చెప్పారు. ఇకనుంచి మెడికల్ ఎంట్రెన్స్ జాతీయస్థాయిలో ఉంటుందని, ఎంసిఐ నిబంధనల ప్రకారం పరీక్ష ప్రాంతీయ భాషల్లో ఉండదని, ఇంగ్లీషు, హిందీ భాషల్లోనే ఉంటుందని తెలిపారు. అయితే ఎంసెట్లో ఎంబిబిఎస్ రద్దుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, జాతీయ పరీక్షపై ఇప్పటివరకు అధికారిక ఉత్తర్వులు రాలేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. దీంతో అటు మంత్రి ప్రకటన, ఇటు అధికారుల వైఖరితో విద్యార్థులు ఆయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో మాట్లాడుతూ ఎంబిబిఎస్ ఎంట్రన్స్ జాతీయ పరీక్ష తెలుగు భాషలోనూ ఉంటుందని ప్రకటించారు. వచ్చే సంవత్సరం మే 13న ప్రవేశ పరీక్ష జరిగే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ద్వారానే ఎంబిబిఎస్ సీట్లను భర్తీ చేయాలన్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతంగా చర్చించాల్సిన అవసరముందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కారదర్శి కె చంద్రమోహన్ అన్నారు. రాష్ట్ర అంశంగా ఉన్న వైద్య విద్యను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ప్రముఖ విద్యావేత్త, శాసన మండలి సభ్యుడు చుక్క రామయ్య అన్నారు.
గురువారం సచివాలయంలో వ్యాధులపై విలేకరుల సమావేశం అనంతరం మెడికల్ ఎంట్రన్స్పై మంత్రి మాట్లాడారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసిఐ) తీసుకున్న నిర్ణయం మేరకు మెడికల్లో ఒక పరీక్ష మాత్రమే ఉంటుందని, రాష్ట్రంలో ఎంసెట్లో ఎంబిబిఎస్ ప్రవేశ పరీక్ష ఉండదని చెప్పారు. జాతీయస్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం పాటించక తప్పదన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎంసెట్లో ఎంబిబిఎస్ పరీక్ష ఉండదన్నారు.
వచ్చే ఏడాది నుంచి ఉమ్మడి మెడికల్ ప్రవేశ పరీక్ష
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో 2012 నుంచి జాతీయ స్థాయిలో మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నాపత్రం ప్రాంతీయ భాషల్లో కూడా ఇవ్వాలని ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు కోరాయని, ఈ సారి నుంచి దాన్ని అమలు చేస్తామని చెప్పారు.
రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర నష్టం
జాతీయస్థాయిలో ప్రవేశపరీక్ష వలన రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రత్యేకించి తెలుగు మీడియం విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశాలు కోల్పోవల్సి ఉంటుంది. కేవలం పట్టణ ప్రాంతాల్లోని కార్పొరేట్ కళాశాలల్లో, ఇంటర్నేషనల్ స్కూళ్ళలో సిబిఎస్ఇ చదువుతున్న డబ్బున్న కొద్దిమంది విద్యార్థులకే లాభం చేకూరుతుంది. సిబిఎస్ఇ సిలబస్ ఉన్న విద్యార్థులకు తప్ప రాష్ట్ర సిలబస్లో ఇంటర్ పూర్తి చేసిన వారికి ఈ పరీక్ష నష్టదాయకం. ఈ విధానం రాష్ట్రంలో ఆచరణ సాధ్యం కాదని కొందరు విద్యావేత్తలు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన సిలబస్ లేదని, కాబట్టి పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని అన్నారు. దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం ఉన్నప్పుడే జాతీయ పరీక్ష సాధ్యమవుతుందని చెబుతున్నారు. నాలుగైదు నెలల్లో పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో జాతీయ స్థాయి ప్రవేశపరీక్షకు, ఇంటర్మీడియట్ పరీక్షకు సిద్ధం కావడం కష్టమని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంటర్ సిలబస్కు, జాతీయ సిలబస్కు చాలా తేడాలున్నాయని, ఏ పరిస్థితుల్లో చూసినా ఇది రాష్ట్ర విద్యార్థులకు నష్టకరమని అంటున్నారు.
వైద్య కళాశాలలు రాష్ట్రాల వారీగా ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించకుంటూ అడ్మిషన్లు జరుపుతున్నాయి. ఇందులో కొన్ని
ప్రభుత్వాలు నిర్వహిస్తుండగా డీమ్డ్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాయి. ఆ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఏడెనిమిది పరీక్షలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విధానాన్ని మార్చుతూ జాతీయస్థాయిలో ఒకే ప్రవేశపరీక్ష ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కొన్ని కార్పొరేట్ కళాశాలల యాజామాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. దానిప్రకారం కొంతకాలంగా చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. దేశవ్యాప్తంగా నేషనల్ ఎంట్రెన్స్ ఎలిజిబుల్ టెస్ట్(నిట్) ద్వారా ప్రవేశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు గత సంవత్సరం మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాలు ప్రకటించినా మన రాష్ట్రప్రభుత్వం మాత్రం నివేదిక ఇవ్వలేదని తెలిసింది. దీనిపై చర్చ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఉన్నత విద్యామండలి తరపున కేంద్రానికి సమాచారం పంపింది. ఒకవేళ ఉమ్మడి పరీక్ష నిర్వహించాలనుకుంటే రెండేళ్ళు ముందుగా విద్యార్థులకు తెలియజేయాలని కోరింది. పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామో చెప్పకుండా ఇప్పటినుండే పరీక్ష పెడతామనడం సరైందికాదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ జయప్రకాశ్రావు అన్నారు.
ఐదారు నెలల్లో ఇంటర్ పరీక్ష
రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సులో ఇప్పటికే 18 నెలలు విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. నాలుగైదు నెలల్లో అంటే మార్చిలో ఇంటర్ పరీక్ష జరగనుంది. జాతీయ పరీక్షకు, రాష్ట్రంలోనే పోటీ పరీక్షలకు సిలబస్ వేరుగా ఉంటుంది. ఐదారు నెలల్లో కొత్త సిలబస్ ప్రకారం తయారుకావాలంటే విద్యార్థులకు కష్టమే. జువాలజీ, బొటానీ సబ్జెక్టుల్లో 50 శాతం సిలబస్ వేరుగా ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ పది నుంచి 15 శాతం సిలబస్ వేర్వురుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎంసెట్లోని ఎంబిబిఎస్ ప్రవేశ పరీక్షకు రాష్ట్రంలో 60 నుండి 70 వేల మంది బైపిసి విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో తెలుగు మీడియం విద్యార్థులు సగానికిపైగా ఉన్నారు. వారు జాతీయ పరీక్ష ద్వారా నష్టపోతారని అంటున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతారు.
విస్తృత చర్చ అవసరం
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్
జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ద్వారానే ఎంబిబిఎస్ సీట్లను భర్తీ చేయాలన్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతంగా చర్చించాల్సిన అవసరముందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కారదర్శి కె చంద్రమోహన్ అన్నారు. ఈ విధానాన్ని కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కాశ్మీర్ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల్లో వైద్య విద్యకు సంబంధించి విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా మెడిసిన్ సీట్లు ఉన్నాయని, అందువల్ల అందరితో చర్చించిన తర్వాత రాష్ట్ర విద్యార్థులకు నష్టం కలగనిరీతిలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో తెలుగు మీడియంలో బైపిసి తీసుకున్న విద్యార్థులకు జాతీయ స్థాయిలో ఆంగ్లం, హిందీ భాషల్లో నిర్వహించే ప్రవేశపరీక్ష రాయడం కష్టతరమవుతుందన్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన సిలబస్ ఇప్పటికే 60 శాతం పూర్తయిన నేపథ్యంలో అకస్మాత్తుగా జాతీయ స్థాయి పోటీ పరీక్ష గురించిన నిర్ణయం వెలువరిస్తే విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతారని పేర్కొన్నారు. అందువల్ల ఈ నిర్ణయాన్ని వాయిదా వేసి, అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
వైద్య విద్యను ఆధీనంలోకి తీసుకొనేందుకే....
ఎమ్మెల్సీ చుక్క రామయ్య
రాష్ట్ర అంశంగా ఉన్న వైద్య విద్యను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ప్రముఖ విద్యావేత్త, శాసన మండలి సభ్యుడు చుక్క రామయ్య అన్నారు. విద్యను కేంద్రీకృతం చేయాలన్న దానిలో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. సమాఖ్య వ్యవస్థలో ఇది సరికాదని అన్నారు. మెడిసిన్కు జాతీయ స్థాయిలో అర్హత పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయాన్ని కేరళ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంలో వైద్య విద్య కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న పరిస్థితులను, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మెడిసిన్ అర్హతా పరీక్షలను నిర్వహిస్తుంటాయని చెప్పారు. ఇప్పటి వరకూ వైద్యాన్ని కార్పొరేటీకరించిన ప్రభుత్వాలు రానున్న రోజుల్లో వైద్య విద్యను కూడా కార్పొరేట్కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మెడిసిన్ అర్హత పరీక్షనే తన అధీనంలోకి తీసుకుంటున్నట్లు అగుపిస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో అడ్మిషన్లను, ఆ తర్వాత పూర్తిగా వైద్య విద్యనే తన గుత్తాధిపత్యంలోకి తీసుకుంటుందని హెచ్చరించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల మీద దాడి చేయడమేనని అన్నారు.
No comments:
Post a Comment