- తెలంగాణపై రోజంతా చర్చోపచర్చలు
- ఒకటి, రెండు రోజుల్లో కీలక ప్రకటన!
- ప్రణబ్ సారథ్యంలో ఆంటోనీ, చిదంబరం, ఆజాద్ బృందం కసరత్తు
- రాష్ట్రానికి చెందిన 9 మంది కాంగ్రెస్ నేతలతో విడివిడిగా భేటీలు
- తెలంగాణపై ఏం చేద్దామంటూ అభిప్రాయాలు కోరిన అగ్రనేతలు
- అభిప్రాయాలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం, బొత్స, డీఎస్, కేంద్ర
- మంత్రులు జైపాల్, కిశోర్చంద్రదేవ్, పురందేశ్వరి, పళ్లంరాజు, పనబాక
- ప్రధాని, చిదంబరంలతో వేర్వేరుగా భేటీ అయిన గవర్నర్..
- రాష్ట్ర పరిస్థితిపై నివేదికలు సమర్పణ
- రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటటం పట్ల సీఎంపై ఆగ్రహించిన అధిష్టానం
- పరిస్థితిని చక్కదిద్దటానికి మరో అవకాశం ఇస్తున్నట్లు పరోక్ష హెచ్చరిక
- ‘సమ్మె’ విరమింపచేసేందుకు చర్చలతో ప్రయత్నించాలని,
- లేదంటే కఠినంగా వ్యవహరించాలని కిరణ్కు సూచనలు
- రాష్ట్రపతి పాలన, రెండో ఎస్ఆర్సీ అవకాశాలపై తర్జనభర్జనలు
- రేపు మరికొందరు నేతలతో మాట్లాడాలని ప్రణబ్ బృందం నిర్ణయం
- కావూరి, చిరంజీవిలకు ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం పిలుపు
తెలంగాణ అంశంపై హస్తినలో రాజకీయం వేడెక్కింది.
- కాంగ్రెస్ అగ్ర నాయకత్వం పార్టీ రాష్ట్ర నాయకులతో శనివారం రోజంతా చర్చలు, సంప్రదింపుల్లో తల మునకలైంది.
- రాష్ట్ర గవర్నర్ కూడా ప్రధానమంత్రితో పాటు ప్రభుత్వ పెద్దలను కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తూ నివేదికలు అందజేశారు.
- మొత్తంమీద.. ఒకటి రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఢిల్లీ చర్చలు నడిచాయి.
- సోమవారం కూడా రాష్ట్రానికి చెందిన మరికొందరు నేతలతో మాట్లాడిన తర్వాత కీలక ప్రకటన వెలువడే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
- తెలంగాణలో సకల జనుల సమ్మె కారణంగా ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుండటంతో..
- ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను కాంగ్రెస్లో అనుభవజ్ఞుడుగా పేరొందిన ఆర్థికమంత్రి ప్రణబ్ముఖర్జీకి అప్పగించటం..
- ఆయన శుక్రవారం రంగంలోకి దిగి పార్టీ అధ్యక్షురాలు, ప్రధానమంత్రి, కేబినెట్ సహచరులతో విడివిడిగా సమావేశమై సమాలోచనలు జరపటం తెలిసిందే. దానికి కొనసాగింపుగా ప్రణబ్ సారథ్యంలోని కాంగ్రెస్ అగ్రనాయకుల బృందం..
- శనివారం రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు మొత్తం తొమ్మిది మంది ముఖ్యులను పిలిపించుకుని వారితో వేర్వేరుగా సంప్రదింపులు జరిపింది.
- విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తీరుపై అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటే వరకు వెళ్లటంలో సీఎం వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. కిరణ్ పనితీరును తప్పుపడుతూనే.. ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకోబోయే ముందు ఒక అవకాశం ఇచ్చి చూడాలని భావించాం’’ అని ఏఐసీసీ నాయకుడొకరు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు, సంప్రదింపులు జరపటం ద్వారా సకల జనుల సమ్మెను విరమింపజేయటం.. అది సాధ్యంకాని పక్షంలో కఠినంగా వ్యవహరించి అదుపు చేయటమన్న ఎజెండాను ఈ సందర్భంగా అధిష్టానం ముఖ్యమంత్రికి నిర్దేశించింది. ఆ క్రమంలో విఫలమైతే కేంద్రమే కఠిన నిర్ణయాలు చేయకతప్పదని హెచ్చరికతో కూడిన సంకేతాలను కూడా ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు.. రాష్ట్రంలో పరిస్థితులు, పరిణామాలపై గవర్నర్ అందజేసిన నివేదిక, సంప్రదింపుల్లో పలువురు నాయకులు వెల్లడించిన అంశాలనుబట్టి.. రాష్ట్రంలో ప్రభుత్వం అచేతనంగా ఉందన్న అభిప్రాయానికి కేంద్ర నాయకత్వం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చేయి దాటాయని నిర్ధారించుకున్న అధిష్టానం పెద్దలు ఒక దశలో.. రాష్ట్రపతి పాలన విధించటం ద్వారా పరిస్థితులను చక్కదిద్దవచ్చా? అని తర్జనభర్జన పడ్డారు. అలాంటిదేమీ లేదని పార్టీ నేతలు పైకి కొట్టిపారేసినప్పటికీ.. మరో అవకాశం తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చిన కారణంగానే రాష్ట్రపతి పాలన అంశం బయటపడకుండా జాగ్రత్తపడినట్లు చెప్తున్నారు.
- పార్టీ పెద్దల పిలుపు మేరకు ఢిల్లీ వచ్చిన ఉప ముఖ్యమంత్రి శనివారం మధ్యాహ్నమే హైదరాబాద్ తిరిగివెళ్లగా.. ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం వెళ్లిపోయారు. గవర్నర్ మాత్రం ఢిల్లీలోనే ఆగిపోయారు. ఆయన సోమవారం రాత్రికి తిరిగి హైదరాబాద్ వెళతారు. ఆయన బయలుదేరటానికి ముందే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నందునే గవర్నర్ను సోమవారం కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సూచించనట్లు సమాచారం. అలాగే.. రాజకీయ కోణంలో చూస్తే తెలంగాణ అంశంతో పాటు దేశంలో ఇతర చిన్న రాష్ట్రాల డిమాండ్లన్నింటినీ పరిష్కరించేందుకు రెండో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్ఆర్సీ) ఏర్పాటే కాంగ్రెస్కు లాభదాయకమన్న అంశంపైనా ప్రణబ్ బృందం తర్జనభర్జనలు పడినట్లు చెప్తున్నారు.
- అంతా ప్రణబ్ నేతృత్వంలోనే...
- ఆర్థికమంత్రి, కాంగ్రెస్ కోర్ కమిటీ కీలక నేత ప్రణబ్ముఖర్జీ ఆధ్వర్యంలో పార్టీ, కేబినెట్లో ఆయన సహచరులైన పి.చిదంబరం, ఎ.కె.ఆంటోనీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్లతో కూడిన బృందం.. నార్త్బ్లాక్లోని ప్రణబ్ కార్యాలయంలో శనివారం రోజంతా సంప్రదింపులు కొనసాగించింది. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ప్రధాన నాయకులు తొమ్మిది మందిని పిలిపించి వారితో కీలక అంశాలపై మాట్లాడింది. సీఎం కిరణ్కుమార్రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్తోపాటు.. కేంద్ర మంత్రులు ఎస్.జైపాల్రెడ్డి, కిషోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, ఎం.ఎం.పళ్లంరాజు, డి.పురందేశ్వరిలు ప్రణబ్ బృందం వద్దకు వెళ్లి తమ అభిప్రాయాలను తెలియజేశారు. సీఎం వెంట రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ బినయ్కుమార్ కూడా భేటీకి హాజరయ్యారు. ప్రణబ్ బృందానికి సీఎం రెండు కీలక నివేదికలు అందజేసి పరిస్థితులపై చర్చించారని సమాచారం.
- నాయకులను ఏం అడిగారంటే...
- రాష్ట్ర నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడిన ప్రణబ్ బృందం.. సమస్య పరిష్కార మార్గాలను దృష్టిలో పెట్టుకుని పలు ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ వర్గాల కథనం ప్రకారం.. ప్రణబ్ బృందం ప్రధానంగా మూడు అంశాలపై నేతల అభిప్రాయాలను సేకరించింది. అవేమిటంటే.. 1. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై మీకున్న అభ్యంతరాలేమిటి? 2. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంది? 3. సకల జనుల సమ్మె నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మాటేమిటి? ఆయా నేతలు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నప్పుడు.. ప్రణబ్ బృందం మరికొన్ని అనుబంధ ప్రశ్నలు అడిగి సమాచారం రాబట్టుకుంది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ వంటి వారినయితే ప్రత్యేక రాష్ట్రమిస్తే సీమాంధ్రలో రాజీనామాలు చేసే నేతలు ఎంత మంది ఉన్నారు? అక్కడ పెల్లుబికే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుంది? దాన్ని ఎదుర్కోగలమా లేదా? వంటి ప్రశ్నలు అడిగి వారి అభిప్రాయాలను నమోదుచేసుకున్నారని తెలియవచ్చింది.
- రాష్ట్ర విభజనపై అభిప్రాయాన్ని కోరినపుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి జైపాల్రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాల్సిందేనని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి, పళ్లంరాజు మాత్రం సమస్య తీవ్రమై ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతున్న దృష్ట్యా ఇక ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారని తెలిసింది. అధిష్టానం ప్రకటించే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని, అయితే తమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారని అంటున్నారు. మొత్తం మీద రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలు.. ‘‘మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి.. ఇప్పటికే ఆలస్యమైంది..’ అని చెప్పి బంతిని హైకమాండ్ కోర్టులోనే నెట్టేశారు. ఆ కారణంగానే మరికొంత మంది నేతలతో సోమవారం సంప్రదించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.
- కావూరి, చిరంజీవిలకు పిలుపు
- సీఎం కిరణ్కుమార్ రెడ్డి కోర్ కమిటీ నేతలతో పాటు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్నూ కలిశారు. సీఎం, డిప్యూటీ సీఎం శనివారమే హైదరాబాద్ తిరిగిరాగా.. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్లు ఢిల్లీలోనే ఉండిపోయారు. మరోవైపు.. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎంపీ కావూరి సాంబశివరావు, ఇటీవలే కాంగ్రెస్లో విలీనమైన పీఆర్పీ నేత చిరంజీవిలను కూడా పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. కావూరి శనివారమే ఢిల్లీకి రాగా చిరంజీవి ఆదివారం చేరుకోనున్నారు.
- ప్రధానితో గంటన్నర పాటు గవర్నర్...
- మరోవైపు గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రే ఆజాద్ను కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ఇక శనివారం రోజంతా ప్రభుత్వ పెద్దలతో సమావేశాల్లో బిజీగా గడిపారు. ఉదయం హోంమంత్రి చిదంబరంతో మొదలుపెట్టి వరుసగా ప్రధాని మన్మోహన్సింగ్, ఎ.కె.ఆంటోనీ, ప్రణబ్ముఖర్జీలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. ఈ భేటీల్లో ఆయన రాష్ట్ర పరిస్థితులను వారికి వివరించారు. ప్రధాని దగ్గర ఆయన అత్యధికంగా గంటన్నరపాటు కూర్చున్నారు. ప్రధానికి, హోంమంత్రికి గవర్నర్ సవివరమైన నివేదికలు అందజేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్తో గవర్నర్ భేటీపై భిన్న కథనాలు వినవస్తున్నాయి. ఆయన శనివారం సాయంత్రం రాష్ట్రపతితో సమావేశమయ్యారని కొందరు అంటుండగా.. ఆయన రాష్ట్రపతి భవన్కు వెళ్లినప్పటికీ అక్కడ ఆమె లేకపోవటంతో కేబినెట్ సెక్రటరీతో మాట్లాడి వచ్చారని మరికొన్ని వర్గాలు చెప్తున్నాయి.
- సర్వత్రా ఉత్కంఠ: గవర్నర్తో సహా రాష్ట్ర ముఖ్యులందరినీ హడావిడిగా ఢిల్లీకి పిలిపించటంతో తెలంగాణ అంశంపై ఎలాంటి నిర్ణయం చేయబోతున్నారన్న అంశం.. రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజల్లో కూడా ఉత్కంఠ కలిగించింది. తెలంగాణ, సమైక్యాంధ్రప్రదేశ్ వాదనలపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోనుందన్న అంశంపైనే అందరూ దృష్టి పెట్టారు. కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కేంద్రం తెలంగాణను ప్రకటిస్తుందా? మరింత జాప్యం జరుగుతుందా? సకల జనుల సమ్మెను విరమింపచేయటానికి వీలుగా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా? రాష్ట్రపతి పాలన విధిస్తారా? తదితర అంశాలపై రాజకీయ పార్టీల నాయకుల మధ్య చర్చ సాగింది.
- సీఎం మార్పుపైనా చర్చ!
- మరోవైపు.. ఇప్పటి పరిస్థితి యథాతథంగా కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు చేసే అవకాశాలు ఉండవచ్చన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దటంలో ముఖ్యమంత్రిగా కిరణ్కుమార్రెడ్డి విఫలమయ్యారన్న అభిప్రాయానికి వచ్చిన పార్టీ అధిష్టానం.. ఆయన స్థానంలో వేరే వారికి, ముఖ్యంగా తెలంగాణ నేతకు బాధ్యతలు అప్పగించవచ్చని చెప్తున్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను పిలిపించటంలోని ఆంతర్యం కూడా ఇదే కావచ్చన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో ఉంది. మరోపక్క సీమాంధ్ర నేతలు ఢిల్లీ పరిణామాలపై చాలా ధీమాగా కనిపించారు. శనివారం సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన మంత్రి శైలజానాథ్, ఏరాసు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్యేలు గాదె వెంకటరెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు ఢిల్లీలోని పరిణామాలపై చర్చించారు. శైలజానాథ్ సీఎల్పీ నుంచే ఎంపీ కావూరి సాంబశివరావుతో ఫోన్లో మాట్లాడారు.
- ఆంటోనీకి కోమటిరెడ్డి ఫిర్యాదు
- ఇదిలావుంటే.. తన సోదరుడు, రాష్ట్ర మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై దుష్ర్పచారం జరుగుతున్నదంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కేంద్ర మంత్రి ఎ.కె.ఆంటోనీకి ఫిర్యాదు చేశారు. ఆంటోనీని ఆయన కార్యాలయంలో రాజగోపాల్ కలిసినట్లు సమాచారం. తన సోదరుడు తెలంగాణ కోసమే రాజీనామా చేశారని, ఇతర కారణాలేం లేవని, అయితే కావాలని పార్టీలో కొందరు తన సోదరుడిపై దుష్ర్పచారానికి పాల్పడుతున్నారని ఆయన ఆంటోనీ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. తెలంగాణ ప్రాంతంలో సకల జనుల సమ్మె తీవ్ర రూపం దాల్చిందని, సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరటమే కాకుండా ప్రత్యేక రాష్ట్ర లక్ష్య సాధనకు తన సోదరుడు పాటుపడుతున్నారే తప్పించి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం లేదని చెప్పినట్లు తెలియవచ్చింది.
- రేపటికల్లా సంప్రదింపులు పూర్తి
- నిర్ణయమెప్పుడో ఇప్పుడు చెప్పలేను: ప్రణబ్
న్యూఢిల్లీ, న్యూస్లైన్: తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. దాన్ని సోమవారానికల్లా పూర్తి చేయగమలని భావిస్తున్నామన్నారు. అయితే నిర్ణయాన్ని మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేనన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో శనివారం తన కార్యాలయంలో రెండు విడతలుగా సంప్రదింపులు జరిపాక విలేకరులతో మాట్లాడిన ఆయన... యూపీఏ భాగస్వామ్య పక్షాలతోనూ చర్చిస్తారా అన్న ప్రశ్నకు బదులివ్వకుండానే వెళ్లిపోయారు.
Pages
▼
No comments:
Post a Comment