చిన్నారులూ..! ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆయనెవరో తెలుసా?
టీషర్టులపై, స్టిక్కర్లపై, కప్పులపై, సైకిల్ కీచైన్లపై.. అబ్బో ఒకటేమిటి
ఇలా మీరు నిత్యం వాడే ఎన్నో వస్తువులపై ఆయన చిత్రం ఉండటాన్ని మీరెంతో
ఇష్టపడతారు కదూ! నక్ష్రతం ముద్రించిన టోపీతో దర్శనమిచ్చే ఆయన చిత్రం మీలో
చాలామందికి తెలుసు. ఆయనే 'చే గువేరా'. అలాగే 'చే'.. అనే పేరూ మీకు
సుపరిచితమే! కానీ 'చే' ఎవరు?.. ఆయన ఏం చేశాడు?..' అన్న విషయాలు మాత్రం మీలో
చాలామందికి తెలియవనుకుంటా! బొలీవియా విముక్తి పోరాటం చేస్తున్న 'చే'
సిఐఎకి పట్టుబడ్డాడు. ఆ మరుసటి రోజే 1967, అక్టోబర్ తొమ్మిదవ తేదీ
మధ్యాహ్నం అమెరికా ఆదేశాలతో 'చే'ని బొలీవియన్ సార్జెంటు కాల్చివేశాడు. ఈ
సందర్భంగా.. ఆ గొప్ప విప్లవకారుని గురించి తెలుసుకుందామే..!
'చే'..
ఈ పేరు వినగానే అమెరికా సామ్రాజ్యవాదు లకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
విప్లవకారుల గుండెలు మరింత ధిటవుగా మారతాయి. పేద ప్రజలకు 'చే' ఓ ధృవతార. ఈ
తార ఎక్కువకాలం భూమిపై నిలవకపోయినా వెలుగులు మాత్రం ప్రజ్వరిల్లుతూ నేటికీ
విశ్వవ్యాప్తంగా ప్రసరిస్తూనే ఉన్నాయి. అనునిత్యం ఉత్తేజాన్నిస్తూ ఆరని
విప్లవజ్యోతిగా, స్ఫూర్తిప్రదాతగా చరిత్రలో 'చే' నిలిచిపోయాడంటే అతిశయోక్తి
కాదు.
'చే' అసలు పేరు 'ఎర్నెస్టో గువేరా డి లా సెర్నా'..
అర్జెంటీనాలోని రొసారియా పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్యతరగతి కుటుంబంలో
జన్మించాడు. చిన్నతనం నుంచి అస్తమా (ఉబ్బసం)తో బాధపడేవాడు. కానీ ఆయనలోని
కార్యదీక్ష, పట్టుదల దాన్ని మరిపించే వి. చూడగానే ఎంతో చురుకైన చూపులతో
శత్రువుల కు వణుకు పుట్టించేవాడు. అదే సందర్బంలో 'చే' సున్నిత మనస్కుడు
కూడా. అందుకే ప్రజల తరఫున నిలిచాడు.
'చే' ఇంజనీరింగ్ చదివినా,
ప్రజలకు సేవ చేయా లనే ఉద్దేశంతో మెడిసిన్లో చేరాడు. 1953లో బ్యూనస్
ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్యవిద్యలో పట్టా పొందాడు. డాక్టర్గా
కుష్టురోగుల ఆస్పత్రిలో పనిచేయా లన్న కోరికతో వెనిజులా వెళ్లాడు. కానీ
అప్పటికే అర్జెంటీ నా, ఇతర లాటిన్ అమెరికా దేశాల్లో రైతుల, ఇండియన్ తెగల
ప్రజల మీద అమెరికా సామ్రాజ్యవాద ముష్కరుల ఆధిపత్యం కొనసాగుతోంది. ఆ దేశాల
రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను అమెరికా ప్రభుత్వం, సిఐఎ నియంత్రిస్తు న్నాయి.
వారి ఆధిపత్యాన్ని ఆయా ప్రభుత్వాలు ఏమాత్రం వ్యతిరేకించినా వెంటనే అవి
పతనమయ్యేవి. ఆ సమ యంలో 'చే' మోటారు సైకిల్పై దక్షిణ అమెరికా ఖండ మంతా
పర్యటించాడు. ఆ సందర్భంగా ప్రజల జీవనస్థితి గతులను తెలుసుకున్నాడు.
విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని 'చే' భావించాడు.
అలా
1954లో గౌటెమాల దేశంలో ప్రజాబాహు ళ్యపు అభ్యున్నతికి కృషిచేస్తున్న
సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా
కుట్ర వల్ల ఆ ప్రభుత్వం కూలిపోవడంతో మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని
విప్లవ దృక్పథం మరింత బలపడింది.
మెక్సికోలో కాస్ట్రో నాయకత్వంలో
అక్కడికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో 'చే' చేతులు కలిపాడు. 1950వ
దశకం చివరిలో అప్పటి క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో
ఆధ్వర్యంలో జరిగిన గెరి ల్లా పోరాటం (1956-59) లో 'చేగువేరా' ముఖ్యపాత్ర
పోషించాడు. డాక్టర్గా, మిలిటరీ కమాండర్గా సేవలం దించాడు. ఈ సమయంలోనే అతను
'చే'గా పిలువ బడ్డాడు. గువేరా ఎవరినైనా పలకరించే సమయంలో 'చే' అనే
అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండ టంతో క్యూబన్ విప్లవకారులందరూ
అతన్ని 'చే' అనే పిలవడం మొదలుపెట్టారు. అలా 'చే' అనే పేరు గువేరాకు
స్థిరపడిపోయింది.
పోరాటం విజయవంతమయ్యాక కాస్ట్రో 1959 జనవరిలో
క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టాడు. ఈ ప్రభుత్వంలో 'చే' పరిశ్రమల
మంత్రిగా, క్యూబా జాతీయ బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేశాడు. క్యూబా
ప్రతినిధిగా అనేకదేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలో భాగంగానే 'చే' 1959 జులైలో
మన దేశంలోనూ పర్యటించాడు. అభివృద్ధిచెందుతున్న మనలాంటి దేశాల మీద అమెరికా
పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన 'చే గువేరా' క్యూబా సామ్యవాదదేశంగా
మారటానికి దోహదపడ్డాడు.
గెరిల్లా యుద్ధం గురించి వివరించే తన రచన లలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో రైతాంగ విప్లవోద్య మాలు నిర్మాణం కావాలని ఆకాంక్షించాడు.
'జీవితంలో
ఏదైనా సాధించాలంటే అన్నింటినీ, అందరినీ వదులుకోవటానికి సిద్ధంగా ఉండాలి'
అంటూ పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తి చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే
1965లో క్యూబాలో తన అత్యు న్నత స్థానాలను, దేశాన్ని వదిలి కొద్దిమంది
అనుచరు లతో రహస్యంగా ఆఫ్రికాలోని కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ
దేశం యొక్క తూర్పుప్రాం తంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించాడు. ఆ
సమయంలో తన లక్ష్యం గురించి తన పిల్లలకి 'చే' రాసిన చివరి ఉత్తరం ఇది....
'ప్రియమైన హిల్లితా అలిదితా కామిలో సెలీనా ఏర్నేస్తో..!
నేను
మీతో లేను కాబట్టి కొన్ని సంగతులు చెప్పేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఏదో
ఒకనాటికి మీకు ఇది అందినపుడు మీరు ఇవన్నీ తెలుసుకుంటారు.
ప్రపంచంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా స్పందించడం చాలా అవసరం. ప్రతి విప్లవకారుడికి ఉండి తీరాల్సిన లక్షణం ఇదే..
నా పిల్లలందరికీ వీడ్కోలు పలుకుతున్నాను. మిమ్మల్ని మళ్లీ కలుస్తాననే నా ఆశ..'
ఆలింగనాలతో .. చే..
1967
చివరిలో 'చే' దక్షిణ అమెరికా చేరి బొలీవి యాలో గెరిల్లా యుద్ధ
కార్యకలాపాలు నడుపుతూ సిఐఎకి పట్టుబడ్డాడు. ఆ రాత్రికే వారు 'చే' ను సమీపం
లోని 'లా హిగువేరా' గ్రామానికి తరలించారు. అక్కడ ఉన్న స్కూలులో 'చే'ను
బంధించి, అధికారుల ఉత్తర్వుల కోసం సైన్యం వేచి ఉంది. ఆ మరుసటిరోజు
(అక్టోబర్ 9) మధ్యాహ్నం ఒంటిగంటా పదినిమిషాలకు అమెరికా ఆదేశాలతో మారియో
టెరాన్ అనే బొలీవియన్ సార్జెంటు 'చే'ను కాల్చివేశాడు. ఆ సమయంలో 'కాల్చండి. మీరు మనిషిని మాత్రమే చంపగలరు. విప్లవాన్ని కాదు..' అంటూ 'చే' అన్న మాటలు.. మనందరిలో ఉత్తజాన్ని నిం పేవి. నాటి నుండి 'చే' విప్లవానికి చిహ్నంగా .. ప్రవహించే ఉత్తేజంగా.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయాడు.
No comments:
Post a Comment