నిరాహార దీక్ష!
ఉద్యమాల భాషలో తరచుగా
వినిపించే మాట. ఇటీవల దాదాపు ప్రతి ఇంటా వినిపిస్తున్న మాట. ఈ దీక్షా
పద్ధతి ఇప్పుడు పుట్టింది కాదు. చాలా చరిత్రే వుంది. స్వాతంత్య్రోద్యమంలో
గాంధీజీ, భగత్సింగ్, జతీంద్ర నాథ్, భటుకేశ్వర్ దత్ మొదలుకొని అమరజీవి
పొట్టి శ్రీరాములు నుంచి నేడు అన్నా హజారే వరకు ఎందరో ఎన్నో సందర్భాల్లో ఈ
అస్త్రాన్ని ప్రయోగించారు.
ఆ వివరాలు ఈ వారం అట్టమీది కథలో...
అనుకున్నది
సాధించడం కోసం, లేనిదాన్ని పొందడం కోసం, న్యాయం కోసం, హక్కుల కోసం ఎన్నో
పోరాట మార్గాలున్నాయి. అయితే ఒక వ్యక్తి లేదా కొంత మంది ఆహారం తీసుకోకుండా
ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచేదే నిరాహార దీక్ష. చాలా సాధారణంగా కనిపించే
పోరాట రూపం. ఇళ్లలోనూ ఈ దీక్ష జరుగుతూనే వుంటుంది. తల్లిదండ్రులు తమ
కోర్కెలు తీర్చలేదని పిల్లలు అలిగి ఆహారం మానివేసి సాధించుకోవడం చూస్తూనే
వుంటాం. అప్పుడప్పుడు భర్తలు కూడా అన్నంపై అలుగుతుంటారు. గాంధీజీ ఈ
పద్ధతిని రాజకీయ లక్ష్య సాధనకు జోడించాడు. అహింస ప్రధానమనే ఆయన భావనకు ఇది
బాగా సరిపోయింది. అప్పటి నుంచి దేశంలో అలాగే స్థిరపడిపోయి
స్వాతంత్య్రానంతరమూ కొనసాగుతున్నది. కాకపోతే చేపట్టిన సమస్యతో పాటు చేసే
వ్యక్తిని బట్టి మద్దతు లభిస్తుంటుంది. ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
మహాత్ముడి నిరాహార దీక్షలకు చాలాసార్లు బ్రిటిష్ ప్రభుత్వమే దిగిరాక
తప్పిందికాదు. పొట్టి శ్రీరాములు దీక్షతో తెలుగు రాష్ట్రమే ఏర్పడింది.
సమరశీల పోరాటాలకు ఎంతటి ప్రాధాన్యత లభించిందో సాత్విక పోరాటమైన నిరాహార
దీక్షకూ అంతటి ప్రసిద్ధి లభించడాన్ని బట్టి ఆ అస్త్రానికున్న శక్తి
తెలుస్తోంది. ఒక దశలో కొంత అపహాస్యానికి గురైన ఈ దీక్షలకు తిరిగి గౌరవం
తెచ్చిపెట్టింది వారేనని చెప్పాలి.
'అశనము' అంటే అన్నం. భోజనం.
'నిరశనము' అంటే ఆహారం తినకుండా వుండడం. ('నిరసన' అంటే నిరాకరించడం,
వ్యతిరేకించడం, ఈ రెండు పదాలూ తారుమారవుతుంటాయి) పూర్వం దీన్నే
సత్యాగ్రహమనీ అనేవారు. సమస్య పరిష్కారమయ్యేవరకూ చేసేది నిరవధిక
నిరాహారదీక్ష. దీన్నే ఆమరణ అంటారు గాని సాంకేతికంగా సరికాదు. ఎందుకంటే
కోరిక పరిష్కారమే కొలబద్ద తప్ప మరణం కాదు. అలాగే ఒక కోర్కెపై వరుసగా ఒకరి
తర్వాత ఒకరు దీక్షలు కొనసాగిస్తే దాన్ని రిలే నిరాహారదీక్ష అంటుంటారు.
ఒకరోజు మాత్రమే చేస్తే అది నిరసన దీక్ష. ఇటీవల 48 గంటలు, 72 గంటలు ఇలా
ప్రకటించి దీక్షలు చేయడం కొత్త పద్ధతిగా వచ్చింది. సమస్యను పాలకుల దృష్టికి
తీసుకెళ్లడానికీ, సమస్య మద్దతు సమీకరించడానికీ ఇవి ఉపయోగపడ్తాయి.
నిరాహార
దీక్ష ప్రస్తావన పురాణాల్లోనూ వుంది. మరింత కచ్చితంగా చెప్పుకోవాలంటే
రామాయణంలో భరతుడి నోట వినిపిస్తుంది. ప్రచారంలో వున్న కథ ప్రకారం రాముడు
అరణ్యవాసానికి వెళ్లినప్పుడు తిరిగి వచ్చి రాజ్యపాలన చేపట్టమని భరతుడు
రాముణ్ణి కోరతాడు. అందుకు రాముడు అంగీకరించడు. తన మాటను మన్నించనందుకు
నిరాహారదీక్షకు ఉపక్రమించాలని భావిస్తాడు భరతుడు. కాకపోతే రాముడు
నచ్చచెప్పడంతో ఆయన ఆ ప్రయత్నం నుంచి విరమించుకున్నాడట.
బాకీ వసూలు చేసే ఆయుధం
ఐర్లాండ్
వంటి దేశాల్లో క్రీస్తుకు ముందు నుంచే నిరాహారదీక్ష వున్నట్లు చరిత్ర వల్ల
తెలుస్తోంది. మొదట మొండిబాకీల వసూళ్లకు, న్యాయం కోసం వత్తిడి తెచ్చేందుకు ఈ
అస్త్రాన్ని ఉపయోగించేవారట. ఆరోజుల్లో ఎవరైనా ఇలా తమ ఇళ్లముందు
నిరాహారదీక్షకు దిగడాన్ని చాలా చిన్నతనంగా, అగౌరవంగా భావించేవారట. మన
దేశంలో ఇలా బకాయిపడిన వారి ఇళ్ల ముందు నిరాహార దీక్షకు దిగి, బాకీ వసూలు
చేసుకోవడాన్ని బ్రిటీష్ ప్రభుత్వం 1861లో నిషేధించింది.
బాపూజీ స్ఫూర్తితో...
సత్యాగ్రహాన్నే
సాధనంగా మలచుకొని అనుకున్నది సాధించిన ప్రముఖుడు గాంధీజీ. దేశంలో
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ అనేకసార్లు నిరాహారదీక్షకు కూర్చుని
అనుకున్నది సాధించాడు. గాంధీ స్ఫూర్తితో ఎంతోమంది విదేశీయులు కూడా ఈ
అస్త్రాన్ని చేపట్టారు. దక్షిణాఫ్రికాలో నల్లజాతి వెలుగురేఖ నెల్సన్
మండేలా, అమెరికాలో మార్టిన్ లూధర్ కింగ్ వంటివారు ఈ ఆయుధంతో పోరునూ
సాగించారు. వాషింగ్టన్ డి.సిలో ప్రభుత్వానికి చెందిన ఓ భారీ భవంతిని 1,400
పడకల సిటీ షెల్టర్గా మార్చాలని కోరుతూ మిచ్ స్నైడర్ అనే న్యాయవాది
1984లో 51 రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టాడు. అమెరికా సర్కారు దిగిరావడంతో
ఆయన కోరిక నెరవేరింది.
మొక్కవోని దీక్ష
ఈ
మధ్య ఒక్కరోజు దీక్ష చేపడుతున్న వారిని కూడా చూస్తున్నాం. కానీ ఏకంగా
దశాబ్దకాలంగా నిరాహార దీక్ష చేస్తున్నవారూ వున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది.
అలాంటి ఉక్కుమహిళే మణిపూర్కు చెందిన చాను షర్మిళ. సరిగ్గా 2000 సంవత్సరంలో
ఆమె దీక్షను చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు తన చేత్తో తను ఒక్క మెతుకు
అన్నం ముట్టలేదంటే ఒట్టు. కానీ ప్రభుత్వం మాత్రం బలవంతంగా ద్రవాహారాన్ని
ట్యూబుల ద్వారా ఎక్కిస్తూనే వుంది. ఇంతకీ పదేళ్ల నిరాహార దీక్ష వెనక ఏముందో
తెలుసుకోవాలంటే పదేళ్ల వెనక్కి వెళ్లాలి. మణిపూర్లో సాయుధ దళాలు జరిపిన
కాల్పుల్లో పది మంది అమాయకులు చనిపోయారు. ఇది షర్మిలను కలచివేసింది. వారికి
అటువంటి విశేష అధికారాలు కల్పించిన సాయుధ దళాల ప్రత్యేక అధికారుల చట్టం,
1958ని రద్దు చేయాలని కోరుతూ ఆమె 2000, నవంబర్ 2న ఆమరణ నిరాహార దీక్ష
ప్రారంభించారు.
ఆమరణ దీక్షలోనే అమరుడై!
చేపట్టిన
దీక్ష ఒక్కటే అయినా ఎవరి డిమాండ్లు వారివి. కొన్ని ప్రత్యేకంగానూ వుంటాయి.
అటువంటివాటిలో ఒకటి స్వామి నిగమానంద దీక్ష. పర్యావరణ పరిరక్షణ కోసం
నిరాహార దీక్ష ప్రారంభించారాయన. భారతీయులు పవిత్రంగా భావించే గంగానదిని
కలుషితం చేస్తున్న ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని, కుంభమేళా జరిగే ప్రాంతంలో
నెలకొల్పిన కంకర మిల్లులను తరలించాలన్నవి ఆయన డిమాండ్లు. ఉత్తరాంచల్లోని
హరిద్వార్లో ఫిబ్రవరి 19న ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. మే2వ తేదీన ఆయన
ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితికి చేరుకున్నారు. మొదట ఆయనను హరిద్వార్
జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఆయనను హెచ్ఐహెచ్టి ఆస్పత్రికి
తరలించారు. చివరకు జూన్ 13వ తేదీన అంతిమ శ్వాస విడిచారు. గంగానదిని
హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. అయితే ఆ హిందువులకు ప్రాతినిధ్యం
వహిస్తున్నామని, వారి హక్కుల రక్షణకు అంకితం అయ్యామని చెప్పుకునే
ఆర్ఎస్ఎస్, బిజెపీ నాయకులెవ్వరూ దీక్షలో వుండగా స్వామి నిగమానందను
పలకరించలేదు. ఏ రాళ్లు కొట్టే క్రషర్ను కుంభమేళా ప్రాంతం నుంచి
తొలగించాలని నిగమానంద పోరాడాడో అది సంఫ్ు నాయకుల్లో ఒకరిదని అంటారు. దాంతో
నిగమానంద చేసిన పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వారెవరూ ముందుకు రాలేదు.
చివరకు హరిద్వార్ జిల్లా ఆస్పత్రిలో వున్న నిగమానంద మీద విష ప్రయోగం
జరిగిందని కూడా మాతృసదన్ ఆశ్రమం వారు ఆరోపిస్తున్నారు.
*
టిఆర్ఎస్ నేత కె.చంద్రశేఖరరావు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నేపథ్యంలో 14
ఎఫ్ రద్దు కోరుతూ 2009లో నిరాహారదీక్ష చేపట్టారు. ఇది అనేక రాజకీయ
పరిణామాలకు దారి తీసింది. తర్వాత కూడా ఇదే సమస్యపై వివిధ పార్టీల నాయకులు
విద్యార్థులు, ఉద్యోగనేతలు తదితరులు వివిధ దశల్లో నిరాహారదీక్షలు చేశారు.
ఇరత ప్రాంతాల్లో కూడా ఇలాంటివి కొంతవరకు జరిగాయి.
*
రైతన్నల సమస్యలపై తెదేపా అధినేత చంద్రబాబు 2010లో దీక్ష చేశారు. భారీ
వర్షాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని, దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్
సబ్సిడీ ఇవ్వాలని, పావలా వడ్డీ రుణాలు ఇప్పించాలని, పంట బీమా అందరికీ
వర్తింపచేయాలన్న పలు డిమాండ్లతో ఆయన ఈ దీక్ష చేశారు.
* కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు దీక్షలు చేపట్టారు.
*
విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని భారత్కు తీసుకురావాలంటూ బాబా
రామ్దేవ్ ఈ ఏడాది జూన్ మాసంలో దీక్షకు కూర్చున్నారు. కాకపోతే 24 గంటలు
గడవక ముందే ప్రభుత్వం ఆయన దీక్షను భగం చేసింది.
* మమతాబెనర్జీ సింగూర్లో రైతులు భూములకు సంబంధించి దీక్ష చేశారు.
*
నాటకీయతకు పేరొందిన తమిళనాడులో ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత అమిత
ప్రచారంతో ఒక్కరోజు దీక్షలు చేస్తుంటారు.అంతకు ముందు కేరళ వామపక్ష నేతలు
పలుసార్లు తమ కోర్కెలపై రాష్ట్రంలోనూ ఢిల్లీలోనూ నిరాహారదీక్షలు చేశారు.
*
విజయవాడ శాసనసభ్యుడు వంగవీటి రంగా నిరాహారదీక్షలో వుండగా హత్యకు గురవడం
అనేక దుష్పరిణామాలకు దారి తీసింది. తర్వాత ఆయన భార్య కూడా దీక్ష బూనడంతో
ఉద్రిక్తత కొనసాగింది.
* 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం
జరిగిన దాడులకు నిరసనగా తెలుగు దేశం అధినేత ఎన్టీఆర్ టాంక్బండ్పై
నిరాహారదీక్ష చేశారు. చిన్న నూలు టవలు కట్టుకుని, నీటికోసం తాబేటి బుర్ర
పట్టుకుని, ఎవరితోనూ మాట్లాడకుండా తనదైన శైలిలో చాలా రోజులు దీక్ష చేశారు.
ఆయనను పరామర్శించడానికి జాతీయ నాయకులందరూ తరలి వచ్చారు.
బలవంతపు ఆహారం
''నల్గురు జైలు ఉద్యోగులు వచ్చే వాళ్లు.
సత్యాగ్రహిని వెనక్కి పడేసేవాళ్లు. ఒకడు కాళ్ల మీద కూర్చునేవాడు. ఒకడు తల
కదలకుండా పట్టుకునేవాడు. రొమ్ముల వద్ద ఒకడుండి రెండు చేతులూ గట్టిగా
పట్టుకునేవాడు. నాల్గోవాడు పట్టకారులాంటి దానితో నాలిక బయటకు లాగి గొంతులో
గంజి పోసేవాడు. అయినా, గొంతు కండరాలను బిగబట్టి ఆ గంజి గొంతులో జారకుండా
కొందరం ప్రతిఘటించేవారము. అలాంటి వారి గొంతులోకి ఒక సత్తు చెంచా పెట్టి,
నాలిక అడుగు భాగం దాకా నెట్టి, అక్కడ దాన్ని ''స్క్రూ'' తిప్పినట్టు
తిప్పేవారు. ఆ బాధ భరించలేనిదిగా వుండేది. నిజానికి నేనూ ఆ బాధను
భరించలేకపోయేవాణ్ణి!''.
ఎన్ని రోజులు?
శరీరం
అనే యంత్రం నడవాలంటే కనీసం గ్లూకోజ్ అనే ఇంధనం కావాలి. నిరాహార దీక్ష
మూలంగా శరీరంలోకి కొత్తగా గ్లూకోజ్ చేరదు. దీక్ష చేపట్టిన 4 నుంచి 8 గంటల
తర్వాత శరీరంలో గ్లైకోజెన్ రూపంలో నిల్వ వుండే గ్లూకోజ్ను ఉపయోగించే
బాధ్యతను కాలేయం తీసుకుంటుంది. ఆ నిల్వ కూడా అయిపోగానే శరీరంలోని కొవ్వును
వాడుకుంటూ శక్తిని సమకూరుస్తుంది. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు లేకపోతే దీక్షకు
కూర్చున్న వ్యక్తి దృఢత్వాన్ని బట్టి కొద్ది రోజుల పాటు బండిని
నడిపించొచ్చు. అయితే నిరాహారదీక్షను విరమించిన తర్వాత కూడా శరీరాన్ని
అదుపులోకి తెచ్చుకోవడానికి కొద్దిపాటి వైద్య సలహాలు పాటించక తప్పదు.
వీరకిశోరాల దీక్ష
భారత
విప్లవ వీర కిశోరాలైన భగత్సింగ్, జతీంద్రనాథ్ దాస్, మరికొందరు 1929లో
జైలులోనే నిరాహార దీక్షకు కూర్చున్నారు. వీరు నిరాహార దీక్షను ఒక రాజకీయ
పోరాటంగానే భావించారు. పైగా తాము ఓ రాజకీయ ముసాయిదా ద్వారా తమ నిరాహార
దీక్ష ఉద్దేశాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు తెలియచేయాలనుకున్నారు. జైళ్లలో
అధికారులు రాజకీయ ఖైదీలపట్ల అమానుషంగాను, అవమానకరంగాను ప్రవర్తిస్తుండడంతో
వారు దీక్షకు దిగారు. ఇది దాదాపు మూడు నెలల పైగా సాగింది. వారి డిమాండ్లు
...''రాజకీయ ఖైదీలకు మంచి భోజనం ఇవ్వాలి. అది యూరోపియన్ ఖైదీలకిచ్చే
స్థాయిలో వుండాలి. పని పేరుతో జైళ్లలో హీనమైన పనులు చేయమని రాజకీయ ఖైదీలను
నిర్బంధించరాదు. పుస్తకాలు, రాత సామాగ్రి ఏ ఆటంకం లేకుండా అందివ్వాలి.
ప్రతి రాజకీయ ఖైదీకి ప్రభుత్వ ఖర్చుతోనే ఒక దినపత్రిక ఇప్పించాలి. రాజకీయ
ఖైదీలకై ప్రత్యేకమైన ఒక శ్రేణిని ఏర్పరచాలి. ప్రతి చెరసాలలోను రాజకీయ ఖైదీల
కోసం ఒక ప్రత్యేకమైన వార్డు ఏర్పరచాలి. అందులో యూరోపియన్ ఖైదీలకున్న
సౌకర్యాలన్నిటినీ కలుగచేయాలి. ఒక జైలులో వున్న రాజకీయ ఖైదీలనందంరినీ ఆ
వార్డులోనే వుంచాలి. స్నాన వసతితో పాటు ధరించడానికి మంచి బట్టలు ఇవ్వాలి.
ఉత్తర ప్రదేశ్ జైలు సంస్కరణ సంఘ సభ్యులు చేసిన సిఫారసు తమకు కూడా
వర్తింపచేయాలి''.
వీరిని దీక్ష నుంచి విరమింపచేయడానికి గాను
అధికారులు అనేక విధాల ప్రయత్నించేవారు. వీరిని ప్రలోభ పెట్టడానికి సువాసనలు
విరజిమ్మే రుచికరమైన భోజన పదార్థాలను కొట్లలో పెట్టేవారు. వారటు వెళ్లగానే
వీరిలో అనేకులు ఆ భోజన పదార్థాలను, పళ్లను, పాలను వెంటనే బయటపారేసేవారు.
లేకపోతే మట్టిలో కలిపేసేవారు. ఒక్క దాస్ మాత్రమే గట్టి ఆత్మ విశ్వాసంతో
వుండేవాడు. ఆయన ఎప్పుడూ భోజన వస్తువులను పారవేయనూలేదు. మురికి చేయనూలేదు.
ఆయన సెల్ నుంచి జైలు అధికారులు రోజూ రొట్టెలనూ, పళ్లనూ లెక్కబెట్టి తిప్పి
తీసుకెళ్లేవారు. కొద్దిరోజుల తర్వాత వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా
మారడంతో ప్రభుత్వం వీరికి ఒక వైద్య బృందాన్ని ఏర్పాటుచేసింది. బలవంతంగా
పాలు తాగించే నాటకం మొదలైంది. దాస్ దగ్గరకు కూడా వచ్చారు. ఏడెనిమిది మంది
ఒక వైపు, నిరాహార దీక్షతో కృంగికృశించిన దాస్ మరోవైపు. దాస్ మాత్రం
బిగబట్టి ఏమాత్రం ఆహారం లోపలికెళ్లకుండా ఆపగలిగేవాడు. అయితే ఓసారి
లాహోరులోని పిచ్చాసుపత్రి ఇన్ఛార్జిగా చేసిన డాక్టరు వచ్చాడు దాస్కు
ఆహారం ఎక్కించడానికి. రెండు ముక్కుల గుండా ట్యూబులు వేసి పాలు ఎక్కించ
చూస్తాడు. అయితే దాస్ మొండిపట్టుతో ట్యూబులు శ్వాసకోశాల్లోకి
వెళ్లిపోతాయి. విలవిలలాడిపోతున్న దాస్ కనుగుడ్లు మారిపోతాయి. డాక్టర్
అవేమీ పట్టించుకోకుండా ఒక శేరుపాలను ఆయన శ్వాసకోశాల్లోకి నింపేసి
విజయగర్వంతో వెళ్లిపోతాడు. అప్పుడు కూడా చికిత్స తీసుకోవడానికి
ఇష్టపడకపోవడంతో వీరమరణం పొందాడు జతీంద్రనాథ్ దాస్.
కాకలు
తీరిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ ఎ.కె.గోపాలన్. ఒక పౌరుడుగా, ఖైదీగా
రాజ్యాంగ చట్టంలో గల హక్కులన్నింటినీ అమలు జరిపించుకునేందుకు
కోర్టుకెక్కడం, రిట్లు వేయడం ఆయనకు అలవాటు. పార్లమెంటులో ప్రతిపక్ష
నాయకుడు, వెలుపల రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేత. కష్టజీవుల కోర్కెలను
గురించి ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంటులో గర్జించడమే కాదు. వెలుపలా అందుకు
పోరాడడంలోనూ ఘనుడే. కేరళలో భూ సమస్యపై రైతుల హక్కుల కోసం నిరాహార
దీక్షబూనారు. ఆ రాష్ట్రానికి కక్షతో బియ్యం సరఫరా కోటాను కత్తిరించినందుకు
ప్రధాని నెహ్రూ ఇంటిముందే ఆయన నిరాహారదీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యలకు,
రాజకీయ పోరాటాలకు మాత్రమే ఆయన పరిమితం కాలేదు. అన్యాయం ఎక్కడ, ఎప్పుడు
జరుగుతున్నదని భావించినా అప్పటికప్పుడు దాన్ని నివారించేందుకు రంగంమీదికి
దూకడం, అది పరిష్కారం కాకపోతే నిరాహారదీక్షను ప్రారంభించడం ఆయన తత్వం. 5
రోజుల నుంచి 48 రోజుల వరకు అనేక సార్లు దీక్షలు చేశారు. అమరావతి రైతులకోసం
చేసిన నిరాహార దీక్షకు ప్రత్యేకంగా అత్యధిక ఆదరణ, దేశవ్యాప్త ప్రచారం
లభించాయి. ఎకెజి అక్కడ పది రోజుల పాటు వున్నారు. జూన్ 6వ తేదీన దీక్షకు
కూర్చున్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు వచ్చి ఆయనను పరామర్శించి
వెళ్లేవారు. కానీ అననుకూల వాతావరణం. ఎడతెరిపి లేని వర్షం. బలమైన
చలిగాడ్పులు. నీళ్లు, బురద, మధ్యలో చిన్న గది. దుర్భరమైన కంపు. తాగడానికి
నీరు లేదు. అలాంటి ఎన్నో సమస్యల మధ్య మొక్కవోని దీక్షతో నిరాహార దీక్ష. 15,
16 తేదీలలో అనేక గంటలపాటు రాజీ సంప్రదింపులు జరిగాయి. అయినా ఎలాంటి
పరిష్కారమూ వెలువడలేదు. చివరికి 17 ఉదయం ఒక ఒప్పందం కుదిరింది. దాని
ప్రకారం అమరావతి రైతులకు అనుకూలమైన కొన్ని చర్యలు తీసుకోడానికి హోం మంత్రి
చాకో అంగీకరించాడు. ఒక్కొక్క కుటుంబానికి మూడెకరాల భూమి మంజూరు చేయడంతో సహా
అమరావతి రైతుల డిమాండ్లలో ఎక్కువ భాగాన్ని మంత్రి అంగీకరించాడు.
అమరజీవిగా మిగిలిపోయిన నేత
ఆంధ్రరాష్ట్రం
కోసం ప్రాణాలనే ఒడ్డిన నేత పొట్టి శ్రీరాములు. ఆంధ్ర రాష్ట్రం కోసం
మద్రాసు నడిబొడ్డున ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఆయన చేసిన ప్రాణ
త్యాగంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తెలుగు ప్రజల మనసుల్లో ఆయన 'అమరజీవి'గా
నిలిచిపోయాడు.
స్వామీ సీతారాం
పొట్టి
శ్రీరాములు కన్నా ముందు స్వామీ సీతారాం ఇదే కోర్కెపై నిరాహారదీక్ష బూనారు.
35 రోజులు సాగిన ఆయన నిరాహారదీక్షను నెహ్రూ వ్యతిరేకించడంతో ప్రజల్లో
కాంగ్రెస్ పట్ల ఆగ్రహం కలిగింది.1952 ఎన్నికల ఫలితాల్లోనూ అది
ప్రతిబింబించింది.
దేశంలో
అవినీతి నిర్మూలనకై జన్లోక్పాల్ తేవాలని కోరుతూ అన్నా హజారే 12 రోజుల
పాటు నిరాహార దీక్ష చేశారు. 72 ఏళ్ల అన్నా దీక్షకు పట్టణ, మధ్యతరగతి ప్రజల
నుంచి మంచి మద్దతు లభించింది. అనేక రాజకీయ పార్టీలకు చెందినవారే కాక, సినీ
తారలు, మోడళ్లు, సెలబ్రెటీలు, విద్యార్థులు కూడా సంఘీభావం తెలిపారు.
ఎట్టకేలకు ఆయన డిమాండ్ను సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆమోదించడంతో దీక్ష
ముగిసింది. 1996 నవంబర్లోనూ అన్నా హజారే 12 రోజుల పాటు దీక్ష చేశారు.
మహారాష్ట్ర అవినీతి మంత్రులకు వ్యతిరేకంగా ఆయన ఆ దీక్ష చేశారు. ప్రభుత్వంలో
జరిగిన 253 అవినీతి కేసులను తవ్వితీసి వాటిపై విచారణ చేపట్టవలసిందిగా
కోరారు. ఇద్దరు మంత్రుల రాజీనామాతో ఆయన దీక్షను విరమించారు.
కమ్యూనిస్టు నేతల దీక్ష
దళితులు,
గిరిజనులు, పట్టణ పేదలు, కార్మికులు, రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది
మార్చిలో బి.వి.రాఘవులు సారథ్యంలో సిపిఎం నేతలు నిరాహార దీక్ష చేపట్టారు.
అంతకు ముందు భూ సమస్యపై బి.వి.రాఘవులు, సిపిఐ కార్యదర్శి నారాయణ దీర్ఘకాలిక
నిరాహార దీక్ష చేశారు. ఇదేగాక సి.పిఎం ప్రజా సంఘాల సామాజిక తరగతుల
ప్రతినిధులు, చట్టసభల్లో ప్రజా ప్రతినిధులు పలు సార్లు
నిరాహారదీక్షాయుధాన్ని సంధించి సత్ఫలితాలు సాధించారు.
నిరాహారదీక్షల క్లైమాక్స్...
ఇది
రకరకాలుగా వుంటుంది. ఎవరు ఎందుకు నిరవధిక నిరాహారదీక్ష చేసినా ప్రభుత్వం
కోర్కెలను ఒప్పుకోవడంపై విరమణ ఆధారపడి వుంటుంది. ప్రముఖులు కూర్చుంటే
కాస్తముందో వెనకో స్పందన వస్తుంది. మామూలు వారైతే అసలు స్పందన
వుండకపోవచ్చు. అయితే నిరాహారదీక్షలకు సమాంతరంగా వారికి సంబంధించినవారు
రాజకీయ వత్తిడి తెస్తుంటారు గనక ఏదో ఒక విధమైన రాజీ కుదురుతుంటుంది.
ప్రభుత్వం మరీ మొండిగా వుంటే వారిని బలపర్చే పెద్దలే వచ్చి చొరవ తీసుకుని
విరమింపచేస్తుంటారు. ఎందుకంటే ఆమరణ అని పేరు పెట్టుకున్నా ఈ దీక్షలు
మరణించడానికి కాదు కదా. కొన్ని సార్లు నాయకుల స్థాయిని బట్టి ఈ దీక్షలపై
చట్టసభల్లోనూ చర్చ జరుగుతుంది. వారి స్థాయికి తగిన వారే ప్రభుత్వ
ప్రతినిధులు వచ్చి నిమ్మరసం ఇచ్చి విరమింపచేయడం అక్కడున్న వారికి కుదిరిన
అంగీకారం గురించి చెప్పడం జరుగుతుంటుంది. ఎవరు ఎప్పుడు దీక్ష చేసినా
నిమ్మరసంతో మొదలై ముగుస్తుంటుంది. ప్రభుత్వాలు అనేక సార్లు మొండి వైఖరితో
అర్థరాత్రి దాడి చేసి దీక్షలో వున్నవారిని బలవంతంగా అరెస్టు చేసి
ఆస్పత్రికి తరలిస్తుంది. వారు అక్కడా దీక్ష కొనసాగిస్తారు. అలాటి సందర్భాలు
చాలా చూశాము.
ధర్నా చౌక్
ప్రజాపోరాటాల
ప్రభావం ఏమిటో తెలియాలంటే ఎవరైనా హైదరాబాద్లోని ఇందిరా పార్కు దగ్గర
ధర్నా చౌక్కు వెళ్లి చూడాలి. అక్కడ ఏడాదిలో సగం రోజులు ఏదో ఒక సంఘానికి
సంబంధించిన వారు నిరవధిక లేదా రిలే నిరాహారదీక్షలు చేస్తూనే వుంటారు. ఈ
శిబిరాల నిర్వహణ కూడా చాలా బాధ్యతాయుతంగా జరుగుతుంటుంది. దీక్షల ప్రారంభం
ఒక ఎత్తు. ఆ రోజున వీలైనంత ఎక్కువగా తరలి వచ్చి సంఘీభావం చెప్పేలా
చూసుకుంటారు. తర్వాత దీక్షలు సాగినంత కాలం ప్రతిరోజూ ప్రముఖుల రాక,
సందేశాలు సంఘీభావ ప్రకటన జరుగుతుంటాయి.
ఆయుధాలైనా, మెదడైనా
ఉపయోగిస్తుంటేనే పదును తేలతాయి. పోరాట ఆయుధానికి కూడా పదును రావాలంటే తరచూ
వాడుతుండాలి. పోరాడితే పోయేదేం లేదన్న మార్క్స్ మహానుభావుడి మాటను
మర్చిపోకూడదు. పైగా మన చుట్టూ ఇప్పుడున్న పరిస్థితుల్లో పోరాటం అనివార్యం.
అందుకే అహింసాయుతమైన నిరాహారదీక్ష అస్త్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
పేరుమోసిన వారేకాకుండా సామాన్యులు చేపట్టిన దీక్షలకు కూడా ప్రాధాన్యత
ఇవ్వాల్సి వుంది.
No comments:
Post a Comment