Pages

Sep 28, 2011

భగత్‌ సింగ్‌ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న పోలీసులు

  • తోపులాట, పలువురి అరెస్ట్‌
  • ఖమ్మం కలెక్టరేట్‌ ముట్టడి
  • 29న అనుమతి ఇస్తామని డిఆర్‌ఓ హామీ
భగత్‌సింగ్‌ 104వ జయంతి సందర్భంగా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగత్‌సింగ్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాలను అడ్డుకున్నారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని ఖమ్మం జిల్లాలో పోలీసులు అడ్డుకోగా, తెలంగాణాపై సానుకూల వైఖరి ప్రకటించాలని నల్గొండ జిల్లాలో ఎబివిపి, టిఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన తోపులాటలో డివైఎఫ్‌ఐ నాయకుడు రాముకు గాయాలయ్యాయి. అనంతరం ఆ సంఘం కార్యకర్తలను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. దీన్ని నిరసిస్తూ కార్యకర్తలు వైరారోడ్డులో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. భగత్‌సింగ్‌ 104వ జయంతి సందర్భంగా ఖమ్మం బస్టాండ్‌ సెంటర్లో భగత్‌ సింగ్‌ విగ్రహ ఏర్పాటుకు డివైఎఫ్‌ఐ ఖమ్మం డివిజన్‌ కమిటీ నిర్ణయించింది. మంగళవారం సంఘం కార్యకర్తలు మున్సిపల్‌ కార్యాలయం నుండి విగ్రహంతో బస్టాండు సెంటర్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదంటూ డిఎస్‌పి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో సిఐలు, సిఆర్‌పిఎఫ్‌ పోలీసులు, స్పెషల్‌ పార్టీ పోలీసులు డివైఎఫ్‌ఐ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. కార్యకర్తలను పోలీసులు ఈడ్చివేశారు. అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో డివైఎఫ్‌ఐ ఖమ్మం డివిజన్‌ కార్యదర్శి తాళ్ళూరి రాము, పుట్టా రవితో పాటు పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. తాళ్లూరి రాము స్పృహ తప్పి పడిపోయాడు. వీరిని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
అక్రమ అరెస్టులను నిరసిస్తూ డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. అరెస్ట్‌ చేసిన కార్యకర్తలను విడుదల చేయాలని, భగత్‌సింగ్‌ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నినాదాలు చేశారు. కార్యకర్తలతో డిఎస్‌పి, సిఐ వాదనకు దిగారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ నినాదాలు చేస్తూ వైరా రోడ్డు నుండి కలెక్టరేట్‌ వరకు కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. అక్కడ కలెక్టరేట్‌ను ముట్టడించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జయచందర్‌, డిఎస్‌పి ప్రతాప్‌రెడ్డి సమక్షంలో డివైఎఫ్‌ఐ బృందంతో అధికారులు చర్చలు జరిపారు. ఈ నెల 29వ తేదీ అనంతరం అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో డివైఎఫ్‌ఐ కార్యకర్తలు ఆందోళన విరమించారు. అనుమతివ్వకపోతే 30వ తేదీన ఎన్ని ఆటంకాలు వచ్చినా విగ్రహాన్ని ప్రతిష్టించి తీరుతామని నాయకులు స్పష్టం చేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకున్న పోలీసులను సస్పెండ్‌ చేయాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ నాయకులు యర్రా శ్రీకాంత్‌, జిల్లా కార్యదర్శి టి.లింగయ్య డిమాండ్‌ చేశారు.
హాలియాలో అడ్డుకున్న ఎబివిపి, టిఆర్‌ఎస్‌
నల్గొండ జిల్లా హాలియా మండలం కొంపెల్లి గ్రామంలో మంగళవారం భగత్‌సింగ్‌ విగ్రహాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్‌ ఆవిష్కరించారు. అనంతరం సభ నిర్వహించారు. సభ పూర్తయిన తర్వాత కొందరు ఎబివిపి, టిఆర్‌ఎస్‌ నాయకులు అక్కడికి చేరుకొని తెలంగాణ పట్ల సానుకూల వైఖరి వ్యక్తం చేయాలని కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అక్కడి నుండి పంపించేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు పగడాల లక్ష్మయ్య, జిల్లా కార్యదర్శి కోట రమేష్‌, కెవిపిఎస్‌ రాష్ట్ర నాయకులు కొండేటి శ్రీను, మోజేష్‌ పాల్గొన్నారు.

No comments:

Post a Comment