పైకి చూడ్డానికి అంతా బాగుందనిపిస్తూనే, చాపకింద నీరులా చెడు
చుట్టుముట్టేస్తే? ముట్టేసి నెమ్మది నెమ్మదిగా ముంచేస్తే? అది కుట్ర..
బలవంతుడు బలహీనుడి మీద నేరుగా చేసేది దౌర్జన్యం అయితే, కనిపించకుండా చేసేది
కుట్ర.
దౌర్జన్యం జరిగిందన్న విషయం వెంటనే తెలుస్తుంది కానీ కుట్ర జరిగిందన్నసంగతి, అది జరిగిపోయిన ఎన్నాళ్ళకో కానీ తెలీదు. తెలిసినా, అప్పటికింక తిరిగి ఏంచెయ్యడానికీ ఉండదు. అలాంటి కుట్రే దేశ ప్రజల మీద రాజ్యాంగం రూపంలోనూ, పంచ వర్ష ప్రణాళికల రూపంలోనూ జరిగిందంటారు తెలుగు సాహిత్యంలో కారామేష్టారిగా సుప్రసిద్ధులైన కాళీపట్నం రామారావు, తన 'కుట్ర' కథలో.
దౌర్జన్యం జరిగిందన్న విషయం వెంటనే తెలుస్తుంది కానీ కుట్ర జరిగిందన్నసంగతి, అది జరిగిపోయిన ఎన్నాళ్ళకో కానీ తెలీదు. తెలిసినా, అప్పటికింక తిరిగి ఏంచెయ్యడానికీ ఉండదు. అలాంటి కుట్రే దేశ ప్రజల మీద రాజ్యాంగం రూపంలోనూ, పంచ వర్ష ప్రణాళికల రూపంలోనూ జరిగిందంటారు తెలుగు సాహిత్యంలో కారామేష్టారిగా సుప్రసిద్ధులైన కాళీపట్నం రామారావు, తన 'కుట్ర' కథలో.
ఓ సిద్ధాంతాన్ని - అది ఏ సిద్ధాంతం అయినప్పటికీ - బలంగా
నమ్మి, జీర్ణం చేసుకున్న వ్యక్తి తన చుట్టూ జరిగే వాటిని ఆ సిద్ధాంతపు
దృష్టి కోణం నుంచి చూడడం సహజం. వామపక్ష రాజకీయాల పట్ల మొదటినుంచీ ఆసక్తి
ఉన్న, విప్లవ రచయితల సంఘం స్థాపన విస్తరణలో కీలక పాత్ర పోషించిన కారా
మేష్టారు, స్వాతంత్రానంతరం దేశంలో జరిగిన కొన్ని పరిణామాలని, ముఖ్యంగా తొలి
రెండు పంచవర్ష ప్రణాళికలనీ, 'మిక్సుడ్ ఎకానమీ' అమలులో సామాన్యులకి జరిగిన
అన్యాయాలనీ తనదైన దృష్టికోణంలో పరిశీలించి, కొందరు ప్రజలు ప్రభుత్వానికి
ఎదురుతిరిగి తీవ్రవాదులుగా మారడానికి ప్రభుత్వం వారిపై చేసిన కుట్రే
కారణమని చెబుతూ రాసిన కథ ఇది.
"రామారావుగారు రచయితగా తన కథల్లో తరచూ కనిపించరు. ఆయన తన కథా
వివరణ కోసం ఒక వక్తని వేరేగా తయారు చేస్తారు. కథలో సంఘటనలనీ, ఇతర
సమాచారాన్నీ మనకి వ్యాఖ్యానించే ఈ వక్తకీ, కథలో ఇతర పాత్రలకీ వెనకాతల రచయిత
రామారావుగారుంటారు," కారా మాష్టారి కథన శైలి గురించి వేల్చేరు నారాయణరావు
గారు వెలిబుచ్చిన అభిప్రాయమిది. 'కుట్ర' కథని కూడా ఒక వక్తే చెబుతాడు.
అతడెవరన్న వివరం పాఠకులకి తెలీదు. ఓ మామూలు మనిషి. ప్రపంచ జ్ఞానం ఉన్న
మనిషి. చట్టాల వెనుక ఉన్న ఉద్దేశాలని అర్ధం చేసుకోగల మనిషి. అతగాడు పట్నం
కోర్టులో జరుగుతున్న కాన్స్పిరసీ కేసుని గురించి చెప్పడం మొదలు పెట్టి,
నెమ్మది నెమ్మదిగా చట్టాలు, రాజ్యాంగం, పంచ వర్ష ప్రణాళికల దగ్గరికి
తీసుకెళతాడు.
"వరల్డు ప్రిమిటివ్ ఎకానమీల్లో ప్రిమిటివెస్ట్ ఎకానమీ -
బియ్యవిచ్చి కరేపాకు కొనుక్కొనే పధ్ధతి ఇప్పటికీ - అమల్లో ఉన్న దేశం, మన
దేశం" అంటూ మొదలు పెట్టి, "గాంధీగారూ తమ కేడర్నీ ఖద్దరొడకమన్నారు. ఎల్తే
జైలు కెళ్ళమన్నాడు. అంతేగాని ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ లాటి సమస్యల మీద
పుస్తకాలేనా తిరగెయ్యమన్నాడా? యంత్రాంగంలో దూరి పాలానానుభవం
సంపాదించమన్నాడా? సైన్యంలో దూరి వార్ లోనూ పీస్ లోనూ దేశాన్ని డిఫెండ్
చేయడం నేర్చుకోమన్నాడా? ...నాకు తెలిసినంతవరకూ మన స్వతంత్ర యోధులందరూ ఈ
తంత్రం సంగతొదిలేసి తక్కిన విద్దెలు నేర్చుకున్నారు" అంటూ కుట్ర జరిగిన
నేపధ్యాన్ని అరటిపండు ఒలిచినట్టుగా వివరిస్తాడు వక్త.
కారా మేష్టారి కథా శిల్పంలో ఉండే సొగసదే. కథలో పాత్రలు
నేరుగా మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపించడం, చెప్పదలచుకున్న విషయాన్ని
ఒక్కొక్కటిగా అర్ధం కాకపోవడం అనే సమస్యే లేనివిధంగా ఉత్తరాంధ్ర నుడికారంలో
వివరించడం. ఒకానొక ఎకనామిస్టు - ఏలినవారికి నిజంగా తెలియకుండానో లేక వారు
తెలియనట్టు నటించిన సందర్భంలోనో - మిక్సుడ్ ఎకానమీ పేరుతో మొదటి రెండు
పంచవర్ష ప్రణాళికలకీ రాజముద్ర వేయించేశాడు. "ఆడు మొదటి ప్లాను ఎత్తుకోవడవే
అగ్రికల్చర్ కి ఫస్టు ప్రిఫరెన్సు అంటూ ఎత్తుకున్నాడనా?
ఎందుకెత్తుకున్నాడూ? వ్యావసాయిక ఉత్పత్తులు పెరిగితేగాని ఒక టైపాఫ్
ఇండస్ట్రీకి పునాదుండదు," అంటూ మొదలు పెట్టి అసలు కుట్రలోకి వచ్చేస్తాడు.
అది పరిశ్రమలకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చెప్పబడ్డ రెండో పంచవర్ష ప్రణాళిక
(1956-61).
మొత్తం పెట్టుబడిని రెండు సెక్టార్ల కింద విభజించి, ప్రజల
పెట్టుబడితో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం నడిపే పరిశ్రమలన్నీ పబ్లిక్
సెక్టారు గానూ, పెట్టుబడి ఉన్న ప్రైవేటు వ్యక్తుల షేర్లతో నడిచే ప్రైవేటు
సెక్టారు. ఈ రెండు సెక్టార్లకీ క్లాష్ రాకుండా ఉండడం కోసం, హెవీ
ఇండస్ట్రీస్ గా చెప్పబడే భార పరిశ్రమలు పబ్లిక్ సెక్టారుకీ, నిత్యావసర
వస్తువులు తయారు చేసే చిన్న పరిశ్రమలని ప్రైవేట్ సెక్టార్ కీ
కేటాయించడంలోనే అతిపెద్ద కుట్ర దాగి ఉందన్నది వక్త అభిప్రాయం. కాలక్రమంలో
హెవీ ఇండస్ట్రీస్ నష్టాల్లోపడి అమ్మకాలకి రావడం, ప్రభుత్వ సాయంతోనే
ప్రైవేటు సెక్టారు వాటిని సొంతం చేసుకోవడం, ఈ మొత్తం వ్యవహారంలో అధికార
ప్రతిపక్ష పార్టీల, సేవాసంస్థల పేరుతో నడిచే చైన్ క్లబ్బుల, పత్రికల పాత్ర
ఇవన్నీ వరసగా చెప్పుకుంటూ వచ్చి "నమ్మిన జన సామాన్యాన్ని నాయకుల్లో, పవర్లో
ఉన్న పార్టీయో, పార్టీలో మనుషులో దగా చేస్తే అది దేశ ద్రోహం కాదా?
ఆళ్లెవరేనా కానీ ఆ చేసీ దగాని బైటపెట్టడం, ఎదుర్కోమనడం, ఎదుర్కోవడం - ఇదా
దేశ ద్రోహం?" అని ప్రశ్నిస్తాడు వక్త.




No comments:
Post a Comment