Oct 11, 2011

గాంధీజీ సిద్ధాంతానికి తూట్లు...

గాంధీ విగ్రహానికి నరేంద్ర మోడీ నివాళులర్పించడం వంటి చిత్రాలు దేశ లౌకికత్వానికి రాగల ముప్పును సూచిస్తున్నాయి. మోడీ నిర్వచనాలకు అనుగుణంగా ఆధునిక భారత దేశ దార్శనికతను మలచడం బలోపేతం చేయడం వంటి వాటికి గాంధీ పుట్టిన గుజరాత్‌ వేదికగా మారింది. గుజరాత్‌ మాజీ ఐపిఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌ను నరేంద్ర మోడీ ప్రభుత్వం అరెస్టు చేయడంలో ఇది ప్రతిబింబిస్తుంది. గుజరాత్‌లో నరమేధం వెనుక కొంతమంది అత్యున్నత స్థాయీ వ్యక్తులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల పాత్రను నిరూపించే సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసినందుకే భట్‌ను అరెస్టు చేశారు. సీతారాం ఏచూరి
గాంధీజీ జయంతికి సంబంధించిన విశేషాల కంటే ఆయన వర్థంతికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి జరుపుకోవాలని కళాశాలలో నా సీనియర్‌, ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్‌ షాహిద్‌ అమిన్‌ ఎప్పుడూ చెబుతుండేవాడు. ఇందులో కొంత నిజం ఉంది. మనకు ఢిల్లీలో తీస్‌ జాన్యువరీ మార్గ్‌ పేరుతో ఒక రోడ్డు ఉంది. దో అక్టోబర్‌ మార్గ్‌ లేదు. గాంధీజీ జీవనం, కార్యాచరణ, ఆధ్యాత్మికతత్వం, భారత దేశం గురించి గాంధీ దార్శనికతను పటిష్టం చేసి ఘనంగా జరుపుకోవాల్సి ఉంది. 142వ జయంతి సందర్భంగా గాంధీజీ సిద్ధాంతాలు నేటి కాలమాన పరిస్థితులకు వర్తిస్తాయా అనే అంశంపై జెఎన్‌యు విద్యార్థుల మధ్య జరిగిన చర్చతో రాజ్యసభ టివి చానెల్‌ ప్రారంభమైంది. ప్రముఖ చరిత్రకారులు, మేథావులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్న ఆ చర్చలో తొలిపలుకులు మాట్లాడే అవకాశం నాకు లభించింది. దీనికి ముందుగా పేదరికంపై ప్రణాళికా సంఘం అంచనాలు, అన్నా హజారే, నరేంద్ర మోడీ నిర్వహించిన దీక్షలు, గౌతమ బుద్డుడు, అంబేద్కర్‌, ఎన్‌జిఒ ఉద్యమాల పాత్ర మొదలైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ చర్చ ఎంత సందర్భ రహితంగా జరిగిందో దీనినిబట్టే స్పష్టమవుతోంది.
మనం మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీని దక్షిణాఫ్రికా పంపగా తాము ఆయనను మహాత్ముడ్ని చేసి భారత్‌కు తిప్పి పంపినట్లు దక్షిణాఫ్రికా వీరోచిత పోరాట ఉద్యమ నాయకులు మనకు తరచూ గుర్తు చేస్తుంటారు. గాంధీ జీవితంలో, ఆయన జీవన శైలిలో చోటుచేసుకున్న మార్పులు ఎప్పుడూ ప్రాధాన్యత సంతరించుకుంటాయి, అవి అన్ని కాలమాన పరిస్థితుల్లో ఆసక్తి రేపుతుంటాయి. దక్షిణాఫ్రికా నుండి తిరిగివచ్చిన తరువాత హోంరూల్‌ ఉద్యమంలో పాల్గొనేందుకు గాంధీ నిరాకరించాడు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ఆందోళన నిర్వహించేందుకు తాను వ్యతిరేకమని గాంధీ చెప్పాడు. ఒక పరిశీలకునిగా, ఒక విద్యార్థిగా ఆయన దేశవ్యాప్తంగా పర్యటించాడు. భారత్‌ గురించి, దేశంలోని ప్రజల గురించి అవగాహన పెంపొందించుకునే ప్రక్రియలో భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రజల అభిమానం విశేషంగా చూరగొన్న నాయకునిగా మారాడు. ప్రజలను ఉత్తేజపరచడంలో ఆయనకు సాటిరాగల నాయకుడు మరొకరు ఉండబోరు.
విప్లవధోరణి సంతరించుకుంటూ పరిధి అతిక్రమించిందని భావించినపుడు ప్రజల భావోద్వేగాలను నియంత్రించడంలో కూడా ఆయనకు సాటిరాగల వారు మరొకరు లేరు. ఆయన 1918లో మొట్టమొదటిసారిగా నిరాహార దీక్ష ఆయుధాన్ని అహ్మదాబాద్‌ కార్మికవర్గం నిర్వహించిన మిలిటెంట్‌ పోరాటాన్ని నియంత్రిం చేందుకు ప్రయోగించాడు. చౌరీచౌరాలో ప్రజలు తిరుగుబాటు చేయడంతో ఆయన శాసనోల్లంఘ నోద్యమాన్ని ఉపసంహరించు కున్నాడు. ఫలితంగా స్వాతంత్రోద్యమం ఐదు సంవత్సరాలపాటు నిలిచి పోయింది. గాంధీ తీసుకున్న ఇటువంటి నిర్ణయాలను కమ్యూనిస్టులు మాత్రమే కాకుండా జవహర్‌ లాల్‌ నెహ్రూ, కాంగ్రెస్‌లోని అనేకమంది ప్రముఖులు ఆనాడు వ్యతిరేకించారు. ''మన పోరాటంలో తీవ్ర స్థాయిలో ఉన్న కొన్ని అంశాలను, పౌర ప్రతిఘటనను గాంధీజీ నిలిపివేశారనే విషయాన్ని తెలుసుకుని మేము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం'' అని నెహ్రూ రాశారు.
ఇది దేశంలో మత ఘర్షణలు పెరగడానికి దోహదం చేసింది. మరోవైపు 1924 కాన్పూర్‌, 1929 మీరట్‌, ఇతర కుట్రకేసులను బనాయించి కమ్యూనిస్టులపై దుష్ట అణచివేత చర్యలకు పాల్పడేందుకు అవకాశమిచ్చింది. ఆ అసంతృప్తే అనేకమంది కాంగ్రెస్‌ నాయకులను కమ్యూనిస్టులు కావడానికి దోహదం చేసింది. భగత్‌ సింగ్‌ హిందుస్తాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ ఆర్మీని 1928లో నెలకొల్పడానికి కారణమైంది. భగత్‌ సింగ్‌ కేసు గురించి బ్రిటిష్‌ పాలకులతో ప్రస్తావించనందుకు గాంధీజీని ఎన్నటికీ క్షమించబోనని జెఎన్‌టియు విద్యార్థి అడిగిన ఒక ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. గాంధీ హత్యకేసులో వి డి సావర్కర్‌పై దాఖలైన కేసు కంటే భగత్‌ సింగ్‌పై నమోదు చేసిన కేసు న్యాయపరంగా బలహీనమైంది. సావర్కర్‌ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేశారు. భగత్‌ సింగ్‌ ఎప్పుడూ తాత్కాలిక ఉపశమనాన్ని, క్షమాబిక్షను అనుమతించలేదు. అందువల్లనే అతడు మా దృష్టిలో కలకాలం నిలిచిపోయే ధీరోదాత్తుడయ్యాడు.
సంపూర్ణ స్వాతంత్య్రం డిమాండ్‌ చేస్తూ ఎఐసిసి అహ్మదాబాద్‌ సమావేశంలో మౌలానా హస్రత్‌ మొహానీ, స్వామి కుమార్‌ ఆనంద్‌ కమ్యూనిస్టు పార్టీ తరఫున ప్రతిపాదించిన తీర్మానాన్ని గాంధీజీ వ్యతిరేకించాడు. కాంగ్రెస్‌ 1930 లాహోర్‌ సమావేశంలో సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం ఆమోదించింది. ప్రజలను కార్యోన్ముఖులను చేయడంలో గాంధీ ఎంత శక్తిసంపన్నుడో సమస్యలను గుర్తించడంలో కూడా అంతే సామర్ధ్యం కలవాడు. ఉప్పు, దండి సత్యాగ్రహాలు ఇందుకు తార్కాణాలుగా నిలుస్తాయి. ప్రజల మిలిటెంట్‌ పోరాటాలను నియంత్రించడంలో ఆయన సామర్ధ్యం అణచివేతకు గురయ్యే వర్గానికి, అణచివేతకు పాల్పడే వర్గానికి ఆమోదయోగ్యుడైన నాయకుడ్ని చేసింది. భారత దేశంలో అత్యంత పెద్ద పెట్టుబడిదారు ఇంట్లో ఉంటూ ప్రజలు ఉద్యమించేలా చేయగల సామర్ధ్యం ఆయన సొంతం.
నెహ్రూ, సుభాష్‌ చంద్ర బోస్‌, పటేల్‌, అంబేద్కర్‌, భారతదేశం గర్వించతగ్గ ఇతర దార్శనికుల మద్దతుతో ఆధునిక లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్‌ కోసం స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించాడు. అటువంటి భారతదేశ నిర్మాణం కోసం భారత ప్రజలను సమాయత్తం చేస్తూ వారికి నాయకత్వం వహిస్తున్న గాంధీజీ హత్యకు గురయ్యారు. ఆయన మృతితో మతోన్మాద శక్తుల డాడుల నుండి ఆధునిక భారత దేశానికి విముక్తి కల్పించే దార్శనికత కొత్త దశ ప్రారంభమైంది.
గాంధీ విగ్రహానికి నరేంద్ర మోడీ నివాళులర్పించడం వంటి చిత్రాలు దేశ లౌకికత్వానికి రాగల ముప్పును సూచిస్తున్నాయి. మోడీ నిర్వచనాలకు అనుగుణంగా ఆధునిక భారత దేశ దార్శనికతను మలచడం బలోపేతం చేయడం వంటి వాటికి గాంధీ పుట్టిన గుజరాత్‌ వేదికగా మారింది. గుజరాత్‌ మాజీ ఐపిఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌ను నరేంద్ర మోడీ ప్రభుత్వం అరెస్టు చేయడంలో ఇది ప్రతిబింబిస్తుంది. గుజరాత్‌లో నరమేధం వెనుక కొంతమంది అత్యున్నత స్థాయీ వ్యక్తులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల పాత్రను నిరూపించే సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసినందుకే భట్‌ను అరెస్టు చేశారు.
ఆధునిక భారతదేశ నిర్మాణంలో గాంధీ దార్శనికతను రూపుమాపి ప్రజలకు రాజ్యాంగబద్ధంగా లభించే హక్కులను, స్వేచ్ఛలను కాలరాసేందుకు, లౌకిక వ్యవస్థ మూలాలను దెబ్బతీసేందుకే ఆయన హత్య జరిగింది. అయితే ఆ శక్తుల ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించకుండా అడ్డుకోగలిగాం. సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు, ప్రజాజీవనంలో ఉన్నత నైతిక ప్రమాణాలు నెలకొల్పేందుకు, అభిప్రాయభేదాలకు అతీతంగా ఆయన పోరాట విధానాలను అవలంభించేందుకు ఆధునిక భారతదేశాన్ని నిర్మించేందుకు వేదికలను రూపొందించాలి. గాంధీజీ జననంతోపాటు ఆయన హత్య నుండి మనం నేర్చుకోతగ్గ పాఠాలు ఇవే.

No comments: